Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్న వ్యక్తి.. అప్పుడు ఆయన ఏం చేశారంటే!
Rahul Gandhi: గుజరాత్లోని ఓ ఎన్నికల సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తుండగా.. ఓ వ్యక్తి అంతరాయం కలిగించారు. ఆ సందర్భంలో రాహుల్ ఏం చేశారంటే..
Rahul Gandhi: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మొదలుపెట్టారు. భారత్ జోడో యాత్రకు కాస్త విరామం ప్రకటించి.. ఆ రాష్ట్రానికి వెళ్లారు. సూరత్ జిల్లాలోని మహువా ప్రాంతంలో నిర్వహించిన సభలో రాహుల్ సోమవారం పాల్గొన్నారు. అయితే సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తుండగా.. ఓ వ్యక్తి అంతరాయం కలిగించారు. హిందీలోనే మాట్లాడాలని, తమకు గుజరాత్లో అనువాదం అవసరం లేదని గట్టిగా అరిచారు. అప్పుడు రాహుల్ గాంధీ ఎలా స్పందించారంటే..
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi: ఇదీ జరిగింది
మహువా సభలో రాహుల్ గాంధీ హిందీలో ప్రసంగించారు. ఆ మాటలను ట్రాన్స్లేటర్.. గుజరాతీలో అనువాదం చేశారు. ఈ క్రమంలో ట్రాన్స్లేటర్ వైపు రాహుల్ గాంధీ చూశారు. ఈ గ్యాప్లో జనాల నుంచి ఓ వ్యక్తి గట్టిగా అరిచారు. “మీరు హిందీలో మాట్లాడండి. మేం అర్థం చేసుకుంటాం. మాకు అనువాదం అవసరం లేదు” అని అరిచారు. స్టేజ్పై ఉన్న రాహుల్ గాంధీకి ఇది వినిపించింది. ఆయన కూడా స్పందించారు. “చలేగా హిందీ? (హిందీ సరేనా)” అని అందరి అభిప్రాయాన్ని కోరారు. ఆ సమయంలో సరే అన్నట్టు ప్రజలు హర్షధ్వానాలు చేశారు. దీంతో ట్రాన్స్లేటర్ లేకుండానే రాహుల్ గాంధీ.. హిందీలో ప్రసంగం కొనసాగించారు.
గిరిజనులే ఈ దేశానికి తొలి యజమానులని, అయితే ఇప్పుడు వారి హక్కులను అధికార బీజేపీ కాలరాస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోర్బీ వంతెన ప్రమాదంపై అధికార బీజేపీని ఆయన విమర్శించారు. ప్రమాదానికి కారణమైన నిజమైన నిందితులపై ఎలాంటి చర్యలు లేవని, కరప్షన్, కమిషన్ మోడల్ను బీజేపీ అమలు చేస్తోందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రుణాలు, నిరుద్యోగం సమస్యలపై గుజరాత్ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.
Gujarat Elections: ముమ్మరంగా ప్రచారం
డిసెంబర్ లో జరగనున్న గుజరాత్ శాసనసభ ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. బీజేపీ తరఫున వరుసగా సభల్లో పాల్గొంటున్నారు. ఆమ్ఆద్మీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా రంగ ప్రవేశం చేశారు. దీంతో గుజరాత్ ఎన్నికల ప్రచారం మరింత హీట్గా మారింది.
27 సంవత్సరాలుగా గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉంది. మరోసారి పీఠాన్ని దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకొని గుజరాత్లో గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఈసారి ఆమ్ఆద్మీ పార్టీ కూడా ప్రధాన పోటీదారుగా కనిపిస్తోంది. గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మొత్తంగా ఈసారి గుజరాత్ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు.
Gujarat Elections Dates: గుజరాత్ ఎన్నికల తేదీలు
182 సీట్లు ఉన్న గుజరాత్ అసెంబ్లీకి రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 1న తొలి దశ, 5వ తేదీన రెండో దశ పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.