‘‘చైనా ఆయుధాలకు పాకిస్తాన్ ఒక సజీవ ప్రయోగశాల’’ - భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ వ్యాఖ్య-pakistan is a live laboratory for chinese weapons says indian army deputy chief ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘‘చైనా ఆయుధాలకు పాకిస్తాన్ ఒక సజీవ ప్రయోగశాల’’ - భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ వ్యాఖ్య

‘‘చైనా ఆయుధాలకు పాకిస్తాన్ ఒక సజీవ ప్రయోగశాల’’ - భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ వ్యాఖ్య

Sudarshan V HT Telugu

ఆపరేషన్ సిందూర్ గురించి, ఆ ఘర్షణ నుంచి నేర్చుకున్న పాఠాల గురించి లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ వెల్లడించారు. పాక్ కు మద్దతు పేరుతో చైనా తన ఆయుధాలను పరీక్షించుకుంటోందని, పాకిస్తాన్ చైనాకు ఒక సజీవ ప్రయోగశాలగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.

లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ (X/PTI)

చైనా తన ఆయుధాలను పాక్ ద్వారా పరీక్షించుకుంటోందని, పాక్ చైనాకు ఒక లైవ్ ల్యాబ్ గా మారిందని భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ రాహుల్ ఆర్ సింగ్ శుక్రవారం అన్నారు, సరిహద్దు వెంబడి ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లకు వ్యతిరేకంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు ప్రధాన మద్దతుదారుగా చైనా నిలిచిందన్నారు.

81 శాతం చైనావే..

పాకిస్తాన్ సైనిక సామగ్రిలో, ఆయుధాల్లో 81 శాతం చైనీయులవేనని లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ వెల్లడించారు. భారత్, పాక్ ఘర్షణను చైనా తన ఆయుధాల పరీక్షా కేంద్రం మార్చుకుందన్నారు. "చైనా తన ఆయుధాలను అక్కడ ఉన్న వివిధ ఇతర ఆయుధ వ్యవస్థలకు వ్యతిరేకంగా పరీక్షించగలిగింది. పాకిస్తాన్ చైనాకు అందుబాటులో ఉన్న లైవ్ ల్యాబ్ లాంటిది’’ అన్నారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ సింగ్ మాట్లాడారు.

ఒక సరిహద్దు, ముగ్గురు శత్రువులు

"ఒక సరిహద్దు, ఇద్దరు శత్రువులు.. వాస్తవానికి ముగ్గురు శత్రువులు’’ అని లెఫ్టినెంట్ జనరల్ సింగ్ వ్యాఖ్యానించారు. పాక్, చైనాలతో పాటు మూడో శత్రువుగా టర్కీ నిలిచిందన్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ కు డ్రోన్లను అందించి టర్కీ మనకు మరో శత్రువుగా మారిందన్నారు. భారత్ తో నేరుగా కంటే పాకిస్థాన్ ను వాడుకుని ఇబ్బంది పెట్టడానికే చైనా మొగ్గుచూపుతోందని ఆయన అన్నారు.

పాక్ వద్ద లైవ్ సమాచారం

ఘర్షణ సమయంలో భారత్ కదలికలపై పాకిస్థాన్ కు రియల్ టైమ్ సమాచారం ఉందని ఆయన అన్నారు. దాని గురించి డీజీఎంవో స్థాయి చర్చలు జరుగుతున్నప్పుడు కూడా పాకిస్తాన్ ప్రస్తావించిందని తెలిపారు. అవి చైనా నుంచి పాక్ కు అందుతున్న లైవ్ ఇన్ పుట్స్ అని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 22న కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మృతి చెందిన నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య చేపట్టింది. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలు, ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. భారత్ లోని పంజాబ్, జమ్ముకశ్మీర్, ఇతర రాష్ట్రాల్లో చైనా, టర్కీ అందించినట్లు భావిస్తున్న వరుస క్షిపణి, డ్రోన్ దాడులతో పాక్ ఎదురుదాడికి దిగింది. చాలా దాడులను భారత వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా తిప్పికొట్టాయి.

లెఫ్టినెంట్ జనరల్ సింగ్ ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు

  • ఆపరేషన్ ప్రారంభానికి ముందు చివరి గంటలో ఏయే లక్ష్యాలపై దాడి చేయాలనే విషయమై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
  • భారతదేశం 21 లక్ష్యాలను గుర్తించింది, వాటిలో 9 లక్ష్యాలపై దాడి చేయాలని చివరి గంటలో ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు.
  • మనం ఎల్లప్పుడూ ఎస్కలేషన్ లాడర్ పైభాగంలో ఉండాలి. మనం ఒక సైనిక లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు, దానికి చెక్ పెట్టడానికి ప్రయత్నించాలి.
  • మరో దాడి సిద్ధంగా ఉంది. ఆ దాడి జరిగితే వారు చాలా దారుణ పరిస్థితిలో ఉంటారని పాకిస్తాన్ గ్రహించింది. అందుకే వారు యుద్ధ విరామం కోరారు.
  • "యుద్ధం ప్రారంభించడం సులభం, కానీ నియంత్రించడం చాలా కష్టం. కాబట్టి, యుద్ధాన్ని సరైన సమయంలో భారత్ ఆపగలిగింది. ఇది చాలా మాస్టర్ స్ట్రోక్.
  • మనకు మొదట, ఒక సరిహద్దు, ఇద్దరు శత్రువులు. పాకిస్తాన్ ముందు వైపు ఉంది. చైనా అన్ని రకాల మద్దతును అందిస్తోంది. ఇది ఆశ్చర్యం లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలలో పాకిస్తాన్ పొందుతున్న 81 శాతం సైనిక హార్డ్‌వేర్ చైనా నుండి వస్తోంది. కాబట్టి, ఇది ఆశ్చర్యం లేదు.
  • ఈ ఘర్షణల్లో చైనా తన ఆయుధాలను ఇతర ఆయుధ వ్యవస్థలకు వ్యతిరేకంగా పరీక్షించగలుగుతుందని భావించింది. పాకిస్తాన్ చైనాకు అందుబాటులో ఉన్న లైవ్ ల్యాబ్ లాంటిది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.