ాక్ హ్యాకర్లు మరోసారి భారత్ వెబ్సైట్లపై దాడికి యత్నించారు. పిల్లలు, మాజీ సైనికులు, సంక్షేమ సేవలకు సంబంధించిన డిజిటల్ ప్లాట్ఫామ్లను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే దీనిపై భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు వేగంగా స్పందించి.. నిర్వీర్యం చేశాయి. సైబర్ గ్రూప్ HOAX1337, నేషనల్ సైబర్ క్రూ అనే గ్రూపులు ఆర్మీ పబ్లిక్ స్కూల్ (ఏపీఎస్), నగ్రోటా, సుంజువాన్ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకున్నాయి. దీని ద్వారా పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన 26 మందిని ఎగతాళి చేస్తూ రెచ్చగొట్టే కంటెంట్ను పోస్ట్ చేసే ప్రయత్నం చేశారు.
పిల్లలు, మాజీ సైనికులు, ఇతర అమాయకులకు సంబంధించిన వెబ్సైట్లను దాడి చేసేందుకు పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న హ్యాకర్లు పదేపదే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్మీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వెబ్సైట్ను, భారత వైమానిక దళ మాజీ సైనికుల వెబ్సైట్ను పాక్ ప్రేరేపిత హ్యాకర్లు హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం దీని ఉద్దేశంగా కనిపిస్తుంది.
రెచ్చగొట్టే చర్యల్లో భాగంగానే ఈ సైబర్ దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. పాకిస్థాన్ ఎప్పటి నుంచో భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదం, సమాచార యుద్ధానికి పాల్పడుతోందని, ఈ పనులు చేయడం ద్వారా పాక్ భారత్ సహనాన్నిపరీక్షిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ సహా వివిధ దేశాలకు చెందిన హ్యాకింగ్ గ్రూపులు భారతకు చెందిన వ్యవస్థలపై పది లక్షలకు పైగా సైబర్ దాడులు చేశాయని మహారాష్ట్ర సైబర్ పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 22 తర్వాత సైబర్ దాడి ఘటనలు పెరిగాయని సైబర్ సెల్ గుర్తించిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
పహల్గామ్ దాడి తర్వాత భారత్ 10 లక్షలకు పైగా సైబర్ దాడులను ఎదుర్కొందని మహారాష్ట్ర సైబర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి యాదవ్ చెప్పారు. పాకిస్థాన్, మధ్య ఆసియా, ఇండోనేషియా, మొరాకో దేశాల నుంచి భారత వెబ్సైట్లు, పోర్టల్స్ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి.