Pathankot attack mastermind killed: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ దాడుల సూత్రధారి హతం
Pathankot attack mastermind killed: పఠాన్ కోట్ లోని వైమానిక దళ స్థావరంపై ఉగ్ర దాడులకు ప్రణాళికలు రచించిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ లతీఫ్ అలియాస్ బిలాల్ ను కాల్చి చంపేశారు. అతనితో పాటు అతడి ఇద్దరు గన్ మెన్ లు కూడా హతమయ్యారు.
Pathankot attack mastermind killed: 2016 లో భారత్ లోని పఠాన్ కోట్ లో ఉన్న వైమానిక దళ స్థావరంపై ఉగ్రదాడికి ప్లాన్ చేసిన జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ కమాండర్ షాహిద్ లతీఫ్ అలియాస్ బిలాల్ ను పాకిస్తాన్ లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. లతీఫ్ ఒక మసీదులో ఉండగా, అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి హతమార్చారు.

పఠాన్ కోట్ దాడి..
జనవరి 2, 2016 న పఠాన్ కోట్ లోని భారతీయ వైమానిక దళ స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నలుగురు ఉగ్రవాదులు స్థావరంలోకి చొరబడి ఐఏఎఫ్ సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. ఐఏఎఫ్ ఎయిర్ బేస్ లోని సాయుధ సిబ్బంది వారిపై ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ ఎన్ కౌంటర్ దాదాపు 3 రోజుల పాటు కొనసాగింది. ఎట్టకేలకు నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. కానీ, ఉగ్రవాదుల చేతిలో మొత్తం ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
లతీఫ్ ప్లాన్
ఈ దాడికి జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ కమాండర్ లతీఫ్ వ్యూహ రచన చేసినట్లు గుర్తించారు. ఎన్ఐఏ వాంటెడ్ లిస్ట్ లో లతీఫ్ కూడా ఉన్నాడు. మొదట, 1993 లో లతీఫ్ పాకిస్తాన్ నుంచి కశ్మీర్ లోకి అక్రమంగా చొరబడ్డాడు. ఒక సంవత్సరం తరువాత అరెస్ట్ అయ్యాడు. జమ్మూ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో అదే జైలులో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ తో పరిచయమైంది. జైలు నుంచి విడుదల అయిన తరువాత 2010 లో అతడిని పాకిస్తాన్ కు పంపించేశారు. అక్కడ జైషే సంస్థలో లతీఫ్ చేరాడు.
అనుమానాస్పదం..
భారత్ లో వాంటెడ్ లిస్ట్ లో ఉన్న ఉగ్రవాదులు, నేరస్తులు విదేశాల్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన జాబితాలో ఇప్పుడు తాజాగా లతీఫ్ చేరాడు. ఖలిస్తాన్ మద్దతుదారు, భారత్ లో వాంటెడ్ లిస్ట్ లో ఉన్న క్రిమినల్ హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలో ఒక గురుద్వారా ముందు ఈ జూన్ లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ పరంజిత్ సింగ్ పాంజ్వర్ ను లాహోర్ లో ఈ మే నెలలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.