Covid Guidelines: న్యూఇయర్ వేళ ఆ రాష్ట్రంలో మాస్కులు ధరించడం తప్పనిసరి.. మరిన్ని రూల్స్-people must wear masks in new year celebrations covid restrictions returns in karnataka ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Covid Guidelines: న్యూఇయర్ వేళ ఆ రాష్ట్రంలో మాస్కులు ధరించడం తప్పనిసరి.. మరిన్ని రూల్స్

Covid Guidelines: న్యూఇయర్ వేళ ఆ రాష్ట్రంలో మాస్కులు ధరించడం తప్పనిసరి.. మరిన్ని రూల్స్

Covid Restrictions: న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనే వారు ముఖానికి మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. కొత్త సంవత్సర సంబరాల్లో పాల్గొనే వారి కోసం కొవిడ్ మార్గదర్శకాలు జారీ చేసింది.

Covid Guidelines: న్యూఇయర్ వేళ ఆ రాష్ట్రంలో మాస్కులు ధరించడం తప్పనిసరి.. మరిన్ని (PTI)

Covid Guidelines in Karnataka: చైనాలో కొవిడ్ మళ్లీ విజృంభిస్తుండటంతో భారత్‍లోనూ గుబులు రేగుతోంది. రెండేళ్లు అతలాకుతలం చేసిన కరోనా వైరస్ మళ్లీ ఎక్కడ వస్తుందోనన్న ఆందోళన ఉంది. అయితే కొవిడ్ వ్యాప్తి జరగకుండా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఈ తరుణంలో నూతన సంవత్సర (New Year 2023) వేడుకల కోసం కర్ణాటక ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రకటించింది. న్యూఇయర్ సంబరాల (New Year Celebrations) వేళ ప్రజలు మాస్కులు తప్పక ధరించాలని వెల్లడించింది. నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కే సుధాకర్ చెప్పారు. మరిన్ని రూల్స్ కూడా ప్రకటించారు. పూర్తి వివరాలు ఇవే.

మాస్కులు మస్ట్

Covid Guidelines in Karnataka: రెస్టారెంట్లు, పబ్‍లతో పాటు లోపలి ప్రదేశాల్లో జరిగే న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనే వారు తప్పకుండా మాస్కులు ధరించాలని మంత్రి సుధాకర్ సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్త చర్యగానే ఈ రూల్స్ విధించినట్టు స్పష్టం చేశారు. “ఆయా జిల్లాలకు చెందిన డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించేలా ఈ కమిటీలు చర్యలు తీసుకుంటాయి. అలాగే అన్ని జిల్లాలో వ్యాక్సినేషన్ వేగవంతమయ్యేలా చూస్తాయి” అని ఆయన చెప్పారు. న్యూఇయర్ వేళ కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి సోమవారం నిర్వహించిన సమావేశం తర్వాత మంత్రి సుధాకర్ ఈ నిర్ణయాలను ప్రకటించారు.

న్యూఇయర్ కోసం కర్ణాటకలో కొవిడ్-19 మార్గదర్శకాలు

  • రెస్టారెంట్లు, పబ్‍లు, థియేటర్ హాల్స్, స్కూల్స్, కాలేజీల్లాంటి లోపలి ప్రదేశాల్లో ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలి.
  • అర్ధరాత్రి 1 గంట వరకే రాష్ట్రంలో న్యూఇయర్ వేడుకలకు అనుమతి.
  • వృద్ధులు, గర్భిణులు, పిల్లలు.. ప్రజలు ఎక్కువగా ఉండే రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
  • లోపలి ప్రదేశాల్లో జరిగే ఈవెంట్లలో, అందుబాటులో ఉన్న సీట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఉండకూడదు.
  • శానిటైజర్లు ఉపయోగించడం, మాస్కులు ధరించడం, వ్యాక్సినేషన్ తప్పనిసరి.

కాగా, ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ బీఎఫ్.7 (Omicron BF.7) వేరియంట్‍ చైనాలో విజృంభిస్తోంది. దీంతో రోజుకు లక్షలాది కేసులు ఆ దేశంలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‍ కూడా అప్రమత్తమైంది.

కాగా, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.