Flight ticket rate changes: రేపటి నుంచి ఫ్లైట్ టికెట్ ఛార్జీల్లో మార్పులు
Flight ticket rate changes: ఫ్లైట్ టికెట్ ఛార్జీలపై ఉన్న కనిష్ట, గరిష్ట పరిమితులు రేపటి నుంచి తొలగనున్నాయి.
Flight ticket rate changes: మీరు పండుగ సీజన్లో విమానంలో ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నారా? మీ సమాధానం అవును అయితే, ఈ వార్త మీకోసమే. ఆగస్టు 31 నుండి దేశీయ విమాన ఛార్జీలపై ధరల పరిమితులను ప్రభుత్వం తొలగిస్తోంది. దీని వల్ల ప్రయాణీకుల ఛార్జీలు నిర్ణయించే విషయంలో విమానయాన సంస్థలకు వెసులుబాటు లభిస్తుంది.
ట్రెండింగ్ వార్తలు
దేశీయ విమాన ఛార్జీలపై విధించిన పరిమితులను ఆగస్టు 31 నుంచి తొలగిస్తామని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ నెల ప్రారంభంలో తెలియజేసింది. సుమారు 27 నెలల క్రితం ఈ పరిమితులు విధించింది.
‘ఎయిర్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్) రోజువారీ డిమాండ్, ధరలను జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాత విమాన ఛార్జీల పరిమితులను తొలగించే నిర్ణయం తీసుకున్నాం. ధరల స్థిరీకరణ ప్రారంభమైంది. సమీప భవిష్యత్తులో దేశీయ ట్రాఫిక్లో వృద్ధికి ఈ రంగం సిద్ధంగా ఉందని మేం కచ్చితంగా అనుకుంటున్నాం.. ' అని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ చేశారు.
ప్రధానంగా ఫిబ్రవరి 24న ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరిగిన ఏటీఎఫ్ ధరలు గత కొన్ని వారాలుగా తగ్గుముఖం పట్టాయి.
ఆగస్టు 1న ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలో లీటర్కు రూ. 1.21 లక్షలుగా ఉంది. ఇది గత నెల కంటే దాదాపు 14 శాతం తక్కువ.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా రెండు నెలల లాక్డౌన్ తర్వాత 2020 మే 25న సేవలను పునఃప్రారంభించినప్పుడు విమానాల ప్రయాణ సమయం ఆధారంగా దేశీయ విమాన ఛార్జీలపై మంత్రిత్వ శాఖ కనిష్ట, గరిష్ట పరిమితులను విధించింది.
ఉదాహరణకు విమానయాన సంస్థలు 40 నిమిషాల కంటే తక్కువగా ఉండే దేశీయ విమాన ప్రయాణికుల నుంచి ప్రస్తుతం రూ. 2,900 కంటే తక్కువ (జీఎస్టీ మినహా), రూ. 8,800 (జీఎస్టీ మినహా) కంటే ఎక్కువ ఛార్జీలను వసూలు చేయవు.
తాజాగా ఈ పరిమితులు సడలించడంతో విమానయాన సంస్థలు డిమాండ్ అంతగా లేనిచోట తక్కువ ధరలకు టికెట్ కేటాయించవచ్చు. అలాగే డిమాండ్ను బట్టి ఎక్కువగా వసూలుచేసుకోవచ్చు.
ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఎయిర్లైన్స్ను రక్షించడానికి కనిష్ట పరిమితి, అధిక ఛార్జీల నుండి ప్రయాణీకులను రక్షించడానికి గరిష్ట పరిమితిని విధించారు.
తాజాగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ఉత్తర్వు జారీ చేసింది. ‘ప్రస్తుత షెడ్యూల్డ్ దేశీయ కార్యకలాపాల స్థితిని, దేశీయ ప్రయాణికుల డిమాండ్ను సమీక్షించిన తర్వాత.. నోటిఫై చేసిన ఛార్జీల బ్యాండ్లను తొలగించాలని నిర్ణయించాం..’ అని ఉత్తర్వులో పేర్కొంది.
అయితే విమానయాన సంస్థలు, విమానాశ్రయ ఆపరేటర్లు తప్పనిసరిగా కోవిడ్-19 వ్యాప్తిని నివారించే మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని పేర్కొంది.
విమాన ఛార్జీలపై విమానయాన సంస్థలకు సంపూర్ణ స్వేచ్ఛ ఉండటమే ఉత్తమ పరిష్కారం విస్తారా సీఈవో వినోద్ కన్నన్ అన్నారు.