భారత్‌ను మరోసారి టార్గెట్ చేసిన పాక్ సైబర్ గ్రూపులు.. రక్షణ వెబ్‌సైట్లు హ్యాక్!-pakistan based cyber groupds target india agains multiple defence websites hacked know in details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భారత్‌ను మరోసారి టార్గెట్ చేసిన పాక్ సైబర్ గ్రూపులు.. రక్షణ వెబ్‌సైట్లు హ్యాక్!

భారత్‌ను మరోసారి టార్గెట్ చేసిన పాక్ సైబర్ గ్రూపులు.. రక్షణ వెబ్‌సైట్లు హ్యాక్!

Anand Sai HT Telugu

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాక్ హ్యాకర్లు మరోసారి భారత్‌ను టార్గెట్ చేశారు. రక్షణ వెబ్ సైట్లను లక్ష్యంగా చేసుకుని భద్రతా దళాల డేటాను రాబట్టేందుకు ప్రయత్నించారు.

ప్రతీకాత్మక చిత్రం

పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు నిరంతరం దెబ్బతింటున్నాయి. మరోవైపు పాకిస్థాన్‌కు చెందిన పలు సైబర్ గ్రూపులు భారత్‌పై సైబర్ దాడులకు దిగాయి. పాక్ హ్యాకర్లు భారత రక్షణ వెబ్ సైట్లను లక్ష్యంగా చేసుకున్నారు. సైబర్ దాడుల ద్వారా భద్రతా సిబ్బంది లాగిన్ పాస్‌వర్డ్ వంటి సున్నితమైన సమాచారాన్ని హ్యాకర్లు రాబట్టేందుకు ప్రయత్నించారని రక్షణ సంస్థ వర్గాలు తెలిపాయి.

మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్‌కు చెందిన సున్నితమైన డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేసుకున్నట్టుగా పాకిస్థాన్ సైబర్ ఫోర్స్ అనే హ్యాండిల్ పేర్కొంది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పబ్లిక్ ఆర్మ్‌డ్ వెహికల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్‌సైట్‌ను కూడా హ్యాక్ చేసేందుకు ఈ బృందం ప్రయత్నించిందని ఎన్డీటీవీ తెలిపింది.

హ్యాకింగ్ ప్రయత్నాలు

కొన్ని రోజులుగా పాకిస్థాన్ నుంచి హ్యాకింగ్ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ దాడులను గుర్తించడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణులు అప్రమత్తంగా ఉంటున్నారు. పాకిస్థాన్‌తో ముడిపడి ఉన్న దాడులను కూడా పరిశీలిస్తున్నామని, ఇలాంటి దాడులను నివారించడానికి మరిన్ని భద్రతా చర్యలను పెంచుతున్నామని చెప్పారు.

డేటా యాక్సెస్

పాకిస్థాన్ సైబర్ ఫోర్స్ హ్యాండిల్.. ఆర్మర్డ్ వెహికల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్ పేజీ చిత్రాలను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో భారత ట్యాంకును పాక్ ట్యాంకుగా మార్చేశారు. మరో పోస్టులో భారత రక్షణ సిబ్బంది పేర్ల జాబితాను కూడా షేర్ చేశారు. 'మీ భద్రత ఒక భ్రమ. మనోహర్ పారికర్ డిఫెన్స్ స్టడీస్ వెబ్‌సైట్‌లో 1600 మంది యూజర్లకు చెందిన 10 జీబీ డేటాను యాక్సెస్ చేశాం.' అని ఆ హ్యాండిల్ పేర్కొంది.

పాక్ ఉగ్రవాదుల ప్రమేయం

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిలో ఉగ్రవాదులు బైసరన్ లోయలో పర్యాటకులను కాల్చి చంపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మతం గురించి అడిగి ప్రజలను చంపేశారు. ఈ దర్యాప్తులో పాక్ ఉగ్రవాదుల ప్రమేయం వెలుగులోకి వచ్చిందని భారత ఏజెన్సీలు తెలిపాయి. దీంతో భారత్ పాక్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. భారత ప్రభుత్వం మొదట సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసి, భారతదేశానికి వచ్చిన పాకిస్థాన్ పౌరులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.