పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ గట్టి సమాధానం ఇచ్చింది! ఇన్ని రోజులు పాకిస్థాన్ని ఆర్థికంగా దెబ్బతీసిన భారత్.. తాజాగా మిలిటరీ చర్యలతో పాక్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాదులపై విరుచుకుపడింది. “ఆపరేషన్ సిందూర్” పేరుతో అత్యాధునిక ఆయుధ వ్యవస్థను ఉపయోగించి, సరిహద్దు దాటకుండానే పనిని పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్ సిందూర్కి సంబంధించిన 10 కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
1. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. దీనికి ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టింది. ఇందులో 4 పాక్లో, 5 పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయి.
2. భారత్ దాడి చేసిన 9 ప్రాంతాల్లో బహవల్పూర్, మురిడ్కే, సైల్కోట్ ఉన్నాయి. వీటి కోఆర్డినేషన్స్ని నిఘా ఏజెన్సీలు సైన్యంతో పంచుకున్నాయి.
3. తాజా దాడిలో పాక్ సైనిక స్థావరాలపై దాడి చేయలేదని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుని భారత్లో అలజడులు సృష్టిస్తున్న జైషే మహమ్మద్, లష్కరే తోయిబా స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసినట్టు వివరించింది.
4. 1971 యుద్ధం తర్వాత భారత సైన్యం, వాయుసేన, నౌకా దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ఇదే అని తెలుస్తోంది.
5. ఆపరేషన్ సిందూర్లో భారత్ 'ప్రెసిషన్ స్ట్రైక్ వెపన్ సిస్టెమ్స్'ని ఉపయోగించింది. వీటిల్లో లాయిటరింగ్ మునిషన్స్ కూడా ఉన్నాయి. వీటిని సూసైడ్ డ్రోన్స్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రెసిషన్ వెపన్ టార్గెట్ ఏరియాలో తిరుగుతూ ఉంటుంది. టార్గెట్ని గుర్తించి, లొకేట్ చేసి, టార్గెట్ చేస్తుంది. ఈ పూర్తి ప్రక్రియ ఆటోమెటిక్గా లేదా మాన్యువల్గా చేయవచ్చు. ఆపరేషన్లో భాగంగా వినియోగించిన మరిన్ని ఆయుధాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ మేరకు బుధవారం భారత్ నిర్వహించే అధికారిక ప్రెస్మీట్లో మరిన్ని వివరాలు తెలుస్తాయి.
6. ఆపరేషన్ సిందూర్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రంతా మానిటర్ చేశారు. ఆపరేషన్ ముగిసిన అనంతరం "భారత్ మాతా కీ జై" అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
7. భారత దాడులపై పాకిస్థాన్ స్పందించింది. సరైన సమయంలో తాము దాడి చేస్తామని, భారత తాత్కాలిక సంతోషం తీవ్ర దుఖంగా మారుతుందని హెచ్చరించింది.
8. అయితే ఆపరేషన్ సిందూర్తో 6 చోట్ల భారత్ దాడి చేసిందని పాక్ చెప్పింది. ఈ దాడుల్లో 8మంది మరణించారని, 35మంది గాయపడ్డారని, ఇద్దరు గల్లంతయ్యారని వివరించింది.
9. భారత్ నుంచి వచ్చిన 3 రఫేల్ విమానాలు, 1 సుకోయ్-30, 1 మిగ్-29ని కూల్చినట్టు పాకిస్థాన్ వెల్లడించింది. ఈ విషయంపై భారత్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
10. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఇన్ని రోజులు ఉన్న అగ్నిపర్వతం తాజా పరిణామాలతో బద్ధలైంది! ఆపరేషన్ సిందూర్ అనంతరం ఎల్ఓసీ దగ్గర కాల్పుల మోత మోగుతోంది. ఇప్పటికే ముగ్గురు మరణించారని సమాచారం.
సంబంధిత కథనం