పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్పై కఠినంగా వ్యవహరిస్తున్న భారత ప్రభుత్వం.. తాజాగా ఆ దేశానికి చెందిన పలు యూట్యూబ్ ఛానెల్స్ని ఇండియాలో నిషేధించింది. అంతేకాదు, పహల్గామ్ ఉగ్రదాడి కవరేజీ విషయంలో బీబీసీకి ప్రభుత్వం లేఖ రాసింది.
డాన్, సామా టీవీ, ఏఆర్వై న్యూస్, జియో న్యూస్, రాజీ నామా, జీఎన్ఎన్, ఇర్షాద్ భట్టి వంటి పలు ప్రముఖ మీడియా సంస్థలు సహా పాకిస్థాన్కి చెందిన మొత్తం 16 యూట్యూబ్ ఛానళ్లను ప్రభుత్వం నిషేధించింది.
భారతదేశానికి వ్యతిరేకంగా మతపరమైన- సున్నితమైన కంటెంట్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయన్న ఆరోపణలతో హోం మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు వీటిని నిషేధించినట్లు విశ్వసనీయ వర్గాలు సోమవారం తెలిపాయి.
“జమ్ముకశ్మీర్లో విషాదకరమైన పహల్గామ్ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో భారత్.. దాని సైన్యం, భద్రతా సంస్థలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే, మతపరమైన- సున్నితమైన కంటెంట్, తప్పుడు- తప్పుదోవ పట్టించే కథనాలు ప్రసారం చేసినందుకు భారత ప్రభుత్వం డాన్ న్యూస్, సామా టీవీ, ఆరీ న్యూస్, జియో న్యూస్ సహా 16 పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది,” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వ తాజా చర్యలతో ఆయా యూట్యూబ్ ఛానెల్స్లో ఇప్పటివరకు ప్లే అవుతున్న సీరియల్స్ కూడా ఇండియాలో ఆగిపోతాయి.
జమ్ముకశ్మీర్ పహల్గామ్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
టెర్రర్ అటాక్ జరిగినప్పటి నుంచి ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్పై భారత్ అనేక చర్యలు తీసుకుంది. అంతకుముందు పాక్ ప్రభుత్వానికి చెందిన ఎక్స్ ఖాతాను భారత్ బ్లాక్ చేసింది. ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసింది.
పహల్గామ్ ఉగ్రదాడి కవరేజీపై బీబీసీకి కేంద్రం లేఖ రాసింది.
“టెర్రరిస్ట్లను ‘మిలిటెంట్లు’గా సంబోధిస్తూ కవరేజీ ఇచ్చిన బీబీసీకి కేంద్రం అధికారిక లేఖ రాసింది. ఇక భారత విదేశాంగశాఖలోని ఎక్స్పీ విభాగం.. బీబీసీ రిపోర్టింగ్ని పర్యవేక్షిస్తుంది,” అని ఓ అధికారి వివరించారు.
పహల్గామ్ ఉగ్రదాడి ఏప్రిల్ 22న జరిగింది. 2019లో పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న తర్వాత కశ్మీర్లో జరిగిన అత్యంత భయంకర ఘటనగా ఈ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నిలిచింది.
ఈ ఘటన అనంతరం సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్కు గట్టి సందేశం ఇచ్చేందుకు భారత్ పలు చర్యలు చేపట్టింది. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తామని, అట్టారీ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును తక్షణమే మూసివేస్తామని తెలిపింది.
అందుకు బదులుగా.. 1971లో భారత్-పాక్ యుద్ధం ముగిసిన తర్వాత కుదిరిన శిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తామని పాకిస్థాన్ భారత్ని హెచ్చరించింది.
అన్ని భారతీయ విమానయాన సంస్థలకు గగనతల ఆంక్షలను కూడా పాకిస్థాన్ ప్రకటించింది. స్పైస్ జెట్, ఎయిరిండియా, ఇండిగో సహా పలు విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేశాయి.
సంబంధిత కథనం