ఉగ్రవాదులతో సంబంధం ఏంటి? అంత్యక్రియలకు వెళ్లిన పాక్​ అధికారుల పేర్లు బయటపెట్టిన భారత్​..-pak officials attended funeral of terrorists killed in operation sindoor who are they ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఉగ్రవాదులతో సంబంధం ఏంటి? అంత్యక్రియలకు వెళ్లిన పాక్​ అధికారుల పేర్లు బయటపెట్టిన భారత్​..

ఉగ్రవాదులతో సంబంధం ఏంటి? అంత్యక్రియలకు వెళ్లిన పాక్​ అధికారుల పేర్లు బయటపెట్టిన భారత్​..

Sharath Chitturi HT Telugu

ఈ ఆపరేషన్ లో భాగంగా భారత బలగాలు పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్​ అధికారులు.. (AP)

పహల్గామ్​ ఉగ్రదాడి అనంతరం 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో మే 7న భారత్ జరిపిన దాడుల్లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఒక ఫొటో ప్రపంచవ్యాప్తంగా వైరల్​ అయ్యింది. ఇక ఇప్పుడు, అంత్యక్రియలకు హాజరైన పాకిస్థాన్​ ఆర్మీ అధికారుల పేర్లను భారత్ బయటపెట్టింది. ఉగ్రవాదానికి పాకిస్థాన్​ ఎలా మద్దతిస్తోందో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఈ ఘటనతో మరోసారి రుజువైందని అంతర్జాతీయ సమాజానికి భారత్​ నొక్కిచెబుతోంది.

ఉగ్రవాదుల అంత్యక్రియలకు వెళ్లిన పాక్​ అధికారులు వీరే..

ఆపరేషన్​ సిందూర్​లో భాగంగా బహవల్​పూర్​ మురిడ్కేలో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారని మన దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్థాన్​లోని పంజాబ్ ఇన్​స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా అంత్యక్రియలకు హాజరయ్యారని వివరించింది.

లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్, మేజర్ జనరల్ రావు ఇమ్రాన్, బ్రిగేడియర్ మొహమ్మద్ ఫుర్కాన్( అడ్మినిస్ట్రేషన్), ఉస్మాన్ అన్వర్, పాకిస్థాన్​ పంజాబ్ శాసనసభ్యుడు మాలిక్ సోహైబ్ అహ్మద్ ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారు.

ఏప్రిల్ 22న కశ్మీర్​లోని పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన 26 మంది మృతికి ప్రతీకారంగా భారత్ మే 7 తెల్లవారుజామున 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. ఈ ఆపరేషన్​లో భాగంగా భారత బలగాలు పాకిస్థాన్​, పాక్ ఆక్రమిత కశ్మీర్​లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో వంద మందికి పైగా టెర్రరిస్టులు హతమయ్యారు.

ఆపరేషన్ సిందూర్ దాడుల్లో మరణించిన పేరు మోసిన ఉగ్రవాదులు, ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారి పేర్లను డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్.. ఆదివారం సాయంత్రం భారత సైన్యం నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ధృవీకరించారు.

ఆపరేషన్ సిందూర్ కింద జాగ్రత్తగా చర్చించిన తరువాత తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలను గుర్తించినట్టు, మే 7వ తేదీన జరిగిన 9 ఉగ్రదాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు లెఫ్టినెంట్​ జనరల్​ రాజీవ్​ ఘాయ్​ చెప్పారు. ఈ దాడుల్లో యూసఫ్ అజహర్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ మృతి చెందారని వివరిచారు.

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన యూసుఫ్ అజహర్.. మౌలానా మసూద్ అజహర్ బావమరిది. జైషే మహ్మద్​ ఉగ్రవాదులకు ఆయుధ శిక్షణ ఇచ్చే ఆయన జమ్ముకశ్మీర్​లో పలు ఉగ్రదాడుల్లో పాల్గొన్నాడు.

రవూఫ్ లష్కరే తోయిబా కమాండర్, ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ గుర్తించిన ఉగ్రవాది. కాగా, పుల్వామా దాడిలో ముదాసిర్​తో పాటు మరో ఇద్దరి పేర్లు కూడా బయటపడ్డాయి.

వీరితో పాటు మే 7న జరిగిన దాడిలో ఖలీద్ (అబూ ఆకాషా) హతమయ్యాడని, అతను శిక్షణ పొందిన లష్కరే తోయిబా ఉగ్రవాది అని, కశ్మీర్​లో కార్యకలాపాలు సాగించి, తిరిగి పారిపోయాడని డీజీఎంఓ కొన్ని రోజుల క్రితం తెలిపింది. ఇటీవల మురిడ్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయానికి మకాం మార్చి కేంద్ర కమిటీలో సభ్యుడు అయ్యాడని వివరిచింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.