'ఆపరేషన్​ సిందూర్​'లో భారత్​ ఉపయోగించిన ఆయుధాలు ఇవే- 10 ముఖ్యాంశాలు..-operation sindoor india used loitering munition against pakistan 10 points you need to know ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'ఆపరేషన్​ సిందూర్​'లో భారత్​ ఉపయోగించిన ఆయుధాలు ఇవే- 10 ముఖ్యాంశాలు..

'ఆపరేషన్​ సిందూర్​'లో భారత్​ ఉపయోగించిన ఆయుధాలు ఇవే- 10 ముఖ్యాంశాలు..

Sharath Chitturi HT Telugu

ఆపరేషన్​ సిందూర్​తో పహల్గామ్​ ఉగ్రదాడికి భారత్​ ప్రతీకారం తీర్చుకుంది. అత్యాధునిక ఆయుధాలతో సరిహద్దు దాటకుండానే పనిని పూర్తి చేసింది! ఈ ఆపరేషన్​ సిందూర్​పై కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

భారత్​ దాడి తర్వాత ముజాఫరాబాద్​లో పరిస్థితి.. (AP)

పహల్గామ్​ ఉగ్రదాడికి భారత్​ గట్టి సమాధానం ఇచ్చింది! ఇన్ని రోజులు పాకిస్థాన్​ని ఆర్థికంగా దెబ్బతీసిన భారత్​.. తాజాగా మిలిటరీ చర్యలతో పాక్​తో పాటు పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని ఉగ్రవాదులపై విరుచుకుపడింది. “ఆపరేషన్​ సిందూర్​” పేరుతో అత్యాధునిక ఆయుధ వ్యవస్థను ఉపయోగించి, సరిహద్దు దాటకుండానే పనిని పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్​ సిందూర్​కి సంబంధించిన 10 కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆపరేషన్​ సిందూర్​- 10 ముఖ్యాంశాలు..

1. పాకిస్థాన్​, పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్​ దాడి చేసింది. దీనికి ‘ఆపరేషన్​ సిందూర్​’ అని పేరు పెట్టింది. ఇందులో 4 పాక్​లో, 5 పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో ఉన్నాయి.

2. భారత్​ దాడి చేసిన 9 ప్రాంతాల్లో బహవల్​పూర్​, మురిడ్కే, సైల్​కోట్​ ఉన్నాయి. వీటి కోఆర్డినేషన్స్​ని నిఘా ఏజెన్సీలు సైన్యంతో పంచుకున్నాయి.

3. తాజా దాడిలో పాక్​ సైనిక స్థావరాలపై దాడి చేయలేదని భారత్​ స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుని భారత్​లో అలజడులు సృష్టిస్తున్న జైషే మహమ్మద్​, లష్కరే తోయిబా స్థావరాలను మాత్రమే టార్గెట్​ చేసినట్టు వివరించింది.

4. 1971 యుద్ధం తర్వాత భారత సైన్యం, వాయుసేన, నౌకా దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్​ ఇదే అని తెలుస్తోంది.

5. ఆపరేషన్​ సిందూర్​లో భారత్​ 'ప్రెసిషన్​ స్ట్రైక్​ వెపన్​ సిస్టెమ్స్​'ని ఉపయోగించింది. వీటిల్లో లాయిటరింగ్​ మునిషన్స్​ కూడా ఉన్నాయి. వీటిని సూసైడ్​ డ్రోన్స్​ అని కూడా పిలుస్తారు. ఈ ప్రెసిషన్​ వెపన్​ టార్గెట్​ ఏరియాలో తిరుగుతూ ఉంటుంది. టార్గెట్​ని గుర్తించి, లొకేట్​ చేసి, టార్గెట్​ చేస్తుంది. ఈ పూర్తి ప్రక్రియ ఆటోమెటిక్​గా లేదా మాన్యువల్​గా చేయవచ్చు. ఆపరేషన్​లో భాగంగా వినియోగించిన మరిన్ని ఆయుధాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ మేరకు బుధవారం భారత్​ నిర్వహించే అధికారిక ప్రెస్​మీట్​లో మరిన్ని వివరాలు తెలుస్తాయి.

6. ఆపరేషన్​ సిందూర్​ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రంతా మానిటర్​ చేశారు. ఆపరేషన్​ ముగిసిన అనంతరం "భారత్​ మాతా కీ జై" అని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ట్వీట్​ చేశారు.

7. భారత దాడులపై పాకిస్థాన్​ స్పందించింది. సరైన సమయంలో తాము దాడి చేస్తామని, భారత తాత్కాలిక సంతోషం తీవ్ర దుఖంగా మారుతుందని హెచ్చరించింది.

8. అయితే ఆపరేషన్​ సిందూర్​తో 6 చోట్ల భారత్​ దాడి చేసిందని పాక్​ చెప్పింది. ఈ దాడుల్లో 8మంది మరణించారని, 35మంది గాయపడ్డారని, ఇద్దరు గల్లంతయ్యారని వివరించింది.

9. భారత్​ నుంచి వచ్చిన 3 రఫేల్​ విమానాలు, 1 సుకోయ్​-30, 1 మిగ్​-29ని కూల్చినట్టు పాకిస్థాన్​ వెల్లడించింది. ఈ విషయంపై భారత్​ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

10. పహల్గామ్​ ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఇన్ని రోజులు ఉన్న అగ్నిపర్వతం తాజా పరిణామాలతో బద్ధలైంది! ఆపరేషన్​ సిందూర్​ అనంతరం ఎల్​ఓసీ దగ్గర కాల్పుల మోత మోగుతోంది. ఇప్పటికే ముగ్గురు మరణించారని సమాచారం.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.