‘‘గొంతు కోసి చంపుతాం’’- లండన్ లో భారత నిరసనకారులను హెచ్చరిస్తూ పాక్ సైన్యాధికారి సైగలు-pakistani diplomat in london makes throat slit sign at indian protesters ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘‘గొంతు కోసి చంపుతాం’’- లండన్ లో భారత నిరసనకారులను హెచ్చరిస్తూ పాక్ సైన్యాధికారి సైగలు

‘‘గొంతు కోసి చంపుతాం’’- లండన్ లో భారత నిరసనకారులను హెచ్చరిస్తూ పాక్ సైన్యాధికారి సైగలు

Sudarshan V HT Telugu

లండన్ వేదికగా పాక్ అధికారుల పొగరు మరోసారి బయటపడింది. పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ లండన్ లో ఆందోళన చేపట్టిన భారతీయులను ఉద్దేశించి పాక్ ఆర్మీకి చెందిన సీనియర్ అధికారి గొంతు కోస్తామంటూ బెదిరింపు సైగలు చేస్తూ కెమెరాకు చిక్కారు.

లండన్ లో భారత నిరసనకారులను హెచ్చరిస్తూ పాక్ అధికారి సైగలు (X)

జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ భారత కమ్యూనిటీ సభ్యులు శుక్రవారం లండన్ లోని పాక్ హైకమిషన్ ఎదుట ఆందోళన చేస్తుండగా, ఆ ఆందోళనకారులను ఉద్దేశించి పాక్ ఆర్మీకి చెందిన ఓ సీనియర్ అధికారి బెదిరింపు సైగలు చేస్తూ కెమెరాకు చిక్కారు. చేతిలో భారతీయ వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ పోస్టర్ ను చేతిలో పట్టుకుని లండన్ లోని హైకమిషన్ లో పాక్ ఆర్మీ, ఎయిర్ అడ్వైజర్ కల్నల్ తైమూర్ రహత్ ఈ బెదిరింపులకు దిగారు.

సోషల్ మీడియాలో వైరల్

లండన్ లోని హైకమిషన్ లో పాక్ ఆర్మీ, ఎయిర్ అడ్వైజర్ కల్నల్ తైమూర్ రహత్ భారతదేశానికి చెందిన నిరసనకారులను బహిరంగంగా గొంతు కోస్తామని బెదిరిస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ 500 మందికి పైగా భారతీయులు శుక్రవారం లండన్ లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. భారత జెండాలు, బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. అమాయకుల ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఇలాంటి దాడులకు కారణమైన ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని, ఆశ్రయం కల్పిస్తోందని విమర్శించారు.

పాక్ హై కమిషన్ దుర్మార్గం

ప్రజలు శోకసంద్రంలో ఉన్నప్పుడు పాక్ హైకమిషన్ బిగ్గరగా మ్యూజిక్ ప్లే చేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసనకారులు ఖండించారు. న్యాయం, జవాబుదారీతనం కోసం నేటి నిరసన పిలుపు అని నిర్వాహకుడు ఒక ప్రకటనలో తెలిపారు. పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని అధికారులు తాము నిరసన సమయంలో బిగ్గరగా సంబరాలు జరుపుకోవడం సిగ్గు చేటని ఆందోళనకారులు విమర్శించారు. ‘‘ఇది ఇప్పటికే తీవ్రంగా గాయపడిన గాయానికి తీవ్రమైన అవమానాన్ని జోడించింది. బాధితులకు ప్రపంచం సంతాపం తెలుపుతుంటే, పాక్ రాయబార కార్యాలయం సంబరాలు జరుపుకుంటూ, కనీస మానవ మర్యాద లోపాన్ని ప్రదర్శించాయి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా నిరసనలు

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో ముడిపడి ఉన్న ఈ ఉగ్రదాడిపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కశ్మీర్ పర్యటనకు వెళ్లిన కుటుంబాలపై క్రూరంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి కారణంగా యూకేలో ఉంటున్న భారతీయ సమాజం ఆందోళన చెందుతోందని మరో నిరసనకారుడు తెలిపారు.

భారత్ కు యూదుల సపోర్ట్

ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడిన ఇండో-యూదు నిరసనకారుడు పాక్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. యూదు సమాజం ఎల్లప్పుడూ భారతీయులకు మద్దతు ఇస్తుందని, ఎందుకంటే రెండు దేశాలకు ఒకే శత్రువు ఇస్లామిక్ రాడికలైజేషన్ ఉందని ఆయన పేర్కొన్నారు. 2023లో ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడిని పహల్గామ్ దాడి గుర్తు చేసిందని ఆయన అన్నారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.