'పహల్గామ్​' ఉగ్రవాదుల ఇళ్లల్లో ఆర్మీ తనిఖీ- ఆ సమయంలోనే పేలుడు! అసలేం జరిగింది?-pahalgam terror attack houses of 2 lashkar terrorists destroyed in blast ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'పహల్గామ్​' ఉగ్రవాదుల ఇళ్లల్లో ఆర్మీ తనిఖీ- ఆ సమయంలోనే పేలుడు! అసలేం జరిగింది?

'పహల్గామ్​' ఉగ్రవాదుల ఇళ్లల్లో ఆర్మీ తనిఖీ- ఆ సమయంలోనే పేలుడు! అసలేం జరిగింది?

Sharath Chitturi HT Telugu

కశ్మీర్​లో పహల్గామ్​ ఉగ్రదాడిలో పాలుపంచుకున్నట్టు అనుమానిస్తున్న ఇద్దరు లష్కర్​ ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆయా చోట్ల సైన్యం గాలింపులు చేపట్టగా, అప్పటికే అమర్చిన పేలుడు పదార్థాలు పేలిపోయాయి. ఫలితంగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.

లష్కరే తోయిబా ఉగ్రవాది ఇల్లు ధ్వంసం (HT)

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గామ్​ ఉగ్రదాడిలో ప్రమేయం ఉందని భావిస్తున్న లష్కరే తోయిబా టెర్రరిస్ట్​ ఆసిఫ్​ షేక్​ ఇల్లు గురువారం రాత్రి ధ్వంసమైంది. అంతేకాదు, ఆసిఫ్​ షేక్​తో పాటు మరొక ఉగ్రవాది ఇల్లు కూడా పేలుడులో ధ్వంసమైనట్టు తెలుస్తోంది.

ఈ సమాచారాన్ని హెచ్​టీ తెలుగు, హెచ్​టీ స్వతంత్రంగా ధృవీకరించలేదు.

ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ థోకర్, ఆసిఫ్ షేక్ ఇళ్లలో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అప్పటికే వాటిల్లో అమర్చిన పేలుడు పదార్థాలు పేలినట్టు సమాచారం. ఫలితంగా ఆయా పేలుళ్లలో ఇళ్లు ధ్వంసమయ్యాయని నివేదిక తెలిపింది.

దక్షిణ కశ్మీర్​లోని అనంత్ నాగ్ జిల్లా బిజ్ బెహరా బ్లాక్​కు చెందిన ఆదిల్ హుస్సేన్ తోకర్ మంగళవారం జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పుల్వామా జిల్లా త్రాల్​కు చెందిన ఆసిఫ్ షేక్ ఈ దాడి కుట్రలో పాలుపంచుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

పహల్గామ్​ ఉగ్రదాడి నేపథ్యంలో ఆదిల్ హుస్సేన్ థోకర్​ను మోస్ట్ వాంటెడ్​గా ప్రకటించిన అనంత్ నాగ్ పోలీసులు అతడిని ఆచూకీ చెప్పిన వారికి రూ .20 లక్షల రివార్డును ఇస్తామని వెల్లడించారు. ఇదే కేసులో ఇద్దరు పాక్ జాతీయులను మోస్ట్ వాంటెడ్​గా అధికారులు ప్రకటించారు.

ఆదిల్ హుస్సేన్ థోకర్ 2018లో పాకిస్థాన్ వెళ్లి అక్కడ ఉగ్రవాద శిక్షణ పొందాడని, ఆ తర్వాత జమ్ముకశ్మీర్​కు తిరిగి వచ్చాడని తెలుస్తోంది.

సుశిక్షితులైన, కరడుగట్టిన పాక్ ఉగ్రవాదులకు స్థానిక గైడ్​గా థోకర్ వ్యవహరిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వివరాల ఆధారంగా పహల్గామ్ దాడికి పాల్పడిన ముగ్గురు​ ఉగ్రవాదుల స్కెచ్​ (ఊహా చిత్రాలు)లను అధికారులు విడుదల చేశారు. వీటిల్లో ఆసిఫ్​ షేక్​, సులెమాన్​ షా, అబు తల్లా ఫొటోలు ఉన్నాయి.

పాకిస్థాన్​ ఆధారిత లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) మంగళవారం దాడి వెనుక ఉందని భావిస్తున్నారు. లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్.. పహల్గామ్​ ఉగ్రదాడికి సూత్రధారి అని కొన్ని నివేదికలు సూచించాయి. ఈ వాదనలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మంగళవారం జరిగిన పహల్గామ్​ ఉగ్రదాడిలో 26మంది టూరిస్ట్​లు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఉగ్రదాడి సమయంలో తీసిన దృశ్యాలు, బాధితుల ఆర్థనాథాలు, దయనీయ కథలు యావత్​ ప్రపంచాన్ని కదిలించాయి. ఉగ్రదాడికి కఠినంగా బదులు చెబుతామని భారత్​ తేల్చిచెప్పింది. ఈ విషయంలో భారత్​కు సానుభూతి తెలుపుతూ ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.