Parliament news | `ధరల పెరుగుదల నిజమే.. కాదనడం లేదు`
ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై మంగళవారం రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతోందని వివరించారు. ధరల పెరుగుదల విషయంలో అబద్ధాలేవీ ఆడడం లేదని వ్యాఖ్యానించారు.
Parliament news | దేశంలో సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరల పెరుగుదల అంశంపై ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు. ధరల పెరుగుదలను కాదనడం లేదని వ్యాఖ్యానిస్తూ, దేశంలో ధరలు అనియంత్రితంగా పెరుగుతున్న విషయాన్ని అంగీకరించారు.
ట్రెండింగ్ వార్తలు
Parliament news | ఎవరూ కాదనరు
దేశంలో ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, ద్రవ్యోల్బణం అంశాలు ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయని ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని ఎవరూ కాదనడం లేదని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఆర్బీఐ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. `ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే.. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉంది. అలా అని మన ఆర్థిక వ్యవస్థ బాగా ఉందని అర్థం కాదు. దిగుమతుల భారం పెరగడం, అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల వల్ల భారత్ కూడా ప్రభావితమవుతోంది. ఇవన్నీ నిజాలు. ధరలు పెరుగుతున్నాయన్న విషయాన్ని ఎవరూ కాదనడం లేదు` అని వివరించారు.
Parliament news | ద్రవ్యోల్బణంపై..
ద్రవ్యోల్బణ పరిస్థితులను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇలా వివరించారు. `భారత్లో ద్రవ్యోల్బణం సగటు పాయింట్ 4. దానికి మైనస్ లేదా ప్లస్ 2ని మేనేజ్ చేసుకోవచ్చు. అంటే 2 నుంచి ఆరు వరకు ద్రవ్యోల్బణాన్ని మేనేజ్ చేసుకోగలం. ప్రస్తుతం భారత్లో ద్రవ్యోల్బణం 7కు పైగా ఉంది. దీన్ని ఆరు లేదా అంతకన్నా తక్కువకు తీసుకురావడానికి ఆర్బీఐ, ఆర్థిక శాఖ ప్రయత్నిస్తున్నాయి` అని నిర్మల వివరణ ఇచ్చారు.
Parliament news | రాజకీయం వద్దు
ప్రతీ అంశాన్ని రాజకీయం చేయొద్దని ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సూచించారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఏమీ చేయడం లేదు.. అంబానీలు, ఆదానీల కోసమే ప్రభుత్వం పని చేస్తోంది అని పదేపదే విమర్శలు చేయడం సరికాదు. ధరల పెరుగుదల వల్ల ఇబ్బంది పడుతున్న వర్గాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది` అన్నారు.