Covid Guidelines in Karnataka: చైనాలో కొవిడ్ మళ్లీ విజృంభిస్తుండటంతో భారత్లోనూ గుబులు రేగుతోంది. రెండేళ్లు అతలాకుతలం చేసిన కరోనా వైరస్ మళ్లీ ఎక్కడ వస్తుందోనన్న ఆందోళన ఉంది. అయితే కొవిడ్ వ్యాప్తి జరగకుండా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఈ తరుణంలో నూతన సంవత్సర (New Year 2023) వేడుకల కోసం కర్ణాటక ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రకటించింది. న్యూఇయర్ సంబరాల (New Year Celebrations) వేళ ప్రజలు మాస్కులు తప్పక ధరించాలని వెల్లడించింది. నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కే సుధాకర్ చెప్పారు. మరిన్ని రూల్స్ కూడా ప్రకటించారు. పూర్తి వివరాలు ఇవే.
Covid Guidelines in Karnataka: రెస్టారెంట్లు, పబ్లతో పాటు లోపలి ప్రదేశాల్లో జరిగే న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనే వారు తప్పకుండా మాస్కులు ధరించాలని మంత్రి సుధాకర్ సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్త చర్యగానే ఈ రూల్స్ విధించినట్టు స్పష్టం చేశారు. “ఆయా జిల్లాలకు చెందిన డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించేలా ఈ కమిటీలు చర్యలు తీసుకుంటాయి. అలాగే అన్ని జిల్లాలో వ్యాక్సినేషన్ వేగవంతమయ్యేలా చూస్తాయి” అని ఆయన చెప్పారు. న్యూఇయర్ వేళ కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి సోమవారం నిర్వహించిన సమావేశం తర్వాత మంత్రి సుధాకర్ ఈ నిర్ణయాలను ప్రకటించారు.
కాగా, ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ బీఎఫ్.7 (Omicron BF.7) వేరియంట్ చైనాలో విజృంభిస్తోంది. దీంతో రోజుకు లక్షలాది కేసులు ఆ దేశంలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది.
కాగా, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.