ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి కేసును ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ)కు అప్పగించింది కేంద్రం. ఈ మేరకు ఎన్ఐఏ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
పాకిస్థాన్ ప్రేరేపిత, లష్కరే తోయిబా (ఎల్ఈటీ) తన ప్రాక్సీ రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ద్వారా నిర్వహించిన ఈ ఉగ్రదాడి దర్యాప్తునకు ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంహెచ్ఏ ఉత్తర్వులను పొందిందని, ప్రస్తుతం ఈ కేసును జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి తీసుకునే ప్రక్రియలో ఉందని అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 22న బైసారన్ ప్రాంతంలోని పహల్గామ్లో జరగిన ఉగ్రదాడిలో 26మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ని ఎన్ఐఏ ఇప్పుడు రీ-రిజిస్టర్ చేయనుంది. ఆ తర్వాత అధికారిక దర్యాప్తును ప్రారంభిస్తుంది.
పహల్గామ్ దాడిలో ప్రాణాలతో బయటపడిన వారి వాంగ్మూలాలను ఎన్ఐఏ గత రెండు రోజులుగా నమోదు చేస్తోంది. డజన్ల కొద్దీ ఓవర్గ్రౌండ్ వర్కర్లను (ఓజీడబ్ల్యూ) విచారించడంతో పాటు ప్రస్తుతం జైళ్లలో ఉన్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఇతర ఉగ్ర సంస్థలకు చెందిన టెర్రరిస్టలను అదుపులోకి తీసుకుంది.
మరోవైపు ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), జమ్ముకశ్మీర్ పోలీసులు.. పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన దుండగుల కోసం గాలిస్తున్నారు.
ఏప్రిల్ 24 న హెచ్టీ మొదట నివేదించినట్లుగా, భారత నిఘా సంస్థలు ఇప్పటికే పహల్గామ్ దాడి డిజిటల్ ఫుట్ప్రింట్స్ని ముజఫరాబాద్, కరాచీలోని కొన్ని సేఫ్ హౌజ్లలో గుర్తించాయి. ఈ ఘటన వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని దీని ద్వారా స్పష్టమవుతోంది. 26/11 ముంబై దాడుల వేళ కనిపించిన కంట్రోల్ రూమ్ రన్ ఆపరేషన్ని పునరావృతం చేసి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఫోరెన్సిక్ విశ్లేషణ, బాధితుల వాంగ్మూలాల్లో నలుగురైదుగురు ఉగ్రవాదులు పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినట్లు వెల్లడైంది. ఏకే రైఫిల్స్, అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు సహా ఆటోమేటిక్ ఆయుధాలు టెర్రరిస్ట్ల దగ్గర ఉన్నాయి. కొంతమంది సైనిక తరహా దుస్తులు కూడా ధరించడం గమనార్హం!
“పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులతో ఈ ఘటనకు నేరుగా సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. భారత్లో లష్కరే తోయిబా గత ప్రధాన దాడులకు ప్రధాన కేంద్రాలుగా ఉన్న ముజఫరాబాద్, కరాచీలోని కొన్ని సేఫ్ హౌజ్లకు డిజిటల్ పాదముద్రలను గుర్తించాము. పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ పర్యవేక్షించే ఈ కంట్రోల్ సెంటర్స్ నుంచి గతంలో దాడుల ఆపరేషన్ జరిగింది,” అని ఓ అధికారి ఏప్రిల్ 23న హెచ్టీకి తెలిపారు.
ఈ ఏడాది జనవరి నుంచి నియంత్రణ రేఖ(ఎల్ఓసీ), ఇంటెలిజెన్స్ బోర్డర్(ఐబీ) నుంచి లష్కరే తోయిబా, జైషే మహ్మద్కి చెందిన అత్యంత నైపుణ్యం కలిగిన ఉగ్రవాదులను భారత్లోకి పంపించేందుకు పాక్ సైన్యం, ఐఎస్ఐ సహకరిస్తున్నాయని సమాచారం అందింది.
చొరబడిన ఉగ్రవాదులు, వారికి సహకరిస్తున్న ఓవర్ గ్రౌండ్ వర్కర్లను గుర్తించేందుకు ఎన్ఐఏ ఫిబ్రవరి, మార్చ్లో జమ్ముకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది.
భారత్లోకి ప్రవేశించి ఆహారం, ఆశ్రయం, డబ్బు అందుకున్న తర్వాత ఈ ఉగ్రవాదులను స్థానిక ఓవర్గ్రౌండ్ వర్కర్లు వివిధ ప్రాంతాలకు తరలించి ఉంటారని అనుమానిస్తున్నారు.
కథువా, ఉధంపూర్, దోడా, కిష్త్వార్, రియాసి, రాజౌరీ, పూంచ్, కాశ్మీర్ లోయకు కూడా ఉగ్రవాదులు ప్రవేశించినట్లు భావిస్తున్నట్లు ఎన్ఐఏ మార్చిలో ఒక ప్రకటన విడుదల చేసింది.
అలీ భాయ్ అలియాస్ తల్హా భాయ్, హషీమ్ మూసా అలియాస్ సులేమాన్, స్థానిక ఆపరేటర్ ఆదిల్ హుస్సేన్ థోకర్ వంటి ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్లను జమ్మూకశ్మీర్ పోలీసులు శుక్రవారం విడుదల చేశారు.
2024 మేలో పూంచ్లో ఐఏఎఫ్ కాన్వాయ్పై జరిగిన దాడితో సహా జమ్ముకశ్మీర్లో కనీసం మూడు మునుపటి దాడుల్లో మూసా ప్రమేయం ఉందని హెచ్టీ ఇంతకు ముందు నివేదించింది.
లష్కరే తోయిబాకు చెందిన 8 మంది, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన ముగ్గురు చొప్పున మొత్తం 14 మంది ఉగ్రవాదులు కశ్మీర్ లోయలో యాక్టివ్గా ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
సంబంధిత కథనం