భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలపై ఆపరేషన్ సింధూర్ గురించి సమాచారం ఇచ్చేందుకు సైన్యం సోమవారం మీడియా సమావేశం నిర్వహించింది.
ఇదే కాన్ఫరెన్స్లో ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతిని పాకిస్థాన్లోని కిర్నా హిల్స్లో ఉన్న అణు కర్మాగారాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుందా అని ప్రశ్నించారు. దీనిపై ఎయిర్ మార్షల్ స్పందిస్తూ.. 'లేదు, మా వైపు నుంచి అలాంటిదేమీ జరగలేదు' అని బదులిచ్చారు.
దీనిపై ఎయిర్ మార్షల్ భారతి మాట్లాడుతూ.. 'కిర్నా హిల్స్లో కొన్ని అణు స్థావరాలు ఉన్నాయని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆ విషయం మాకు తెలియదు... మేము కిర్నా హిల్స్పై దాడి చేయలేదు, పాక్కు చెందిన 9 ఉగ్రవాద స్థావరాలను మాత్రమే భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది.' అని చెప్పారు.
భారత్-పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్లోని సర్గోధాలో కిర్నా హిల్స్ కింద ఉన్న ముషాఫ్ వైమానిక స్థావరంపై భారత్ దాడి చేసిందన్న చర్చ అందులో ఒకటి.
పాకిస్థాన్ తన అణ్వాయుధాలు, మందుగుండు సామగ్రిని ఇక్కడే దాచి ఉంచుతుందని చెబుతుంటారు. ఇది అత్యంత రహస్యమైన సైనిక బంకర్. కొండలో ఉన్న రహస్య సొరంగాలు, అణ్వాయుధాలు ఉంచే ప్రదేశాలు దెబ్బతిని ఉండొచ్చని సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఎయిర్ మార్షల్ దీనిని ఖండించారు.
భారత స్వదేశీ గగనతల రక్షణ వ్యవస్థపై ఎయిర్ మార్షల్ భారతి మాట్లాడారు. స్వదేశీ ఆయుధాల పనితీరు కూడా అద్భుతంగా ఉందన్నారు.
పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత్ డిఫెన్స్ వ్యవస్థను క్రికెట్ మ్యాచ్తో పోల్చారు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని మీడియా సమావేశంలో ప్రస్తావించారు. చాలా మంది లాగే నేను కూడా కోహ్లీకి వీరాభిమానిని అని చెప్పారు.