భారత్​ని రెచ్చగొడుతున్న పాక్​! ఎల్​ఓసీ వెంబడి ఫైరింగ్​- కశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేతకు 'ఎన్​కౌంటర్​'-pahalgam terror attack pakistan army fires at some places on line of control indian army responds ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భారత్​ని రెచ్చగొడుతున్న పాక్​! ఎల్​ఓసీ వెంబడి ఫైరింగ్​- కశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేతకు 'ఎన్​కౌంటర్​'

భారత్​ని రెచ్చగొడుతున్న పాక్​! ఎల్​ఓసీ వెంబడి ఫైరింగ్​- కశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేతకు 'ఎన్​కౌంటర్​'

Sharath Chitturi HT Telugu

నియంత్రణ రేఖ వెంబడి కొన్ని చోట్ల పాకిస్థాన్​ సైన్యం కాల్పులు జరిపింది. భారత సైన్యం ప్రతిఘటించింది. మరోవైపు ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా జమ్ముకశ్మీర్​లోని బందిపొరాలో ఎన్​కౌంటర్​ మొదలైంది.

జమ్ముకశ్మీర్​లో భారత సైన్యం.. (REUTERS)

పహల్గామ్​​ ఉగ్రదాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచుతూ, శుక్రవారం ఉదయం నియంత్రణ రేఖ (ఎల్​ఓసీ) వెంబడి కొన్ని చోట్ల పాకిస్థాన్​ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ నేపథ్యంలో పాక్​ చర్యలను భారత సైన్యం సమర్థవంతంగా ప్రతిఘటించింది.

పహల్గామ్​లో టూరిస్ట్​లను ఉగ్రవాదులు కాల్చి చంపిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఎల్​ఓసీ వెంబడి కాల్పుల మోత మోగింది. ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్​తో ఇప్పటికే బలహీనంగా సంబంధాలను భారత్​ మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

ఇక ఎల్​ఓసీ వెంబడి తాజా పరిస్థితులపై భారత సైన్యం స్పందించింది.

“ఎల్​ఓసీ వెంబడి కొన్ని చోట్ల పాకిస్థాన్​ సైన్యం చిన్న ఆయుధాలతో ఫైరింగ్​ ప్రారంభించింది. భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది,” అని ఆర్మీ అధికారి వెల్లడించారు.

మరోవైపు ఆర్మీ చీఫ్​ జనరల్​ ఉపేంద్ర ద్వివేది మరికొన్ని గంటల్లో శ్రీనగర్​కి వెళ్లనున్నారు. అక్కడ అధికారులతో చర్చలు జరపనున్నారు. ఎల్​ఓసీ వెంబడి పరిస్థితులను సమీక్షించనుననారు.

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​..

మరోవైపు పహల్గామ్​ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్​లో భద్రతను కట్టుదిట్టం చేసింది భారత సైన్యం. ఉగ్రవాదుల ఏరివేత కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బందిపొరా జిల్లాలో భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య ఎన్​కౌంటర్​ చోటుచేసుకుంది.

బందిపోరా జిల్లాలోని కుల్నార్ బాజీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపడంతో గాలింపు చర్యలు ఎన్​కౌంటర్​గా మారాయని అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

కాగా.. జమ్ముకశ్మీర్​లోని ఉధంపూర్ జిల్లాలో గురువారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో భారత ఆర్మీ ప్రత్యేక దళాలకు చెందిన జవాను మృతి చెందాడు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో చేపట్టిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్​లో దుదు-బసంత్ గఢ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

వైష్ణోదేవి ఆలయం వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు..

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్టు అధికారులు వెల్లడించారు.

భద్రతను పెంచామని, అప్రమత్తంగా ఉన్నామని రియాసి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పరమ్ వీర్ సింగ్ తెలిపారు. భద్రతను నిర్ధరించడానికి ర్యాండమ్ చెకింగ్ సహా అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తు వనరుల్లోనే మేము ప్రతిదీ చేస్తున్నాము.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.