Supreme Court: బిల్లుల ఆమోాదంలో రాష్ట్రపతికి ఉన్న అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు-president should decide on bills reserved for her consideration in 3 months supreme court ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Supreme Court: బిల్లుల ఆమోాదంలో రాష్ట్రపతికి ఉన్న అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court: బిల్లుల ఆమోాదంలో రాష్ట్రపతికి ఉన్న అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Sudarshan V HT Telugu

Supreme Court: తన పరిశీలనకు వచ్చిన బిల్లుల ఆమోదానికి సంబంధించి రాష్ట్రపతికి ఉన్న బాధ్యతలు, అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లుల ఆమోదంలో జాప్యం జరిగితే తగిన కారణాలు తెలపాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో ప్రభుత్వ విధులను అడ్డుకుంటున్నట్లుగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

సుప్రీంకోర్టు (ANI)

Supreme Court: రాష్ట్రాల గవర్నర్లు తన పరిశీలనకు పంపిన బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి పాటించాల్సిన విధి విధానాలను సుప్రీంకోర్టు వివరించింది. గవర్నర్ ఆ బిల్లును పంపిన తేదీ నుంచి మూడు నెలల్లోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మూడు నెలల్లోపు ఆ బిల్లును ఆమోదించడం కానీ, తిరస్కరించి, పున: పరిశీలనకు పంపించడం కానీ చేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకుంటున్నట్లుగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

తమిళనాడు గవర్నర్ కేసులో..

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ లతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 8న 415 పేజీల తీర్పులో తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి నిలిపివేసి రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసిన 10 బిల్లులకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లందరూ చర్య తీసుకోవడానికి ఒక కాలపరిమితిని నిర్దేశించారు, "హోం మంత్రిత్వ శాఖ నిర్దేశించిన కాలపరిమితిని అవలంబించడం సముచితమని మేము భావిస్తున్నాము. బిల్లును తన పరిశీలనకు పంపిన తేదీ నుండి మూడు నెలల వ్యవధిలో గవర్నర్ సంబంధిత బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము" అని వారు చెప్పారు.

కారణం చెప్పాలి..

ఏదైనా జాప్యం జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన కారణం తెలియజేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒకవేళ గవర్నర్ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేసి, రాష్ట్రపతి ఆమోదాన్ని నిలిపివేసే పరిస్థితి తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ తన వద్దకు వచ్చిన బిల్లుకు ఆమోదముద్ర వేయవచ్చు లేదా ఆమోదాన్ని నిలిపివేసి రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయవచ్చు.

నిర్దిష్ట కాలపరిమితి లేదు

‘‘రాష్ట్రపతి లేదా గవర్నర్ తన వద్దకు వచ్చిన బిల్లుల ఆమోదానికి సంబంధించి ఒక నిర్దిష్ట కాలపరిమితి రాజ్యాంగంలో లేదు. అయినప్పటికీ, ఒక బిల్లును "అనవసరంగా ఎక్కువ కాలం" ఆలస్యం చేయడం "రాష్ట్ర చట్టాన్ని రూపొందించే యంత్రాంగానికి అడ్డంకిగా" పరిగణించబడుతుంది. దీనిని పాటించడంలో విఫలమైతే గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయస్థానాల న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.

నెలరోజుల్లో నిర్ణయం

ఒకవేళ బిల్లు ఆమోదం నిలిపివేయడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేసిన పక్షంలో రాష్ట్ర మంత్రిమండలి సహకారం, సలహా మేరకు గరిష్టంగా నెల రోజుల వ్యవధికి లోబడి గవర్నర్ అలాంటి చర్య తీసుకునే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. రాష్ట్ర మంత్రిమండలి సలహాకు విరుద్ధంగా ఆమోదాన్ని నిలిపివేస్తే గరిష్టంగా మూడు నెలల్లోగా గవర్నర్ సందేశంతో సహా బిల్లును తిరిగి పంపాలని ధర్మాసనం పేర్కొంది. గవర్నర్ బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, నిరవధికంగా జాప్యం చేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారికి సంపూర్ణ వీటో లేదా పాకెట్ వీటో అనే అధికారం లేదని తెలిపింది. వారు వారి రాజ్యాంగ అధికారాలను ఏకపక్షంగా ఉపయోగించకూడదని ధర్మాసనం పేర్కొంది.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.