భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కాసేపటికే జమ్మూలోని ఉధంపూర్ పై పాకిస్తాన్ మరోసారి డ్రోన్ల దాడికి పాల్పడింది. మరోవైపు, శ్రీనగర్ లో పాక్ దాడుల హెచ్చరికతో శనివారం సాయంత్రం సైరన్లు, బ్లాక్అవుట్లకు దారితీసింది.
కాల్పుల విరమణకు ఏకపక్షంగా అభ్యర్థించిన పాకిస్తాన్, మళ్లీ పాత బుద్ధిని చూపించుకుంటూ, సరిహద్దు ప్రాంతాలపై దాడులకు తెగబడ్తోంది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమలు అవగా, ఆ కాసేపటికే డ్రోన్ దాడులకు సిద్ధమైంది. పాక్ దాడుల ముప్పుతో రాజస్థాన్ లోని బార్మర్ లో ఎయిర్ రైడ్ అలర్ట్ తో పాటు జిల్లాలో అత్యవసర బ్లాక్అవుట్ ఎన్ ఫోర్స్ మెంట్ ను జారీ చేశారు. జమ్ముకశ్మీర్ లోని బారాముల్లా, బుద్గాం ప్రాంతాల్లోనూ కాల్పుల శబ్దాలు వినిపించాయి.
ఒకవైపు, కాల్పుల విరమణను స్వాగతిస్తూనే, మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తోంది. ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల పరిష్కారంలో ఇది కొత్త ఆరంభాన్ని సూచిస్తుందని, శాంతి, సౌభాగ్యం, సుస్థిరత దిశగా ప్రయాణానికి సహాయపడుతుందని తమ దేశం విశ్వసిస్తోందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీష్ కాల్పుల విరమణ గురించి వ్యాఖ్యానించిన కొద్ది సేపటికే, పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
పాక్ కాల్పులు, దాడులపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి కూడా స్పందించారు. ఈ పేలుళ్ల గురించి ఎక్స్ లో పోస్ట్ చేశారు. 'కాల్పుల విరమణ ఏమైంది? శ్రీనగర్ అంతటా పేలుళ్ల శబ్దాలు!! అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.
సంబంధిత కథనం