Senior citizens: వృద్ధులకు రూ. 5 లక్షల ఉచిత వైద్య చికిత్స అందించే ఆయుష్మాన్ భారత్ పథకం పూర్తి వివరాలు; దరఖాస్తు విధానం-pm modi launches health cover for senior citizens check documents eligibility ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Senior Citizens: వృద్ధులకు రూ. 5 లక్షల ఉచిత వైద్య చికిత్స అందించే ఆయుష్మాన్ భారత్ పథకం పూర్తి వివరాలు; దరఖాస్తు విధానం

Senior citizens: వృద్ధులకు రూ. 5 లక్షల ఉచిత వైద్య చికిత్స అందించే ఆయుష్మాన్ భారత్ పథకం పూర్తి వివరాలు; దరఖాస్తు విధానం

Sudarshan V HT Telugu
Published Oct 29, 2024 03:01 PM IST

PM Modi: 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులందరికీ ఆరోగ్య కవరేజీని అందించే ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన 2 (AB-PMJAY 2) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. ఈ పథకం సుమారు 4.5 కోట్ల కుటుంబాల్లోని ఆరు కోట్ల మంది వృద్ధులకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా.

 ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (PTI)

PM Modi launches AB-PMJAY: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) పథకాన్ని ప్రధాని మోదీ అక్టోబర్ 29న ప్రారంభించారు. ఈ పథకం కింద 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులందరికీ ఉచిత ఆరోగ్య కవరేజీ లభిస్తుంది. ఈ పథకం కింద, ఆయుష్మాన్ కార్డు పొందిన వారు అక్టోబర్ 29 నుండి ఏదైనా ఎంపిక చేసిన ఆసుపత్రులలో రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స పొందవచ్చు.

యూ - విన్ పోర్టల్ కూడా

పుట్టుక నుండి 17 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు ఇచ్చిన టీకాల శాశ్వత డిజిటల్ రికార్డులను భద్రపరిచే యూ - విన్ పోర్టల్ ను కూడా ప్రధాని ప్రారంభించారు. యూ విన్ పోర్టల్ (U-WIN) కోవిడ్ -19 వ్యాక్సిన్ నిర్వహణ కోసం రూపొందించిన కో - విన్ పోర్టల్ తరహాలో ఉంటుంది. హెల్త్ కేర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను పెంచడం తమ ప్రాధాన్య అంశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ రోజు ప్రారంభించిన ఈ రంగానికి సంబంధించిన కార్యక్రమాలు పౌరులకు అత్యున్నత నాణ్యత, సరసమైన సౌకర్యాలను అందుబాటులోకి తెస్తాయన్నారు.

యుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ముఖ్య వివరాలు

1. ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) 2 పథకానికి 70 ఏళ్ల వయస్సు పైబడిన భారతీయులంతా అర్హులే. ఈ పథకం కింద రూ. 5 లక్షల విలువైన వైద్య చికిత్స పొందడానికి అన్ని ఆదాయ వర్గాలవారికి అర్హత ఉంటుంది. ఆధార్ కార్డులోని వయస్సు ఆధారంగా వారికి ఈ ఉచిత చికిత్స లభిస్తుంది.

2. ఈ పథకం ద్వారా 4.5 కోట్ల కుటుంబాల్లోని ఆరు కోట్ల మంది పౌరులకు లబ్ధి చేకూరనుంది.

3. ఈ పథకంలో చేరి, రూ. 5 లక్షల ఉచిత వైద్య చికిత్స సదుపాయం పొందడానికి 70 ఏళ్ల వయస్సు పైబడినవారు పిఎంజెఎవై పోర్టల్ లో లేదా ఆయుష్మాన్ యాప్ లో నమోదు చేసుకోవాలి. ఇప్పటికే ఆయుష్మాన్ కార్డు ఉన్నవారు పోర్టల్ లేదా యాప్ లో మళ్లీ దరఖాస్తు చేసుకుని కొత్త కార్డు కోసం ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

4. ప్రస్తుతం ఢిల్లీ, ఒడిశా, పశ్చిమబెంగాల్ మినహా 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

5. ఏబీపీఎం-జేఏవై కింద ఇప్పటికే కవర్ అయిన కుటుంబాలకు చెందిన 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి రూ .5 లక్షల వరకు అదనపు టాప్-అప్ కవరేజీ లభిస్తుంది (దీనిని వారు 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కుటుంబంలోని ఇతర సభ్యులతో పంచుకోవాల్సిన అవసరం లేదు).

6. పీఎంజేఏవై పథకం కింద 7.37 కోట్ల మంది ఆస్పత్రుల్లో చేరారు. ఈ పథకం కింద ప్రజలకు రూ.లక్ష కోట్లకు పైగా లబ్ధి చేకూరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

7. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు లేదా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను పొందుతున్న సీనియర్ సిటిజన్లు కూడా ఈ స్కీమ్ కింద ప్రయోజనాలు పొందడానికి అర్హులు.

8. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS), ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ECHS), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) వంటి ఇతర పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్లను ఉపయోగిస్తున్న 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు తమ ప్రస్తుత పథకం లేదా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి.

9. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఏబీ పీఎం-జేఏవై పథకం 10.74 కోట్ల పేద, బలహీన కుటుంబాలను కవర్ చేస్తుంది.

10. ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై పథకం కింద పౌరులకు చికిత్స అందించడానికి 2024 సెప్టెంబర్ 1 వరకు 12,696 ప్రైవేటు ఆస్పత్రులతో సహా మొత్తం 29,648 ఆసుపత్రులను ఎంప్యానెల్ చేశారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.