‘పహల్గామ్​’ ఎఫెక్ట్​- 16 పాక్​ యూట్యూబ్​ ఛానెల్స్​ నిషేధం, బీబీసీకి కేంద్రం లెటర్​..-pahalgam terror attack india bans 16 pakistani youtube channels centre writes to bbc ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘పహల్గామ్​’ ఎఫెక్ట్​- 16 పాక్​ యూట్యూబ్​ ఛానెల్స్​ నిషేధం, బీబీసీకి కేంద్రం లెటర్​..

‘పహల్గామ్​’ ఎఫెక్ట్​- 16 పాక్​ యూట్యూబ్​ ఛానెల్స్​ నిషేధం, బీబీసీకి కేంద్రం లెటర్​..

Sharath Chitturi HT Telugu

భారత్​కు వ్యతిరేకంగా మతపరమైన- సున్నితమైన కంటెంట్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయన్న ఆరోపణలతో 16 పాక్ మీడియా యూట్యూబ్ ఛానళ్లను ప్రభుత్వం తాజాగా నిషేధించింది. పహల్గామ్​ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. అంతేకాదు బీబీసీకి కూడా అధికారికంగా లెటర్​ రాసింది.

ఇండియాలో పాక్​ యూట్యూబ్​ ఛానెల్స్​ బంద్​!

పహల్గామ్​ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్​పై కఠినంగా వ్యవహరిస్తున్న భారత ప్రభుత్వం.. తాజాగా ఆ దేశానికి చెందిన పలు యూట్యూబ్​ ఛానెల్స్​ని ఇండియాలో నిషేధించింది. అంతేకాదు, పహల్గామ్​ ఉగ్రదాడి కవరేజీ విషయంలో బీబీసీకి ప్రభుత్వం లేఖ రాసింది.

ప్రముఖ పాక్​ యూట్యూబ్​ ఛానెల్స్​పై నిషేధం..

డాన్, సామా టీవీ, ఏఆర్​వై న్యూస్, జియో న్యూస్, రాజీ నామా, జీఎన్ఎన్, ఇర్షాద్ భట్టి వంటి పలు ప్రముఖ మీడియా సంస్థలు సహా పాకిస్థాన్​కి చెందిన మొత్తం 16 యూట్యూబ్ ఛానళ్లను ప్రభుత్వం నిషేధించింది.

భారతదేశానికి వ్యతిరేకంగా మతపరమైన- సున్నితమైన కంటెంట్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయన్న ఆరోపణలతో హోం మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు వీటిని నిషేధించినట్లు విశ్వసనీయ వర్గాలు సోమవారం తెలిపాయి.

“జమ్ముకశ్మీర్​లో విషాదకరమైన పహల్గామ్ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో భారత్.. దాని సైన్యం, భద్రతా సంస్థలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే, మతపరమైన- సున్నితమైన కంటెంట్, తప్పుడు- తప్పుదోవ పట్టించే కథనాలు ప్రసారం చేసినందుకు భారత ప్రభుత్వం డాన్ న్యూస్, సామా టీవీ, ఆరీ న్యూస్, జియో న్యూస్ సహా 16 పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది,” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ప్రభుత్వ తాజా చర్యలతో ఆయా యూట్యూబ్​ ఛానెల్స్​లో ఇప్పటివరకు ప్లే అవుతున్న సీరియల్స్​ కూడా ఇండియాలో ఆగిపోతాయి.

నిషేధించిన యూట్యూబ్ ఛానళ్ల పూర్తి జాబితా

జమ్ముకశ్మీర్ పహల్గామ్​లోని ప్రముఖ పర్యాటక ప్రదేశంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

టెర్రర్​ అటాక్​ జరిగినప్పటి నుంచి ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్​పై భారత్ అనేక చర్యలు తీసుకుంది. అంతకుముందు పాక్ ప్రభుత్వానికి చెందిన ఎక్స్ ఖాతాను భారత్ బ్లాక్ చేసింది. ఇండస్​ వాటర్​ ట్రీటీని రద్దు చేసింది.

బీబీసీకి లేఖ..

పహల్గామ్ ఉగ్రదాడి కవరేజీపై బీబీసీకి కేంద్రం లేఖ రాసింది.

“టెర్రరిస్ట్​లను ‘మిలిటెంట్లు’గా సంబోధిస్తూ కవరేజీ ఇచ్చిన బీబీసీకి కేంద్రం అధికారిక లేఖ రాసింది. ఇక భారత విదేశాంగశాఖలోని ఎక్స్​పీ విభాగం.. బీబీసీ రిపోర్టింగ్​ని పర్యవేక్షిస్తుంది,” అని ఓ అధికారి వివరించారు.

పహల్గామ్ ఉగ్రదాడి..

పహల్గామ్ ఉగ్రదాడి ఏప్రిల్ 22న జరిగింది. 2019లో పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న తర్వాత కశ్మీర్​లో జరిగిన అత్యంత భయంకర ఘటనగా ఈ పహల్గామ్​ ఉగ్రదాడి ఘటన నిలిచింది.

ఈ ఘటన అనంతరం సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్​కు గట్టి సందేశం ఇచ్చేందుకు భారత్ పలు చర్యలు చేపట్టింది. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తామని, అట్టారీ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును తక్షణమే మూసివేస్తామని తెలిపింది.

అందుకు బదులుగా.. 1971లో భారత్-పాక్ యుద్ధం ముగిసిన తర్వాత కుదిరిన శిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తామని పాకిస్థాన్ భారత్​ని హెచ్చరించింది.

అన్ని భారతీయ విమానయాన సంస్థలకు గగనతల ఆంక్షలను కూడా పాకిస్థాన్ ప్రకటించింది. స్పైస్ జెట్, ఎయిరిండియా, ఇండిగో సహా పలు విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేశాయి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.