జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ భారత కమ్యూనిటీ సభ్యులు శుక్రవారం లండన్ లోని పాక్ హైకమిషన్ ఎదుట ఆందోళన చేస్తుండగా, ఆ ఆందోళనకారులను ఉద్దేశించి పాక్ ఆర్మీకి చెందిన ఓ సీనియర్ అధికారి బెదిరింపు సైగలు చేస్తూ కెమెరాకు చిక్కారు. చేతిలో భారతీయ వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ పోస్టర్ ను చేతిలో పట్టుకుని లండన్ లోని హైకమిషన్ లో పాక్ ఆర్మీ, ఎయిర్ అడ్వైజర్ కల్నల్ తైమూర్ రహత్ ఈ బెదిరింపులకు దిగారు.
లండన్ లోని హైకమిషన్ లో పాక్ ఆర్మీ, ఎయిర్ అడ్వైజర్ కల్నల్ తైమూర్ రహత్ భారతదేశానికి చెందిన నిరసనకారులను బహిరంగంగా గొంతు కోస్తామని బెదిరిస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ 500 మందికి పైగా భారతీయులు శుక్రవారం లండన్ లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. భారత జెండాలు, బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. అమాయకుల ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఇలాంటి దాడులకు కారణమైన ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని, ఆశ్రయం కల్పిస్తోందని విమర్శించారు.
ప్రజలు శోకసంద్రంలో ఉన్నప్పుడు పాక్ హైకమిషన్ బిగ్గరగా మ్యూజిక్ ప్లే చేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసనకారులు ఖండించారు. న్యాయం, జవాబుదారీతనం కోసం నేటి నిరసన పిలుపు అని నిర్వాహకుడు ఒక ప్రకటనలో తెలిపారు. పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని అధికారులు తాము నిరసన సమయంలో బిగ్గరగా సంబరాలు జరుపుకోవడం సిగ్గు చేటని ఆందోళనకారులు విమర్శించారు. ‘‘ఇది ఇప్పటికే తీవ్రంగా గాయపడిన గాయానికి తీవ్రమైన అవమానాన్ని జోడించింది. బాధితులకు ప్రపంచం సంతాపం తెలుపుతుంటే, పాక్ రాయబార కార్యాలయం సంబరాలు జరుపుకుంటూ, కనీస మానవ మర్యాద లోపాన్ని ప్రదర్శించాయి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో ముడిపడి ఉన్న ఈ ఉగ్రదాడిపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కశ్మీర్ పర్యటనకు వెళ్లిన కుటుంబాలపై క్రూరంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి కారణంగా యూకేలో ఉంటున్న భారతీయ సమాజం ఆందోళన చెందుతోందని మరో నిరసనకారుడు తెలిపారు.
ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడిన ఇండో-యూదు నిరసనకారుడు పాక్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. యూదు సమాజం ఎల్లప్పుడూ భారతీయులకు మద్దతు ఇస్తుందని, ఎందుకంటే రెండు దేశాలకు ఒకే శత్రువు ఇస్లామిక్ రాడికలైజేషన్ ఉందని ఆయన పేర్కొన్నారు. 2023లో ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడిని పహల్గామ్ దాడి గుర్తు చేసిందని ఆయన అన్నారు.
సంబంధిత కథనం