భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం, ఏప్రిల్ 29న తన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్లోని పహల్గామ్ లో పర్యాటకులపై దాడి చేసి 26 మంది ప్రాణాలు తీసిన నేపథ్యంలో, ఉగ్రవాదులు, వారికి మద్ధతిచ్చే వారిపై భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది.
పహల్గామ్ ప్రతీకార దాడి విషయంలో సాయుధ దళాలకు పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేసే ఆ దాడి విధివిధానాలు, లక్ష్యాలు, దాడి చేసే సమయాన్ని నిర్ణయించడానికి భారత సాయుధ దళాలకు "పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ" ఉందని ప్రధాని మోదీ అన్నారని ఈ పరిణామం గురించి తెలిసిన అధికారులను ఉటంకిస్తూ పీటీఐ వార్తాసంస్థ నివేదించింది.
‘‘ఉగ్రవాదాన్ని అణిచివేయడం మా జాతీయ సంకల్పం’’ అని మోదీ అన్నారు. భారత రక్షణ దళాల సామర్థ్యంపై పూర్తి విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ కూడా పాల్గొన్నారు. అలాగే, ఈ భేటీలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. ఈ సమావేశం 90 నిమిషాల పాటు జరిగింది. ఏప్రిల్ 28 సోమవారం తన అధికారిక నివాసంలో రాజ్నాథ్ సింగ్ ప్రధానితో సమావేశమైన ఒక రోజు తర్వాత ఈ సమావేశం జరగడం గమనార్హం.
కశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకుల ప్రాణాలను ఉగ్రవాదులు బలిగొన్నారు. ఆ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా భారతదేశం ప్రతీకార దాడికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పహల్గామ్ దాడికి కారణమైన ఉగ్రవాదులను, వారికి సపోర్ట్ చేస్తూ, అన్ని విధాలా సహకరిస్తున్నవారిని "భూమి చివరల వరకు" వెంటాడి, 26 మంది అమాయక ప్రజలను చంపినందుకు వారికి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తామని ప్రధాని మోదీ ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనం
టాపిక్