Operation Sindoor :​ 'పహల్గామ్​'కి ప్రతీకారం తీర్చుకున్న భారత్​.. పాక్​లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు-operation sindoor indian armed forces hit terror targets in pakistan to avenge pahalgam terror attack ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Operation Sindoor :​ 'పహల్గామ్​'కి ప్రతీకారం తీర్చుకున్న భారత్​.. పాక్​లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు

Operation Sindoor :​ 'పహల్గామ్​'కి ప్రతీకారం తీర్చుకున్న భారత్​.. పాక్​లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు

Sharath Chitturi HT Telugu

పహల్గామ్​ ఉగ్రదాడికి ఆపరేషన్​ ‘సిందూర్​’తో ప్రతీకారం తీర్చుకుంది భారత్​. పాకిస్థాన్​, పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది.

ఆపరేషన్​ సిందూర్​..

యావత్​ భారత దేశం ఎదురుచూస్తున్న, కోరుకుంటున్న ఘట్టం ఆవిష్కృతమైంది. పహల్గామ్​ ఉగ్రదాడికి భారత్​ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్థరాత్రి- బుధవారం తెల్లవారుజామున జరిగిన ఆపరేషన్​ ‘సిందూర్’లో భాగంగా పాకిస్థాన్​తో పాటు పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది.

అసలేంటి ఈ ఆపరేషన్​ సిందూర్​..?

గత నెలలో కశ్మీర్​లోని పహల్గామ్​లోకి చొరబడిన ఉగ్రవాదులు 26 మందిని చంపేశారు. అనంతరం భారత్​- పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్​ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు భారత్​ అనేక చర్యలు చేపట్టింది. అయితే, పహల్గామ్​ ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం నుంచి మిలిటరీ యాక్షన్​ కోసం యావత్​ భారత దేశం ఎదురుచూసింది.

మంగళవారం అర్థరాత్రి- బుధవారం తెల్లవారుజామున సమయంలో పహల్గామ్​కి భారత్​ ప్రతీకారం తీర్చుకుంది. భారత్​ సైన్యం, నేవీ, వాయుసేన సంయుక్తంగా ఆపరేషన్​ 'సిందూర్​'ని చేపట్టాయి.

పాకిస్థాన్​, పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని 9 ఉగ్రవాద క్యాంపులపై భారత సైన్యం దాడి చేసింది. ఈ విషయాన్ని మంగళవారం అర్థరాత్రి 1:44 గంటలకు భారత సైన్యం ప్రకటించింది. ఆపరేషన్​ని మానిటర్​ చేసిన అధికారులతో హిందుస్థాన్​ టైమ్స్​ మాట్లాడింది. ఆపరేషన్​ ఇంకా కొనసాగుతోందని, భారత ఫైటర్​ జెట్లు ఇంకా గాల్లో ఉన్నట్టు ఆ సమయంలో ఓ అధికారి తెలిపారు.

"బహవల్​పూర్​, మురీడ్కేలోని లష్కే తోయిబా, జైషే మహమ్మద్​ హెడ్​క్వార్టర్స్​ని టార్గెట్​ చేశారు. మిసైల్​ దాడులు జరిగాయి," అని సదరు అధికారి వివరించారు. ఈ ఆపరేషన్​ కోసం స్టాండాఫ్​ క్రూయిజ్​ మిసైళ్లను ఉపయోగించినట్టు తెలిపారు.

ఆపరేషన్​ సిందూర్​లో భారత సైన్యంతో పాటు నేవీ, వాయు సేనకు చెందిన ఆయుధ వ్యవస్థలు పాల్గొన్నాయి. టార్గెట్ల కోసం ఎదురుచూసి, ఎదురుచూసి దాడులు చేసే సూసైడ్​ డ్రోన్స్​ (లాయిటరీ మునిషన్స్​)ని కూడా ఈ ఆపరేషన్​లో వినియోగించారు.

"న్యాయం జరిగింది," అని ఆపరేషన్​ సిందూర్​ అనంతరం భారత సైన్యం ట్వీట్​ చేసింది. వాస్తవానికి.. ఆపరేషన్​ని కొంతసేపటి ముందు.. "దాడికి సిద్ధం" అంటూ ఒక పోస్ట్​ చేసింది.

పాక్​, పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన కోఆర్డినేషన్లను నిఘా ఏజెన్సీలు సైన్యంతో పంచుకున్నాయి. అయితే, భారత భూభాగం నుంచే దాడులు జరిగినట్టు తెలుస్తోంది.

ఆపరేషన్​ సిందూర్​పై రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ట్వీట్​ చేశారు. "భారత్​ మాతా కీ జై" అని హిందీలో ఒక పోస్ట్​ చేశారు.

ఈ ఆపరేషన్​ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రంతా మానిటర్​ చేసినట్టు సమాచారం.

పహల్గామ్​ ఉగ్రదాడి ప్రతీకారంగా చేపట్టిన ఈ ఆపరేషన్​పై భారత్​ ఒక స్టేట్​మెంట్​ని విడుదల చేసింది.

"మొత్తం 9 స్థావరాలను టార్గెట్​ చేశాము. ఇందులో ఎలాంటి పాకిస్థాన్​ మిలిటరీ స్థావరం లేదు. మా చర్యలు ఫోకస్డ్​గా, అన్ని విషయాలను పరిగణించి చేపట్టినవి. ఉద్రిక్తతలు పెంచే విధంగా మా చర్యలు లేవు. ఆయా స్థావరాలను ఎంచుకుని, టార్గెట్​ చేయడంతో మేము మా నిగ్రహాన్ని చూపించాము," అని ఇండియా తన స్టేట్​మెంట్​లో పేర్కొంది.

"పహల్గామ్​ ఉగ్రదాడికి కారణమైన వారిని జవాబుదారీగా చేయాలన్న ఉద్దేశంతో ఆపరేషన్​ సిందూర్​ చేపట్టాము," అని ఆ స్టేట్​మెంట్​లో ఉంది.

ఆపరేషన్​ సిందూర్​కి సంబంధించిన మరిన్ని వివరాలను బుధవారం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

ఆపరేషన్​ సిందూర్​పై పాకిస్థాన్​ స్పందన..

ఆపరేషన్​ సిందూర్​పై పాకిస్థాన్​ స్పందించింది. బహవల్​పూర్​తో పాటు మొత్తం 3 చోట్ల దాడులు జరిగినట్టు వివరించింది. సరైన సమయం చూసి తాము కూడా స్పందిస్తామని పేర్కొంది. భారత అనుభవిస్తున్న ఈ తాత్కాలిక సంతోషం పూర్తిస్థాయిలో దుఖంగా మారబోతోంది అంటూ హెచ్చరించింది.

48 గంటల పాటు పాకిస్థాన్​ తన ఎయిర్​స్పేస్​ని మూసివేసింది.

భారత సైన్యం దాడుల తర్వాత ఎల్​ఓసీ వెంబడి పాకిస్థాన్​ కాల్పులకు తెరబడింది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఆపరేషన్​ సిందూర్​పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సైతం స్పందించారు.

“ఏదో జరగబోతోందని మనకి తెలుసు. భారత్​- పాకిస్థాన్​లు దశాబ్దాలుగా గొడవపడుతున్నాయి. ఇది త్వరలోనే అంతం అవ్వాలని కోరుకుంటున్నాను,” అని ట్రంప్​ అన్నారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.