Swearing in ceremony: ఇది ప్రతి పేదవాడి విజయం: ద్రౌపది ముర్ము
swearing in ceremony:తన ఎన్నిక కోట్లాది మంది భారతీయుల్లో విశ్వాసం నింపిందని భారత నూతన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
దేశంలో సమ్మిళి, వేగవంతమైన అభివృద్ధి కోసం అట్టడుగున ఉన్న ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలనే తన సంకల్పాన్ని భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పునరుద్ఘాటించారు. భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆమె పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రసంగించారు. తన ఎన్నిక కోట్లాది మంది భారతీయుల్లో విశ్వాసం నింపిందని అన్నారు.
ట్రెండింగ్ వార్తలు
దేశంలోని పేదలు కలలు కంటారని, అలాగే వాటిని నెరవేర్చగలరని అనడానికి తన ఎన్నికే నిదర్శనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
‘ఈ పదవికి నేను ఎన్నిక కావడం నా సొంత విజయం మాత్రమే కాదు.. దేశంలోని ప్రతి పేదవాడి విజయం..’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు.
పేద గిరిజనుల ఇంటిలో పుట్టిన ఆడపిల్ల అత్యున్నత రాజ్యాంగ పదవికి చేరుకోవడం భారత ప్రజాస్వామ్య శక్తి అని ముర్ము తెలిపారు.
మనం అనేక భాషలు, మతాలు, ఆహారపు అలవాట్లు, ఆచారాలను స్వీకరించడం ద్వారా 'ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్'ని నిర్మిస్తున్నామని రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో ప్రస్తావించారు.
భాగస్వామ్యం, ఏకాభిప్రాయం ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా 75 ఏళ్లలో భారతదేశం పురోగతి సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లిందని చెప్పారు.
భారతదేశం తన స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవం 'అమృత్ కాల్' జరుపుకుంటున్నందున కొత్త ఆలోచనతో ముందుకు వెళుతోందని అన్నారు.
రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతిగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉదయం 10:15 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు.
పదవీకాలం ముగిసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంటుకు రాకతో వేడుకలు ప్రారంభం అయ్యాయి. భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే ముర్ము తన మొదటి ప్రసంగం చేశారు.
రాష్ట్రపతిగా ఎన్నికైన ముర్ము ఈ ఉదయం దేశ రాజధానిలోని రాజ్ఘాట్లో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం పదవీవిరమణ చేస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆయన సతీమణి సవితా కోవింద్లను రాష్ట్రపతి భవన్లో ఆమె కలిశారు.
సంబంధిత కథనం