Vande Bharat express : దక్షిణాది తొలి 'వందే భారత్' ఎక్స్ప్రెస్.. ప్రారంభించిన మోదీ
South India Vande Bharat express : బెంగళూరులో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దక్షిణాది తొలి భారత్ వందే ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. అనంతరం భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలుకు కూడా పచ్చ జెండా ఊపారు.
Vande Bharat express South India : దక్షిణాది తొలి 'వందే భారత్' ఎక్స్ప్రెస్ను శుక్రవారం ఉదయం ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్లో పచ్చ జెండా ఊపి, ఈ సెమీ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ను మొదలుపెట్టారు ప్రధాని.
ట్రెండింగ్ వార్తలు
ఆ తర్వాత.. ‘భారత్ గౌరవ్ కాశీ దర్శన్’ రైలును కూడా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
అంతకు ముందు.. బెంగళూరు విధాన సౌధకు వెళ్లిన మోదీ.. ప్రముఖ కవి కనకదాస, మహర్షి వాల్మీకి విగ్రహాలకు నివాళులర్పించారు. వారి చరిత్రలను స్మరించుకున్నారు.
దక్షిణాది తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ విశేషాలు..
ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్.. మైసూరు నుంచి చెన్నై మధ్య ప్రయాణిస్తుంది. మొత్తం మీద 500కి.మీలను 6 గంటల 30నిమిషాల్లో చుట్టేస్తుంది. కేవలం రెండు స్టాప్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. అవి.. కట్పాడి, బెంగళూరు.
పూర్తి సామర్థ్యంతో నడిస్తే.. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్.. చెన్నై నుంచి బెంగళూరుకు కేవలం 3 గంటల్లో చేరుకోగలుగుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
Vande Bharat express Chennai to Mysore : దక్షిణాది తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ సాధారణ కార్యకలాపాలు శనివారం ప్రారంభమవుతాయి.
చెన్నై నుంచి మైసూరుకు వెళ్లే ప్రయాణికుల టికెట్ ధర కార్ చైర్లో అయితే రూ. 1,200గా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే రూ. 2,295గా ఉంది. మైసూరు నుంచి చెన్నైకు వెళ్లే ప్రయాణికుల టికెట్ ధర.. రూ. 1,365- రూ. 2,486గా ఉంది.
చెన్నైలోని ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ)లో ఈ రైలును అభివృద్ధి చేశారు. ఇంటెలిజెంట్ బ్రేకింగ్ సిస్టెమ్ని ఇందులో ఏర్పాటు చేశారు.
అన్ని బోగీలకు ఆటోమెటిక్ డోర్లు, జీపీఎస్ ఆధారిత ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టెమ్, ఆన్బోర్డ్ వైఫ్ హాట్స్పాట్తో పాటు సౌకర్యవంతమైన సీట్లు ఉంటాయి.
భారత దేశ తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను 2019 ఫిబ్రవరి 15న ప్రారంభించారు. ఢిల్లీ- కాన్పూర్- అలహాబాద్- వారణాసి రూట్లో ఇది ప్రయాణిస్తుంది.
ఇటీవలి కాలంలో ఉత్తరాదిన పలు వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించారు మోదీ. కాగా.. వివిధ యాక్సిడెంట్లతో అవి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా పశువులను రైలు ఢీకొడుతున్న ఘటనలు ఆందోళనకరంగా మారాయి.
సంబంధిత కథనం