మొహాలీ గ్రెనెడ్ దాడి వెనుక ఖలిస్తాన్ - ఐఎస్ఐ లింక్
పంజాబ్లోని మొహాలీలో కొన్ని రోజుల క్రితం ఇంటలిజెన్స్ ప్రధాన కార్యాలయం ఉన్న భవనంపై గ్రెనెడ్ దాడి జరిగింది. ఈ దాడికి కుట్రదారులను పోలీసులు గుర్తించారు. 2017 నుంచి కెనడాలో ఉంటున్న లఖ్బీర్ సింగ్ లాందా ఈ దాడికి సూత్రధారి అని నిర్ధారించారు.
మొహాలీ దాడితో సంబంధం ఉందన్న సమాచారంతో శుక్రవారం పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ దాడి వెనుక ప్రధాన కుట్రదారుగా కెనడాలో నివాసం ఉంటున్న పంజాబ్కు చెందిన లఖ్బీర్ సింగ్ లాందాను గుర్తించారు. పాకిస్తాన్లో ఉంటున్న ఖలిస్తానీ ఉగ్రవాద హర్వీందర్ సింగ్ రిందాతో లఖ్బీర్ సింగ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. మొహాలీలో ఉన్న పంజాబ్ ఇంటలిజెన్స్ విభాగం ప్రధాన కార్యాలయ భవనంపై ఈ సోమవారం రాకెట్ ద్వారా గ్రెనెడ్ను పేల్చారు. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
ట్రెండింగ్ వార్తలు
ఐఎస్ఐ హ్యాండ్
పాకిస్తాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ `ఐఎస్ఐ` ఆదేశాల మేరకు ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ `బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్`, మొహాలీలోని స్థానిక గ్యాంగ్స్టర్లతో కలిసి ఈ దాడికి పాల్పడ్డారని పంజాబ్ డీజీపీ వీకే భావ్రా వెల్లడించారు. ఇందులో ప్రధాన కుట్రదారు కెనడాలో నివాసం ఉంటున్న లఖ్బీర్ సింగ్ లాందా అని తెలిపారు. లాందా, తన సహచరుడు నిషాన్ సింగ్, చాదత్ సింగ్లతో కలిసి ఈ రాకెట్ ప్రొపెల్లెంట్ గ్రెనెడ్(ఆర్పీజీ) దాడికి పాల్పడ్డారని వివరించారు. వారికి స్థానికుడైన నిధాస్ సింగ్ స్థానికంగా ఆశ్రయం కల్పించారన్నారు. లాందా సూచనల మేరకు ఆర్పీజీని నిశాన్ సింగ్ కలెక్ట్ చేసుకున్నాడు. దాన్ని చాదత్ సింగ్కు ఇచ్చాడు. ప్రస్తుతం చాదత్ సింగ్ పరారీలో ఉన్నాడని డీజీపీ తెలిపారు.
టాపిక్