Manipur viral video : సీబీఐ చేతికి.. మణిపూర్ వైరల్ వీడియో కేసు
Manipur viral video case : మణిపూర్ వైరల్ వీడియోకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. ఈ మేరకు ఓ అఫిడవిట్ను దాఖలు చేసింది.
Manipur viral video case : మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి ఊరేగించిన సంఘటనకు సంబంధించిన కేసును సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ)కి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన విచారణను, మణిపూర్ బయట నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
అఫిడవిట్లో ఉన్న వివరాలు..
ఈ ఏడాది మే 3 మణిపూర్లో నిరసనలు మొదలయ్యాయి. కాగా.. మే 4న కుకి జాతికి చెందిన ఓ గ్రామంపై దాడి చేసిన దుండగులు.. ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి, ఊరేగించారు. ఓ ఫేక్ వీడియోను చూసి, కోపంతో ఈ దారుణానికి ఒడిగనట్టు తెలుస్తోంది. బాధితుల్లో ఒకరిపై సామూహిక అత్యాచారం కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు జులై 20 ప్రాంతంలో బయటకొచ్చాయి. ఫలితంగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని సర్వత్రా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ ఈ వ్యవహారంపై స్పందించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.
సుప్రీంకోర్టులో ఉన్న మణిపూర్ వీడియో కేసుకు సంబంధించి అఫిడవిట్ను దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం.
Manipur violence latest news : "నిందితులను పట్టుకునేందుకు అనేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశాము. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను ఎస్పీ ర్యాంక్ అధికారికి అప్పగించాము. ఇతర సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశాము. చివరిగా.. ఓ వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేశాము. దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించుకున్నాము." అని అఫిడవిట్లో పేర్కొంది కేంద్రం.
"మహిళలపై నేరాలను కేంద్రం సహించబోదు. మణిపూర్లో జరిగింది అత్యంత ఘోరమైన ఘటన అని కేంద్రం భావిస్తోంది. దీనిని తీవ్రంగా పరిగణించడమే కాకుండా.. బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది," అని కేంద్రం స్పష్టం చేసింది.
మరోవైపు మణిపూర్ వైరల్ వీడియో ఘటనపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో మానవ హక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. యూరోపియన్ పార్లమెంట్ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. దీనిని కేంద్రం తిప్పికొట్టింది. ఇది భారత దేశ అంతర్గత విషయం అని, ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.
సంబంధిత కథనం