జమ్ముకశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన బాధితుల కథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో అక్కడే ఉన్న ఓ బీజేపీ నేత తాజాగా తనకు ఎదురైన సంఘటనను సోషల్ మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఓ కశ్మీరి గైడ్ సాహసం చేసి.. తన కూతురిని కాపాడినట్టు వివరించారు.
జమ్ముకశ్మీర్ పహల్గామ్ అనే ప్రాంతంపై మంగళవారం ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అక్కడే ఉన్న టూరిస్ట్లను భయభ్రాంతులకు గురి చేసి మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో 26మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.
అయితే, పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో ఛత్తీస్గఢ్కి చెందిన బీజేపీ యువ మోర్చా నేత అరవింద్ అగర్వాల్ అక్కడే ఉన్నారు! రాయ్పూర్కి చెందిన ఆయన.. తన భార్య, పిల్లలతో పాటు మొత్తం 11 మందితో కలిసి హాలీడే కోసం జమ్ముకశ్మీర్ వెళ్లారు.
మంగళవారం జరిగిన సంఘటనలను వివరిస్తూ.. అగర్వాల్ తాజాగా ఒక పోస్ట్ చేశారు. కాల్పుల శబ్దాలు వినిపించినప్పుడు అందరు పారిపోయేందుకు ప్రయత్నించారని, చాలా మంది ఫెన్సింగ్ దూకి ప్రాణాలు కాపాడుకున్నారని వివరించారు. అయితే, తన 4ఏళ్ల కూతురు సమృద్ధి మాత్రం కాల్పుల శబ్దాలకు భయపడిపోయిందని, ఆ భయంలో ఎటువైపు వెళుతున్నానో కూడా తెలియకుండా ఉగ్రవాదులు ఉన్న ఖాళీ మైదానంవైపు పరిగెత్తిందని అగర్వాల్ చెప్పారు. తాను వేరే చోట ఉండిపోవాల్సి వచ్చిందని, తన భార్య పూజ మాత్రం బిడ్డను రక్షించేందుకు పరుగులు తీసిందని వివరించారు.
"అది కాల్పుల శబ్దమో లేక టపాకాయల శబ్దమో తొలుత అర్థంకాలేదు. నా బిడ్డ వేరేవైపునకు పరిగెత్తి, ఖాళీ మైదానంలో ఉండిపోయింది. ఇంతలో ఉగ్రవాదులు ఆమె దగ్గరికి వెళ్లారు," అని అగర్వాల్ తన పోస్ట్లో పేర్కొన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి వేళ నజకత్ అలీ అనే స్థానిక గైడ్ ధైర్యం చేసి, తన బిడ్డను రక్షించాడని అగర్వాల్ వెల్లడించారు.
"నా భార్య, మరికొందరి స్నేహితుల దగ్గర ఉండిపోయింది. అక్కడే నజకత్ అలీ కూడా ఉన్నాడు. ఉగ్రవాదులు నా బిడ్డ దగ్గరికి వెళ్లాడు. బాలిక ఎవరు? అని నజకత్ని అడిగారు. "ఆమె నా కూతురు," అని నజకత్ చెప్పాడు. ఆ తర్వాత నా బిడ్డను ఉగ్రవాదులు వదిలేశారు," అని నాటి సంఘటనను సోషల్ మీడియా వేదికగా వివరించారు బీజేపీ యువ మోర్చా నేత అరవింద్ అగర్వాల్.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. అక్కడి నుంచి స్థానిక పోనీవాలాలు తమను రక్షించి, సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారని అగర్వాల్ తెలిపారు. ఈ పూర్తి ఘటనలో తన భార్య భుజానికి దెబ్బ తగిలితే, స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారని వివరించారు.
"ఉగ్రవాదులను తప్పించుకునే క్రమంలో నా భార్యకు దెబ్బ తగిలింది. స్థానికులే ఆమెను పహల్గామ్లోని ఆసుపత్రికి తరలించారు," అని అగర్వాల్ తెలిపారు.
ఈ పూర్తి వ్యవహారంపై నజకత్ అలీ స్పందించాడు.
"కాల్పుల శబ్దం వినిపించినప్పుడు నేను పిల్లలతో ఆడుకుంటున్నాను. టపాకాయలు పేలుతున్నట్టు అనిపించింది. కానీ శబ్దాలు మరింత పెరిగాయి. నేను పిల్లలను తీసుకుని పరిగెత్తాను," అని నజకత్ అలీ అన్నాడు.
"ఈ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో మానవత్వ చచ్చిపోయిందనిపిస్తోంది. ఇలాంటి ఘటనలు అస్సలు జరగకూడదు. కానీ పిల్లలు, టూరిస్ట్లను కాపాడటం చాలా సంతోషంగా ఉంది. 11మందిని కాపాడినందుకు సంతోషంగా ఉంది," అని నజకత్ చెప్పుకొచ్చాడు.
సంబంధిత కథనం