మే 7, బుధవారం పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు క్షిపణి దాడులను చేసిన నేపథ్యంలో, భారత్ లో 430 విమానాలను రద్దు చేశారు. ఉత్తర, పశ్చిమ మరియు మధ్య భారతదేశంలోని 27 విమానాశ్రయాలను మే 10, శనివారం వరకు మూసివేశారు. ఎయిరిండియా, ఇండిగో, స్పైస్ జెట్, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్, అకాసా ఎయిర్, పలు విదేశీ విమానయాన సంస్థలు ఈ విమానాశ్రయాలకు రాకపోకలు సాగించే సర్వీసులను రద్దు చేసుకున్నాయి.
భారత విమానయాన సంస్థలు గురువారం మొత్తం 430 విమానాలను రద్దు చేశాయి. మరోవైపు, చాలా అంతర్జాతీయ విమానయాన సంస్థలు పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించడం నిలిపివేసి, బదులుగా ముంబై, అహ్మదాబాద్ మీదుగా విమానాలను ‘రీ రూట్’ చేయడానికి ఎంచుకున్నాయి.
శ్రీనగర్, జమ్మూ, లేహ్, చండీగఢ్, అమృత్ సర్, లుధియానా, పాటియాలా, బటిండా, హల్వారా, పఠాన్ కోట్, భుంతర్, సిమ్లా, గగ్గల్, ధర్మశాల, కిషన్ గఢ్, జైసల్మేర్, జోధ్ ఫూర్, బికనీర్, ముంద్రా, జామ్ నగర్, రాజ్ కోట్, పోర్ బందర్, కాండ్లా, కేశోద్, భుజ్, గ్వాలియర్, హిందాన్ విమానాశ్రయాలను మే 10, శనివారం వరకు తాత్కాలికంగా వాణిజ్య విమానాల రాకపోకలకు మూసివేశారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై సాయుధ దళాలు క్షిపణి దాడులు చేసిన రోజునే భారత గగనతలం గుండా విమానాలు పాకిస్తాన్ లోకి ప్రవేశించడానికి అనుమతించే సుమారు 25 విమాన మార్గాలను భారత్ బుధవారం మూసివేసింది.
సంబంధిత కథనం