యావత్ భారత దేశం ఎదురుచూస్తున్న, కోరుకుంటున్న ఘట్టం ఆవిష్కృతమైంది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్థరాత్రి- బుధవారం తెల్లవారుజామున జరిగిన ఆపరేషన్ ‘సిందూర్’లో భాగంగా పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది.
గత నెలలో కశ్మీర్లోని పహల్గామ్లోకి చొరబడిన ఉగ్రవాదులు 26 మందిని చంపేశారు. అనంతరం భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు భారత్ అనేక చర్యలు చేపట్టింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం నుంచి మిలిటరీ యాక్షన్ కోసం యావత్ భారత దేశం ఎదురుచూసింది.
మంగళవారం అర్థరాత్రి- బుధవారం తెల్లవారుజామున సమయంలో పహల్గామ్కి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత్ సైన్యం, నేవీ, వాయుసేన సంయుక్తంగా ఆపరేషన్ 'సిందూర్'ని చేపట్టాయి.
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద క్యాంపులపై భారత సైన్యం దాడి చేసింది. ఈ విషయాన్ని మంగళవారం అర్థరాత్రి 1:44 గంటలకు భారత సైన్యం ప్రకటించింది. ఆపరేషన్ని మానిటర్ చేసిన అధికారులతో హిందుస్థాన్ టైమ్స్ మాట్లాడింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, భారత ఫైటర్ జెట్లు ఇంకా గాల్లో ఉన్నట్టు ఆ సమయంలో ఓ అధికారి తెలిపారు.
"బహవల్పూర్, మురీడ్కేలోని లష్కే తోయిబా, జైషే మహమ్మద్ హెడ్క్వార్టర్స్ని టార్గెట్ చేశారు. మిసైల్ దాడులు జరిగాయి," అని సదరు అధికారి వివరించారు. ఈ ఆపరేషన్ కోసం స్టాండాఫ్ క్రూయిజ్ మిసైళ్లను ఉపయోగించినట్టు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్లో భారత సైన్యంతో పాటు నేవీ, వాయు సేనకు చెందిన ఆయుధ వ్యవస్థలు పాల్గొన్నాయి. టార్గెట్ల కోసం ఎదురుచూసి, ఎదురుచూసి దాడులు చేసే సూసైడ్ డ్రోన్స్ (లాయిటరీ మునిషన్స్)ని కూడా ఈ ఆపరేషన్లో వినియోగించారు.
"న్యాయం జరిగింది," అని ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత సైన్యం ట్వీట్ చేసింది. వాస్తవానికి.. ఆపరేషన్ని కొంతసేపటి ముందు.. "దాడికి సిద్ధం" అంటూ ఒక పోస్ట్ చేసింది.
పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన కోఆర్డినేషన్లను నిఘా ఏజెన్సీలు సైన్యంతో పంచుకున్నాయి. అయితే, భారత భూభాగం నుంచే దాడులు జరిగినట్టు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్పై రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. "భారత్ మాతా కీ జై" అని హిందీలో ఒక పోస్ట్ చేశారు.
ఈ ఆపరేషన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రంతా మానిటర్ చేసినట్టు సమాచారం.
పహల్గామ్ ఉగ్రదాడి ప్రతీకారంగా చేపట్టిన ఈ ఆపరేషన్పై భారత్ ఒక స్టేట్మెంట్ని విడుదల చేసింది.
"మొత్తం 9 స్థావరాలను టార్గెట్ చేశాము. ఇందులో ఎలాంటి పాకిస్థాన్ మిలిటరీ స్థావరం లేదు. మా చర్యలు ఫోకస్డ్గా, అన్ని విషయాలను పరిగణించి చేపట్టినవి. ఉద్రిక్తతలు పెంచే విధంగా మా చర్యలు లేవు. ఆయా స్థావరాలను ఎంచుకుని, టార్గెట్ చేయడంతో మేము మా నిగ్రహాన్ని చూపించాము," అని ఇండియా తన స్టేట్మెంట్లో పేర్కొంది.
"పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన వారిని జవాబుదారీగా చేయాలన్న ఉద్దేశంతో ఆపరేషన్ సిందూర్ చేపట్టాము," అని ఆ స్టేట్మెంట్లో ఉంది.
ఆపరేషన్ సిందూర్కి సంబంధించిన మరిన్ని వివరాలను బుధవారం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్పై పాకిస్థాన్ స్పందించింది. బహవల్పూర్తో పాటు మొత్తం 3 చోట్ల దాడులు జరిగినట్టు వివరించింది. సరైన సమయం చూసి తాము కూడా స్పందిస్తామని పేర్కొంది. భారత అనుభవిస్తున్న ఈ తాత్కాలిక సంతోషం పూర్తిస్థాయిలో దుఖంగా మారబోతోంది అంటూ హెచ్చరించింది.
48 గంటల పాటు పాకిస్థాన్ తన ఎయిర్స్పేస్ని మూసివేసింది.
భారత సైన్యం దాడుల తర్వాత ఎల్ఓసీ వెంబడి పాకిస్థాన్ కాల్పులకు తెరబడింది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం స్పందించారు.
“ఏదో జరగబోతోందని మనకి తెలుసు. భారత్- పాకిస్థాన్లు దశాబ్దాలుగా గొడవపడుతున్నాయి. ఇది త్వరలోనే అంతం అవ్వాలని కోరుకుంటున్నాను,” అని ట్రంప్ అన్నారు.
సంబంధిత కథనం
టాపిక్