జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశమంతా ఆగ్రహంతో ఉంది. ప్రతిస్పందనగా, భారత సైన్యం అర్ధరాత్రి 1:30 గంటలకు ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.
ఈ ఆపరేషన్లో కనీసం 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. పాకిస్తాన్లోని బహవల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్, గుల్పూర్, భింబెర్, సియాల్కోట్, మురిద్కేలలోని ఉగ్రవాదుల శిబిరాలను సైన్యం పూర్తిగా నాశనం చేసింది.
దీనితో పాటు, మురిద్కేలోని లష్కర్-ఎ-తోయిబా శిక్షణ శిబిరం మార్కాజ్-ఎ-తోయిబా, బహవల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ స్థావరం జష్-శుభానల్లాను కూడా ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఆపరేషన్ తర్వాత పలువురు విపక్ష నేతల స్పందనలు వస్తున్నాయి.
ఆపరేషన్ సింధూర్పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో - ‘మా సైన్యంపై మాకు గర్వంగా ఉంది. జై హింద్’ అని రాశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ మాట్లాడుతూ, "పాకిస్తాన్, పీఓకే నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాల ఉగ్రవాదంపై భారతదేశ జాతీయ విధానం స్థిరంగా, స్పష్టంగా ఉంది. పాకిస్తాన్, పీఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన, సాహసోపేతమైన దాడులు చేసిన మన భారత సాయుధ దళాలపై మాకు గర్వంగా ఉంది. వారి ధైర్యాన్ని, సంకల్పాన్ని మేం అభినందిస్తున్నాము. ఈ సమయంలో జాతీయ ఐక్యత, సంఘీభావం చాలా అవసరం. భారత జాతీయ కాంగ్రెస్ మా సైన్యాలకు గట్టిగా అండగా నిలుస్తుంది." అని పేర్కొన్నారు.
మరోవైపు ఆపరేషన్ సిందూర్లో సైన్యం ధైర్యసాహసాలను ప్రతిపక్ష నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసించారు. ఉగ్రవాదంపై ఈ దాడులను స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ శశిథరూర్.. జై హింద్ అని పేర్కొన్నారు.