భారత్ దాడిలో లష్కరే, జైషేకు చెందిన టాప్ 5 ఉగ్రవాదులు హతం-operation sindoor top 5 pakistani terrorists killed in india attacks know the list ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భారత్ దాడిలో లష్కరే, జైషేకు చెందిన టాప్ 5 ఉగ్రవాదులు హతం

భారత్ దాడిలో లష్కరే, జైషేకు చెందిన టాప్ 5 ఉగ్రవాదులు హతం

Anand Sai HT Telugu

మే 7న భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ పేరుతో పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో కీలక ఉగ్రవాదులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది.

భారత్ దాడిలో కీలక ఉగ్రవాదులు హతం

పహల్గామ్ దాడి తర్వాత 2025 మే 7న ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసింది. భారత్ చేపట్టిన లక్షిత దాడుల్లో పలువురు ప్రముఖ ఉగ్రవాదులు హతమయ్యారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు మరణించారు. ఇందులో టాప్ 5 ఉగ్రవాదులను గుర్తించారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ జాబితాను విడుదల చేసింది.

ముదస్సర్ ఖదియాన్ ఖాస్ అలియాస్ అబు జుందాల్

లష్కరే తోయిబా ఉగ్రవాది ముదస్సర్ ఖదియాన్ ఖాస్ మర్కజ్ తైబా మురిద్కే చీఫ్. అతడి అంతిమయాత్రలో పాక్ ఆర్మీ గౌరవ వందనం సమర్పించింది. పాక్ ఆర్మీ చీఫ్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. జెయుడి నాయకుడు హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో అంత్యక్రియల ప్రార్థనలు జరిగాయి. ఈ సమయంలో లెఫ్టినెంట్ జనరల్, పోలీస్ ఐజీ కూడా ఉన్నారు.

హఫీజ్ మహమ్మద్ జమీల్

జైషే మహ్మద్ ఉగ్రవాది. ఇతను మౌలానా మసూద్ అజహర్‌కు బావమరిది కూడా. మర్కజ్ సుభాన్ అల్లా బహవల్పూర్ ఇన్చార్జిగా ఉన్నాడు. ముస్లిం యువతను తీవ్రవాదులుగా మార్చడంలో, నిధులు సమకూర్చడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు.

మహ్మద్ యూసుఫ్ అజహర్

జైషే మహ్మద్ ఉగ్రవాది. ఇతను కూడా మౌలానా మసూద్ అజహర్‌కు బావమరిది. జైషే మహ్మద్‌కు ఆయుధ శిక్షణకు కార్యక్రమాలకు బాధ్యత వహించాడు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడులతో సంబంధం ఉంది. ఐసీ-814 విమానం హైజాకింగ్ కేసులో కూడా పేరుంది.

ఖలీద్ అలియాస్ అబు ఆకాషా

జమ్ముకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఆయుధాల అక్రమ రవాణాలో కూడా ఉన్నాడు. ఫైసలాబాద్‌లో జరిగిన అతడి అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.

మహమ్మద్ హసన్ ఖాన్

జైషే మహ్మద్ పీఓకే కమాండర్ ముఫ్తీ అస్గర్ ఖాన్ కాశ్మీరీ కుమారుడు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్లాన్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.