Nepal PM : ఒడిశాలో విద్యార్థిని ఆత్మహత్య.. స్పందించిన నేపాల్ పీఎం, రాయబార కార్యాలయం-odisha kiit university student suicide case nepal pm kp sharma oli reacts and send officials to campus ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nepal Pm : ఒడిశాలో విద్యార్థిని ఆత్మహత్య.. స్పందించిన నేపాల్ పీఎం, రాయబార కార్యాలయం

Nepal PM : ఒడిశాలో విద్యార్థిని ఆత్మహత్య.. స్పందించిన నేపాల్ పీఎం, రాయబార కార్యాలయం

Anand Sai HT Telugu Published Feb 18, 2025 11:43 AM IST
Anand Sai HT Telugu
Published Feb 18, 2025 11:43 AM IST

Nepal PM : ఒడిశాలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై నేపాల్ ప్రధాన మంత్రి జోక్యం చేసుకున్నారు. రాయబార కార్యాలయం కూడా ఈ ఘటనపై స్పందించింది.

నేపాల్ పీఎం కె.పి శర్మ ఓలి
నేపాల్ పీఎం కె.పి శర్మ ఓలి

ఒడిశాలోని భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీలో ఆదివారం హాస్టల్ గదిలో విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. ఆ విద్యార్థిని నేపాల్‌కు చెందిన ప్రకృతి లామ్సాల్‌గా గుర్తించారు. దీని తరువాత ఆ సంస్థలో చదువుతున్న ఇతర నేపాలీ విద్యార్థుల నేతృత్వంలో క్యాంపస్ అంతటా నిరసనలు చెలరేగాయి. కాలేజీ సిబ్బంది నిరసన తెలుపుతున్న విద్యార్థులతో ఘర్షణ పడుతున్నట్లు కనిపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఈ విషయం తీవ్రమైంది, నేపాల్ ప్రధాన మంత్రి జోక్యం చేసుకున్నారు. రాయబార కార్యాలయం కూడా జోక్యం చేసుకోవడంతో ఈ సమస్య పెద్దదిగా మారింది.

క్యాంపస్‌లో భారీ బలగాలు

నేపాల్ విద్యార్థులను ఉద్దేశించి ఆ సంస్థ అనుచిత పదాలను ఉపయోగించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని సంస్థ యాజమాన్యం అణిచివేయడానికి ప్రయత్నిస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, క్యాంపస్‌లో భారీ బలగాలను మోహరించారు.

'బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్న నేపాలీ విద్యార్థి ఆదివారం హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ విద్యార్థి ఇదే కళాశాలలో చదువుతున్న మరో విద్యార్థితో ప్రేమలో ఉన్నారు.' అని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఆత్మహత్య గురించి ఇన్స్టిట్యూట్ పోలీసులకు సమాచారం ఇచ్చింది.

విద్యార్థిపై కేసు

భువనేశ్వర్ డీసీపీ పినాక్ మిశ్రా మాట్లాడుతూ..'విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఇన్ఫోసిటీ పోలీస్ స్టేషన్‌లో ఒక విద్యార్థిపై కేసు నమోదు చేశాం. నిందితుడైన విద్యార్థి పోలీసుల కస్టడీలో ఉన్నాడు, విచారణ జరుపుతున్నాం. పోలీసులు విద్యార్థి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ఇతర గాడ్జెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాం.' అని మిశ్రా వెల్లడించారు. ఇన్స్టిట్యూట్ క్యాంపస్‌లో శాంతిభద్రతలను కాపాడటానికి రెండు పోలీసు దళాలు మోహరించాయి. విద్యార్థిని గదిని సీజ్ చేసిన పోలీసులు, ఆమె తల్లిదండ్రులు వచ్చే వరకు మృతదేహాన్ని మార్చురీలో ఉంచారని తెలిపారు.

ఇతర రాష్ట్రాల విద్యార్థులు.. హాస్టల్ నుంచి బయటకు వెళ్లడానికి ఇన్‌స్టిట్యూట్‌లోని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు అనుమతించడం లేదని ఆరోపించారు. హాస్టల్ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి లేదన్న విద్యార్థుల ఆరోపణలను కళాశాల సిబ్బంది ఖండించారు.

సోమవారం నేపాల్ విద్యార్థులతో నిండిన రెండు బస్సులు కటక్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాయి. 'మమ్మల్ని హాస్టల్ గది ఖాళీ చేయమని అడిగారు. రైల్వే స్టేషన్‌లో దింపారు. మేం ఫిబ్రవరి 28న పరీక్ష రాయవలసి ఉంది. ఈ విషయంతో సంస్థ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.' అని ఒక విద్యార్థి చెప్పారు.

స్పందించిన నేపాల్ పీఎం

నేపాలీ విద్యార్థి ఆత్మహత్య, నిరసనల మధ్య నేపాల్ ప్రధాన మంత్రి జోక్యం చేసుకున్నారు. నేపాల్ ప్రధాన మంత్రి కె.పి.శర్మ ఓలి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో చేశారు. 'న్యూఢిల్లీలోని మా రాయబార కార్యాలయం ఒడిశాలోని బాధిత నేపాలీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఇద్దరు అధికారులను పంపింది. ఇది కాకుండా వారు హాస్టల్‌లో ఉండటానికి లేదా ఇంటికి తిరిగి రావడానికి అవకాశం లభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.' అని నేపాల్ పీఎం అన్నారు.

ఒడిశా ప్రభుత్వ విజ్ఞప్తి

రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ప్రైవేట్ విశ్వవిద్యాలయ అధికారులు విద్యార్థుల తొలగింపు ఉత్తర్వును రద్దు చేశారని ఒడిశా ఉన్నత విద్యా మంత్రి సూర్యవంశీ సూరజ్ సోమవారం తెలిపారు. నేపాలీ విద్యార్థులు క్యాంపస్‌కు తిరిగి వచ్చి తమ చదువులను తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. నేపాల్‌తో భారతదేశానికి లోతైన సంబంధం ఉందని సూర్యవంశీ సూరజ్ అన్నారు. కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీలో జరిగినది చాలా బాధాకరమని, మరణించిన విద్యార్థి కుటుంబానికి మా సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు.

భారత రాయబార కార్యాలయం విచారం

ఒడిశాలోని భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీలో నేపాలీ విద్యార్థి మరణించడం పట్ల ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. కళాశాల అధికారులతో పాటు ఒడిశా ప్రభుత్వంతో కూడా సంప్రదిస్తున్నామని వెల్లడించింది. భారతదేశంలోని నేపాలీ విద్యార్థుల శ్రేయస్సు కోసం అవసరమైన అన్ని చర్యలు భారత ప్రభుత్వం తీసుకుంటూనే ఉంటుందని తెలిపింది.

Anand Sai

eMail
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.