ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్తో భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. మే 9-10 మధ్య జరిగిన ఈ ఆపరేషన్కి సంబంధించిన కీలక విషయాలు తాజాగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక ఇప్పుడు పాకిస్థాన్ని భారత వాయుసేన తెలివిగా బోల్తా కొట్టించిన ఒక ఘటనకు సంబంధించిన వార్త వైరల్గా మారింది. ఐఏఎఫ్ ముందు ఒక డమ్మీ విమానాన్ని పంపి, పాక్కి చెందిన కీలక మిసైల్ వ్యవస్థల లొకేషన్లు పసిగట్టింది. ఆ తర్వాత వాటిపై దాడి చేసిందట!
ఈ ఘటనకు సంబంధించి రక్షణశాఖ వర్గాలు మీడియాకు పలు కీలక విషయాలను వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా మే 9-10 అర్థరాత్రి వేళ 11 పాకిస్థానీ ఎయిర్ బేస్లపై మిసైల్స్తో భారత్ దాడి చేసింది. అయితే, మిసైల్స్ లాంచ్ చేసే ముందు యుద్ధ విమానాన్ని పోలి ఉండే విధంగా ఒక డమ్మీ విమానాన్ని గాల్లోకి పంపించింది ఐఏఎఫ్. ఆ విమానాన్ని యుద్ధ విమానంగా భావించిన పాక్, దాన్ని కూల్చేందుకు తమ హెచ్క్యూ-9 మిసైల్ సిస్టెమ్స్ని యాక్టివేట్ చేసింది.
ఆ గగనతల రక్షణ వ్యవస్థలు యాక్టివేట్ అయిన వెంటనే, వాటి లొకేషన్ వివరాలు భారత్కు తెలిసిపోయాయి. వాటిపై మిసైల్స్తో దాడి చేసి ధ్వంసం చేసింది!
"ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టెమ్స్ని చైనా పాకిస్థాన్కి ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వీటి లాంచర్లు, రాడార్లను వివిధ లొకేషన్స్కి తరలించింది. కొన్నింటిని కొత్త కొత్త లోకేషన్స్లో పెట్టింది. అప్పుడు వాటి వివరాలు తెలియలేదు. కానీ డమ్మీ విమానం పంపడంతో అవి యాక్టివేట్ అయిన తర్వాత, వాటి లొకేషన్స్ తెలిశాయి," అని డిఫెన్స్ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ ఒక కథనం ప్రచురించింది.
పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టెమ్స్ని ధ్వంసం చేసేందుకు భారత్ బ్రహ్మోస్, స్కాల్ప్ వంటి లాంగ్ రేంజ్ మిసైల్స్ని ప్రయోగించింది. వీటి వల్ల పాకిస్థాన్ వాయుసే నెట్వర్క్కి చాలా నష్టం వాటిల్లింది. ఎయిర్స్ట్రిప్లు, హ్యాంగర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి.
"ఈ దాడులు ఎంత భయానకంగా ఉన్నాయంటే.. భారత్పై దాడిని ఆపేసి, మనతో చర్చలు జరపాలని పరిగెత్తుకుంటూ వచ్చింది! డీజీఎంఓలు మాట్లాడుకుని భారత సైనిక చర్యలను వెంటనే ఆపేలా చేయాలని పాకిస్థాన్ ఎయిర్ బేస్లు తమ అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నాయి," అని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
రక్షణ వర్గాల ప్రకారం క్షేత్రస్థాయిలో ఆపరేషన్ జరుగుతున్నప్పుడు బ్రహ్మోస్ని ఉపయోగించడం అదే మొదటిసారి.
తేరుకున్న తర్వాత పాకిస్థాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైళ్లు, క్రూయిజ్ మిసైళ్లను భారత్కు చెందిన ఎస్-400, ఎంఆర్ఎస్ఏఎం, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ యూనిట్లు సమర్థవంతంగా ధ్వంసం చేశాయి.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్న సమయంలో భారత్- పాకిస్థాన్లు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. అప్పటి నుంచి సైనిక స్థాయిలో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సరిహద్దు వెంబడి ప్రశాంత వాతావరణం నెలకొంది.
సంబంధిత కథనం