కేసీఆర్కు ఆ సామర్థ్యం ఉంది.. కాంగ్రెస్ లేకుండా ఇంకో ఫ్రంట్ అసాధ్యం: శివసేన
ముంబై : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీ వ్యతిరేక కూటమిని రూపొందించే ప్రయత్నంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను ముంబైలో కలిసిన మరుసటి రోజు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. కాంగ్రెస్ లేకుండా మరో రాజకీయ ఫ్రంట్ ఎప్పటికీ ఏర్పడదని అన్నారు
కాంగ్రెస్ లేకుండా మరో రాజకీయ ఫ్రంట్ సాధ్యం కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. సోమవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు.

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పలు పార్టీలను ఏకం చేసే ప్రయత్నంగా మారినందున నిన్నటి ముంబై సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
రౌత్ విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ లేకుండా రాజకీయ ఫ్రంట్ ఏర్పడుతుందని మేం ఎప్పుడూ చెప్పలేదన్నారు. ‘మమతా బెనర్జీ రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు సూచించిన సమయంలో కూడా కాంగ్రెస్ను కలుపుకొనిపోవాలని మాట్లాడిన మొదటి రాజకీయ పార్టీ శివసేన. ముఖ్యమంత్రి కేసీఆర్కు అందరినీ తీసుకెళ్లి నడిపించే సామర్థ్యం ఉంది’ అని రౌత్ అన్నారు.
మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్న సంగతి తెలిసిందే.
బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన అనంతర పరిణామాల్లో నిన్నటి సమావేశం సాధ్యమైంది.
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో రాజకీయ ఐక్యత ప్రక్రియను ఈ సమావేశం వేగవంతం చేస్తుందని శివసేన అధికార పత్రిక 'సామ్నా' ఆదివారం పేర్కొంది.
బీజేపీని దేశం నుంచి తరిమి కొట్టాలని, లేదంటే దేశం సర్వనాశనం అవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి గతంలోనే బీజేపీపై మండిపడ్డారు. బీజేపీని అధికారం నుంచి తరిమికొట్టేందుకు రాజకీయ శక్తులు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
బీజేపీకి వ్యతిరేకంగా వివిధ ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా కలవనున్నారు.
సంబంధిత కథనం