ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్థాన్కి చెందిన మిరాజ్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు భారత్ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఒక వీడియోని ప్రదర్శించింది. పాకిస్థాన్కి చెందిన మిరాజ్ శకలాలు ఆ వీడియోలో కనిపించాయి.
ఆపరేషన్ సిందూర్, భారత్- పాక్ కాల్పుల విరమణ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ, నేవీ, వాయుసేనలకు సంబంధించిన ఉన్నతాధికారులు సోమవారం నిర్వహించిన ప్రెస్ బ్రీఫింగ్లో పలు కీలక వివరాలను వెల్లడించారు.
పాకిస్థాన్లోని కరాచీకి సమీపంలో ఉన్న ‘టార్గెట్స్’పై దాడులు నిర్వహించినట్టు వాయుసేన డైరక్టర్ జనరల్ ఆఫ్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ ఏకే భార్తీ తెలిపారు. అంతేకాదు, పాకిస్థాన్ పంజాబ్లోని రహీమ్ యార్ ఖాన్ వాయు స్థావరంపైనా దాడి చేసినట్టు, ఫలితంగా రన్వేపై పెద్ద గుంట ఏర్పడినట్టు చెప్పారు. ఈ మేరకు పలు వీడియోలను ప్రదర్శించి, దాడి వల్ల కలిగిన నష్టాన్ని వివరించారు.
“కనీర్ బేస్పైనా దాడి చేశాము. దాడి తర్వాత ఏమైందో (వీడియోని చూపిస్తూ) మీరే చూడండి. ఇది సోషల్ మీడియా నుంచే తీసుకున్నాను. రహీమ్ యార్ ఖాన్ ఎయిర్బేస్పైనా దాడి చేశాము. రన్వేపై పెద్ద గుంట పడింది. మన ఆయుధాల ఖచ్చితత్వాన్ని మనం చూడొచ్చు," అని ఏకే భార్తీ తెలిపారు.
“మన వ్యవస్థలు కాలం విసిరిన పరీక్షకు ఎదురు నిలిచాయి. అంతేకాదు, బలంగా ఢీకొట్టాయి. దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ అకాశ్ సిస్టెమ్ మరొక హైలైట్! విధాన పరంగా దశాబ్ద కాలం పాటు భారత ప్రభుత్వం ఇస్తున్న మద్దతు, బడ్జెట్తో ఇదంతా సాధ్యమైంది,” అని ఏకే భార్తీ పేర్కొన్నారు.
పాకిస్థాన్ ప్రయోగించిన చైనా ఆధారిత పీఎల్-15 మిసైల్ టార్గెట్ని మిస్ అయ్యిందని, ఎయిర్ మార్షల్ ఏకే భార్తీ వెల్లడించారు.
“చైనాకు చెందిన పీఎల్-15 మిసైల్ టార్గెట్ మిస్ అయ్యింది. దాని ముక్కలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి,” అని అన్నారు.
తమ యుద్ధం ఉగ్రవాదంతోనే అని, ఆపరేషన్ సిందూర్ వల్ల పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరిగిన నష్టానికి ఆ దేశమే కారణమని భారత సాయుధ దళాలు స్పష్టం చేశాయి.
“ఉగ్రవాదులు, వారి మౌలిక వసతులతోనే మా యుద్ధం. పాక్ ఆర్మీతో కాదు. అందుకే మే7న జరిగిన ఆపరేషన్ సిందూర్లో ఉగ్ర స్థావరలపైనే దాడి చేశాము. కానీ ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ మద్దతివ్వడం సిగ్గు చేటు. ఉగ్రవాదులపై దాడిని తమపై దాడిగా భావించింది పాక్ ఆర్మీ. అందుకే మేము స్పందించాల్సి వచ్చింది. ఆ దేశంలో నష్టాలకు వారే బాధ్యులు,” అని ఏకే భార్తీ వివరించారు.
మరోవైపు భారత్- పాకిస్థాన్ డీజీఎంఓ స్థాయి చర్చలు సోమవారం మధ్యాహ్నం జరగాల్సి ఉంది. కానీ ఈ చర్చలు సోమవారం సాయంత్రానికి వాయిదాపడినట్టు అధికారులు వెల్లడించారు.
సంబంధిత కథనం