Presidential Election Result : ద్రౌపదీ ముర్ము భారీ విజయం.. రాష్ట్రపతి పీఠంపై తొలి ఆదివాసీ మహిళ
ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. దేశ అత్యున్నత పదవిని చేపట్టనున్న తొలి ఆదివాసీ మహిళగా నిలిచిపోనున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము గెలుపొందారు. ముందునుంచే అనుకుంటున్నట్టుగా ఆమె భారీ ఆధిక్యంతో గెలిచారు. ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై గెలుపొందారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ఈనెల 24తో ముగియనుంది. 25వ తేదీన ముర్ము ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ గెలుపుతో రాష్ట్రపతి పీఠమెక్కనున్న తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపదీ ముర్ము చరిత్ర సృష్టించారు. ఒడిశా మంత్రిగా, ఝార్ఖండ్ గవర్నర్గా సేవలు అందించిన అనుభవం ఆమెకు ఉంది.
ట్రెండింగ్ వార్తలు
మెుదటి రౌండ్ లో మొత్తం 748 మంది ఎంపీల ఓట్లను లెక్కించారు. ద్రౌపది.. 540 ఓట్లు అంటే 3,78,000 విలువైన దక్కాయి. ఈ డౌండ్లో సిన్హాకు 1,45,600 విలువైన ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇంకోవైపు.. 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇక రెండో రౌండ్లో రెండో రౌండ్లో ఆంధ్రప్రదేశ్తోపాటుగా 10 రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల ఓట్లు-1138 ఓట్లు, అంటే 1,49,575 విలువైనవి లెక్కించగా.. ముర్ముకు 809 ఓట్లు, అంటే 1,05,299 విలువ దక్కాయి. ఇదే రౌండ్లో సిన్హాకు 329 ఓట్లు పడ్డాయి వాటి విలువ 44,276.
మూడో రౌండ్ వచ్చే సరికి.. ద్రౌపదీ ముర్ము ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. 50 శాతం మార్క్ దాటారు. ముర్ముకు 2,161 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 1,058 ఓట్లు వచ్చాయి. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీముర్ముకు పోలైన మొత్తం ఓట్ల విలువ 5,77,777. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు పోలైన మొత్తం ఓట్ల విలువ 2,61,062గా ఉంది. దీంతో భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము పీఠం ఎక్కనున్నారు.