Pakistan train hijack: 16 మంది బలూచ్ తీవ్రవాదుల హతం; కొనసాగుతున్న కమాండో ఆపరేషన్-pakistan train hijack security forces kill 16 militants rescue 104 hostages ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pakistan Train Hijack: 16 మంది బలూచ్ తీవ్రవాదుల హతం; కొనసాగుతున్న కమాండో ఆపరేషన్

Pakistan train hijack: 16 మంది బలూచ్ తీవ్రవాదుల హతం; కొనసాగుతున్న కమాండో ఆపరేషన్

Sudarshan V HT Telugu

Pakistan train hijack: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాకిస్తాన్ ట్రైన్ హైజాక్ ఘటనలో భద్రతాబలగాలు సుమారు 16 మంది బలూచ్ తీవ్రవాదులను హతమార్చాయి. 100 మందికి పైగా బందీలను కాపాడాయి. బందీలందరినీ కాపాడేందుకు ఉద్దేశించిన కమాండో ఆపరేషన్ కొనసాగుతోంది.

పాకిస్తాన్ ట్రైన్ హైజాక్ (AFP)

Pakistan train hijack: పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో మంగళవారం ప్యాసింజర్ రైలును బలూచ్ తీవ్రవాదులు హైజాక్ చేసిన ఘటనలో ఆ దేశ భద్రతా దళాలు 16 మంది హైజాకర్లను హతమార్చగా, 104 మంది ప్రయాణికులను రక్షించారు. తొమ్మిది బోగీల్లో 400 మంది ప్రయాణికులతో జాఫర్ ఎక్స్ ప్రెస్ క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తుండగా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA)కి చెందిన సాయుధులు మంగళవారం మధ్యాహ్నం గుడాలార్, పీరు కున్రి పర్వత ప్రాంతాలకు సమీపంలోని టన్నెల్ లో అడ్డుకున్నారు. డ్రైవర్ పై కాల్పులు జరిపి, రైలును తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

భద్రతా బలగాల ఎదురుదాడి

హైజాక్ చేసిన రైలులోని సెక్యూరిటీ సిబ్బందిని వారి ఐడీ కార్డుల ఆధారంగా బలూచ్ తీవ్రవాదులు గుర్తించి, వారిని హతమార్చారు. సమాచారం తెలియగానే, పాక్ హోం మంత్రిత్వ శాఖ హుటాహుటిన భద్రతాబలగాలను ఘటనాస్థలానికి పంపించి, ఆపరేషన్ కమాండోను ప్రారంభించాయి.

బందీల విడుదల

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దళాలతో కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో మహిళలు, పిల్లలు సహా 104 మంది ప్రయాణికులను భద్రతా బలగాలు రక్షించగలిగాయని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ప్రయాణికులందరినీ రైలు నుంచి రక్షించే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని పాక్ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, బందీలుగా ఉన్న కొందరు ప్రయాణికులను ఉగ్రవాదులు పర్వతాల్లోకి తీసుకెళ్లారని, భద్రతా దళాలు చీకట్లో వారిని వెంబడిస్తున్నాయని సమాచారం. ఇప్పటివరకు భద్రతాదళాలు 58 మంది పురుషులు, 31 మంది మహిళలు, 15 మంది పిల్లలను రక్షించాయి. వారిని మరో రైలులో మాక్ (బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని కచ్చి జిల్లాలోని ఒక పట్టణం) కు పంపించారు.

తప్పించుకునే ప్రయత్నం

చీకట్లో తప్పించుకోవడానికి బలూచ్ తీవ్రవాదులు చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారని, అయితే భద్రతా దళాలు సొరంగాన్ని అన్ని వైపులా చుట్టుముట్టాయని, మిగిలిన ప్రయాణికులను కూడా త్వరలోనే రక్షిస్తామని పాక్ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాదులు రైలును హైజాక్ చేసిన టన్నెల్ సమీపంలో తీవ్ర కాల్పులు, పేలుళ్లు జరిగాయని పాక్ మీడియా పేర్కొంది. రైలు ఆగిన ప్రాంతంలోని జిల్లా పోలీసు అధికారి రాణా ముహమ్మద్ దిలావర్ మాట్లాడుతూ, రైలులో నలుగురైదుగురు ప్రభుత్వ అధికారులు ఉన్నారని చెప్పారు. ఇంతకుముందు, బిఎల్ఎ అనేక మంది భద్రతా సిబ్బందిని బందీలుగా తీసుకున్నట్లు పేర్కొంది.

ఎమర్జెన్సీ డెస్క్

పాకిస్థాన్ రైల్వే శాఖ పెషావర్, క్వెట్టా రైల్వే స్టేషన్లలో ఎమర్జెన్సీ డెస్క్ ఏర్పాటు చేసింది. నెలన్నరకు పైగా నిలిపివేసిన తర్వాత క్వెట్టా నుంచి పెషావర్ కు రైలు సర్వీసులను పాకిస్థాన్ ఇటీవలనే రైల్వే పునరుద్ధరించింది. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో రైలుపై దాడి జరగడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది నవంబర్ లో క్వెట్టా రైల్వే స్టేషన్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 26 మంది మరణించగా, 62 మంది గాయపడ్డారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.