మినీ స్విట్జర్లాండ్'గా పిలిచే పహల్గామ్ సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సుందరమైన బైసరన్లో ఉగ్రాదాడి జరిగింది. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఇందులో ఇద్దరు విదేశీయులు, మరో ఇద్దరు స్థానికులు, ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు. దాడిలో మరణించిన వారి మృతదేహాలను బుధవారం శ్రీనగర్ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. ఈ ఉగ్రదాడికి సంబంధించి అనుమానితుల స్కెచ్లు విడుదల చేశారు.
ఉగ్రవాదులు జమ్మూలోని కిష్త్వార్ నుంచి దక్షిణ కశ్మీర్లోని కోకర్నాగ్ మీదుగా బైసరన్కు చేరుకుని లోయలోని పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. అత్యంత ఘోరమైన దాడికి పాల్పడ్డారని అధికారులు అంటున్నారు. పాకిస్తాన్కు చెందిన నిషేధిత లష్కరే తోయిబా (ఎల్ఈటీ) షాడో సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించింది.
ప్రధాని నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఎయిర్పోర్ట్లోనే ఎమర్జెన్సీ భేటీ నిర్వహించారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం కాశ్మీర్కు చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రదేశానికి కూడా వెళ్లనున్నారు.
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను ముందుగానే రద్దు చేసుకుని భారత్కు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చే సమయంలో ప్రధాని మోదీ విమానం పాక్ గగనతలంలోకి ప్రవేశించలేదు. పాక్ గగనతలాన్ని నివారించి ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఢిల్లీకి చేరుకుంది.
సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం జెడ్డా చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పహల్గామ్పై ఉగ్రవాదులు దాడి చేయడంతో వెంటనే పర్యటన రద్దు చేసుకున్నారు. ఢిల్లీ నుంచి జెడ్డా (సౌదీ అరేబియా)కు వెళ్తుండగా ప్రధాని మోదీ విమానం పాక్ గగనతలం గుండా వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ విమానం అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించింది. ఈ మార్గం పాకిస్తాన్ గగనతలాన్ని పూర్తిగా నివారించి, భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్న ఒమన్, యుఎఇ లేదా సౌదీ అరేబియా వంటి స్నేహపూర్వక దేశాల గగనతలాన్ని ఉపయోగించింది.
పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇతర దేశాధినేతలు సైతం సంతాపం తెలిపారు.