పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థ నుంచి ఆందోళనకర వార్త బయటకు వచ్చిది. గతేడాడి డిసెంబర్ నుంచి నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దాటి భారత్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని అధికారులు వెల్లడించారు. భారత్లోకి చొరబడి మూడు రకాల దాడులు (కాల్పుల ఘటనలు, బోర్డర్ యాక్షన్ టీమ్ ఆపరేషన్లు, ఐఈడీ పేలుళ్లు) చేసేందుకు డిసెంబర్ నుంచి ప్రతి నెల కనీసం 120 మంది టెర్రరిస్ట్లు ఎల్ఓసీ దగ్గర గుమిగూడారని పేర్కొన్నారు.
గత ఏడాది డిసెంబరులో 167 మంది ఉగ్రవాదులు, ఈ ఏడాది జనవరిలో 146 మంది, ఫిబ్రవరిలో 138 మంది, మార్చిలో 122 మంది ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు చూశారని నిఘా వర్గాల సమాచారం మేరకు అధికారులు తెలిపారు. గత ఏడాది ఇవే నెలల్లో సగటున 40-50 మంది ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.
ఏప్రిల్ 22న 26 మందిని పొట్టనబెట్టుకున్న పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ సైన్యం, గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ గత మూడు, నాలుగు నెలలుగా తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటన సందర్భంగా జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రాక్సీ రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ ఎఫ్ ) ప్రకటించింది. ఈ దాడిలో ఇస్లామాబాద్ పాత్రను నొక్కిచెప్పడానికి భారత్ ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులను గుర్తించింది.
“నియంత్రణ రేఖ (ఎల్ఓసీ), అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి పాకిస్థాన్ అనేక మంది ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లను యాక్టివేట్ చేసినట్లు 2023 చివరి, 2024 ప్రారంభం నుంచి మాకు సమాచారం ఉంది,” అని ఓ అధికారి తెలిపారు.
“గత ఏడాది జనవరి నుంచి మార్చ్ వరకు ప్రతి నెలా 40-50 మంది ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారు. కానీ 2024 డిసెంబర్ నుంచి పాక్ సైన్యం, ఐఎస్ఐ మొత్తం ఉగ్రవాద యంత్రాంగాన్ని యాక్టివేట్ చేశాయి. లోయలోని గురెజ్, ఉరీ, కెరాన్ సెక్టార్ల నుంచి జమ్ములోని భీంబర్ గలీ, పూంచ్, కృష్ణ ఘాటీ, సాంబా వరకు 167 మందికి పైగా ఉగ్రవాదులు సరిహద్దు వెంబడి చొరబడేందుకు సిద్ధమయ్యారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో కూడా 120 మందికి పైగా ఉగ్రవాదులు సరిహద్దుల వెంబడి ఉన్నారు. క్రమం తప్పకుండా కాల్పులు, బీఏటీ దాడులు, ఐఈడీ పేలుళ్లు జరపాలని వారికి ఆదేశాలు ఉన్నాయి,” అని ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ ఓ అధికారి తెలిపారు.
అయితే వీరిలో ఎంతమంది భారత్లోకి చొరబడ్డారో తెలియదు కానీ 55-60 మంది పాక్ ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్లోని వివిధ జిల్లాల్లో తలదాచుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పాకిస్థాన్ నుంచి వచ్చే బ్యాట్ టీమ్స్ (5-6 రెగ్యులర్ ఆర్మీ అధికారులు- టెర్రరిస్ట్ల బృందం) కశ్మీర్లోకి చొరబడి రాత్రివేళ గెరిల్లా రైడ్లు చేసి సైనికులను చంపుతాయి. తలలు నరికేస్తాయి. పని ముగించుకున్న తర్వాత తిరిగి సరిహద్దు దాటి పాకిస్థాన్ ఆర్మీ పోస్ట్ల్లోకి వెళ్లిపోతాయి. వీటిని టెర్రర్ లాంచ్ ప్యాడ్లుగానూ చూస్తారు.
వివిధ లాంచ్ ప్యాడ్లలో సరిహద్దు వెంబడి కేంద్రీకృతమైన ఉగ్రవాదుల్లో దాదాపు 80 శాతం మంది లష్కరే తోయిబాకు చెందినవారని, మరికొందరు జైషే మహ్మద్, అల్ బదర్ సంస్థలకు చెందిన వారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
ఉగ్రవాదులు చొరబాట్లకు ఉపయోగిస్తున్న రూట్లను పసిగట్టేందుకు బీఎస్ఎఫ్, ఆర్మీ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాయి. కానీ పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం, భారత సైన్యం నుంచి తప్పించుకునేందుకు భూమి కింద టన్నెల్స్ తవ్వారా? అన్న అనుమానాలు మొదలైనట్టు మరో అధికారి పేర్కొన్నారు.
“పాకిస్థాన్ తన మాజీ సైనిక అధికారులను సరిహద్దు వెంబడి మోహరించినట్టు తెలుస్తోంది. వీరు.. సామాగ్రి సాయం చేయడంతో పాటు టన్నెల్స్ కూడా తవ్వుతున్నారని బీఎస్ఎఫ్ అధికారులు అంచనా వేస్తున్నారు,” అని ఆ అధికారి తెలిపారు.
2020 లో దళాలు కనుగొన్న సొరంగాలలో ఒకటి 500 మీటర్ల పొడవు, 30 మీటర్ల లోతు ఉంది. ఇది పాకిస్థాన్వైపు దాదాపు 200 మీటర్ల దూరానికి వెళ్లింది. చొరబాటుదారులు దాటడానికి వేచి ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ పైపులను ఈ టన్నెల్ కలిగి ఉండటం గమనార్హం.
వాస్తవానికి, 2019 పుల్వామా దాడిలో పాల్గొన్న జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ మేనల్లుడు ఉమర్ ఫరూక్ 2018 ఏప్రిల్లో సాంబా సెక్టార్లోని సొరంగాన్ని ఉపయోగించి భారత్లోకి ప్రవేశించాడు. అదేవిధంగా, 2016 నగ్రోటా క్యాంప్ దాడిలో నలుగురు దుండగులు కూడా చొరబడటానికి ఒక సొరంగాన్నే ఉపయోగించారు.
"మేము యాంటీ టన్నెల్ టెక్నాలజీని మోహరించాము, మొత్తం సరిహద్దులో భౌతిక తనిఖీలు నిర్వహిస్తున్నాము," అని అధికారి తెలిపారు.
ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్థాన్ ఉపయోగిస్తున్న 22 సొరంగాలను 2001 నుంచి భారత్ గుర్తించింది. మరిన్ని సొరంగాలు ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సంబంధిత కథనం