Arvind Kejriwal: ఒకవేళ ఆ నాలుగు కావాలంటే బీజేపీ ఓటు వేయొచ్చు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
Delhi CM Arvind Kejriwal: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన.. ‘నమూనా’ విమర్శలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దీటుగా బదులిచ్చారు.
Delhi CM Arvind Kejriwal: గుజరాత్ ఎన్నికల వేళ అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రెండు పార్టీల నేతలు ఓవైపు ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తూనే.. మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారం నానాటికీ హీటెక్కుతోంది. ఈ తరుణంలో గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఆమ్ఆద్మీపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీటుగా స్పందించారు. ఘాటైన మాటలతో ట్వీట్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
ఉగ్రవాదానికి ఆమ్ఆద్మీ శ్రేయోభిలాషిలా ఉందంటూ యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. “ ఒకవేళ గుండాయిజం, దూషణలు, అవినీతి, మలిన రాజకీయాలు కావాలనుకునే వారు బీజేపీకి ఓటు వేయొచ్చు. ఒకవేళ పాఠశాలలు, ఆసుపత్రులు, విద్యుత్, నీరు, రోడ్లు కావాలంటే మాకు ఓటు వేయండి” అని ట్వీట్ చేశారు అరవింద్ కేజ్రీవాల్. దీంతో పాటు యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా షేర్ చేశారు.
యోగి ఏమన్నారంటే!
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గిర్ సోమ్నాథ్ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ఆమ్ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. “ఢిల్లీ నుంచి వచ్చిన వారిది ఈ ఆమ్ఆద్మీ నమూనా. ఉగ్రవాదానికి వారు శ్రేయోభిలాషులు. ఆయన ఆయోధ్యలో రామమందిరాన్ని వ్యతిరేకిస్తారు. సర్జికల్ స్ట్రైక్స్ పై ప్రశ్నలు వేస్తారు. ఉగ్రవాదం, అవినీతి వారి జన్యువులో భాగంగా ఉంది” అంటూ కేజ్రీవాల్పై తీవ్ర విమర్శలు చేశారు యోగి. అలాగే కాంగ్రెస్ ఎప్పుడూ హిందువుల మనోభావాలను గౌరవించలేదంటూ యోగి ఆరోపించారు.
బీజేపీ.. ఓ వీడియో మేకింగ్ కంపెనీ: కేజ్రీవాల్
తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు సంబంధించిన వీడియోలు బయటికి వస్తుండడం, దానిపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తుండడంపై కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ ఓ వీడియో మేకింగ్ కంపెనీగా మారిపోయిందని కేజ్రీవాల్ విమర్శించారు. “ఢిల్లీలోని ప్రతీవార్డులో వీడియో షాప్స్ ఓపెన్ చేస్తామని బీజేపీ గ్యారెంటీ ఇచ్చింది. వీడియో మేకింగ్ కంపెనీ కావాలో, ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపి.. పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దే పార్టీ కావాలో ప్రజలే నిర్ణయించుకుంటారు” అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD Elections) ఎన్నికలు కూడా వచ్చే నెల 4వ తేదీన జరగనున్నాయి. ఓ వైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమవుతోంది.
Gujarat Elections Dates: గుజారాత్ శాసనసభ ఎన్నికల పోలింగ్ రెండు విడతల్లో జరగనుంది. డిసెంబర్ 1న తొలి విడత, 5వ తేదీన రెండో విడత పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడవుతాయి.