ఒడిశాలో అత్యంత దారుణ, అమానవీయ ఘటన చోటుచేసుకుంది! కొన్నేళ్ల క్రితం అనాథగా కనిపించిన పసికందును ఆదరించి పెంచుకుంటున్న ఓ మహిళను, ఆ శిశువు పెద్ద అయ్యి మరో ఇద్దరితో కలిసి చంపేసింది! మహిళ ఆస్తిని దక్కించుకునేందుకు ఈ నేరానికి పాల్పడటం గమనార్హం.
ఒడిశా గజపతి జిల్లాలో జరిగింది ఈ ఘటన. రాజలక్ష్మి అనే మహిళ, భువనేశ్వర్లో కొన్నేళ్ల క్రితం ఓ అనాథ పసికందును చూసింది. ఆ శిశువును ఆమె ఆదరించి, పెంచుకోవడం మొదలుపెట్టింది. కొన్నేళ్ల తర్వాత ఆ బాలికకు పరలఖెముండిలోని కేంద్రీయ విద్యాలయలో అడ్మిషన్ వచ్చింది. ఆ బాలిక కోసం రాజలక్ష్మి అన్ని వదులుకుని సమీపం ప్రాంతంలోను అద్దె ఇంటికి షిఫ్ట్ అయ్యింది.
ప్రస్తుతం ఆ బాలిక 8వ తరగతి చదువుకుంటోంది. కాగా ఇటీవలి కాలంలో ఆమెకు గణేశ్ రథ్, దినేశ్ సాహు అనే ఇద్దరితో పరిచయం ఏర్పడింది. ఇది రాజలక్ష్మికి తెలిసి, బాలికను మందలించింది. వారిద్దరికి దూరంగా ఉండాలని చెప్పింది.
కానీ ఆ 13ఏళ్ల బాలిక ఆ ఇద్దరిని కలుస్తూనే ఉండేది. చాట్ చేస్తూనే ఉండేది.
ఓ గుడిలో పూజారిగా పనిచేస్తున్న రథ్.. బాలికను ప్రభావితం చేయడం మొదలుపెట్టాడు. రాజలక్ష్మి ఆస్తి, నగలు, డబ్బులు తీసేసుకోవాలని బాలికను ప్రేరేపించాడు. ఆమె అతనికి లొంగిపోయింది. ఓసారి రాజలక్ష్మి నగలను దోచుకుని, రథ్కు ఇచ్చింది. వాటిని అతను తాకట్టు పెట్టి రూ. 2.4లక్షలు పొందాడు. ఆ డబ్బుతో కొత్త బైక్ కొనుక్కుని రాష్ట్రం మొత్తం తిరిగాడు.
కానీ అది అతనికి సరిపోలేదు. రాజలక్ష్మి దగ్గర ఉన్న మరో 50 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 60వేల క్యాష్పై కన్నేశాడు.
డబ్బు మీద వ్యామోహంతో చివరికి, రాజలక్ష్మిని చంపేయాలని రథ్, సాహు, ఆ బాలిక నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 29న రాజలక్ష్మి ఆహారంలో బాలిక నిద్ర మాత్రలు కలిపింది. ఆమె ఆపస్మారక స్థితిలోకి జారుకున్న అనంతరం తన ఇద్దరు స్నేహితులను ఆ బాలిక ఇంట్లోకి పిలించింది. వారందరు కలిసి రాజలక్ష్మి ముఖం మీద దిండు పెట్టి, ఊపిరాడనివ్వకుండా చేసి చంపేశారు.
ఆ తర్వాత ముగ్గురు నాటకం ఆడటం మొదలుపెట్టారు. రాజలక్ష్మికి గుండెపోటు వచ్చిందంటూ.. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ రాజలక్ష్మి అప్పటికే ప్రాణాలు విడిచింది. భువనేశ్వర్లో బంధువుల సమక్షంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి.
రాజలక్ష్మి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమెకు గుండె సమస్యలు ముందే ఉండటంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఆరోగ్యం చెడిపోయి మరణించిందని భావించారు.
కానీ ఇటీవలే రాజలక్ష్మి సోదరుడు సిబ ప్రసాద్ మిశ్రాకు బాలిక ఫోన్ కనిపించింది. అందులో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయగా.. రాజలక్ష్మిని చంపేయాలని ముగ్గురు ప్లాన్ చేసిన చాట్స్ కనిపించాయి. సిబ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. అనాథగా పడి ఉంటే చేరదీసి పెంచుకుంటున్న రాజలక్ష్మిని ఆ బాలిక చంపేయడం అతడని బాధపెట్టింది. చివరికి అతను పోలీసులను ఆశ్రయించాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ 13ఏళ్ల బాలిక, రథ్, సాహులను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులకు మూడు ఫోన్లు దొరికాయి. వాటిల్లో మర్డర్ ప్లాన్ మొత్తం ఉంది. రాజలక్ష్మి నుంచి దోచుకున్న 30 గ్రాముల బంగారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సంబంధిత కథనం