Union Budget 2025: ‘బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ చికిత్స’ - బడ్జెట్ పై రాహుల్ గాంధీ సెటైర్
Union Budget 2025: కేంద్రం శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ బడ్జెట్ ఎలాంటి చొరవ చూపలేదని విమర్శించారు. ఈ బడ్జెట్ ‘బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ చికిత్స’ ఉందన్నారు.
Union Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025 బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ చికిత్స లా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. 'ప్రపంచ అనిశ్చితి మధ్య, మన ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక భారీ మార్పు అవసరం. కానీ ఈ ప్రభుత్వం ఆ దిశగా ఏ ప్రయత్నం చేయలేదు' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, వేతన పెంపులో స్తబ్దత, వినియోగంలో పెరుగుదల లేకపోవడం, ప్రైవేట్ పెట్టుబడుల మందగమనం, సంక్లిష్టమైన జీఎస్టీ వ్యవస్థ వంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపలేదని విమర్శించారు.
ఇది బిహార్ బడ్జెట్
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ బడ్జెట్ లా లేదని, బిహార్ రాష్ట్ర బడ్జెట్ లా ఉందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్ పైననే కేంద్ర బడ్జెట్ పూర్తి దృష్టి పెట్టిందని ఆరోపించింది. బిహార్ కు నరేంద్ర మోదీ ప్రభుత్వం "బొనాంజా" ఇస్తున్నట్లు కనిపిస్తోందని, అదే కూటమికి మరో స్తంభమైన ఆంధ్రప్రదేశ్ ను మాత్రం "క్రూరంగా" విస్మరించిందని ఆరోపించింది. ‘‘ఈ బడ్జెట్ లో కేవలం ఆదాయ పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఊరట లభించింది. ఇది ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి’’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.
నాలుగు ఇంజన్లతో పట్టాలు తప్పింది..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాలుగు అభివృద్ధి ఇంజిన్ల గురించి మాట్లాడారని, అయితే, ఆ నాలుగు ఇంజన్లతో కూడా బడ్జెట్ ను పూర్తిగా పక్కదారి పట్టించారని కాంగ్రెస్ విమర్శించింది. ‘వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులు అభివృద్ధికి నాలుగు పవర్ ఇంజిన్లు అని నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది, ఎంఎస్పీ సహా రైతుల డిమాండ్లపై ఆర్థిక మంత్రి పూర్తిగా మౌనం వహించారని ఆరోపించింది. భారత్ లో ఫేక్ గా మారిన మేక్ ఇన్ ఇండియాకు ఇప్పుడు నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ మిషన్ అనే కొత్త పేరు వచ్చిందని ఎక్స్ పోస్ట్ లో జైరాం రమేశ్ పేర్కొన్నారు.