Tejashwi comments | బీజేపీకి చెంపదెబ్బ
Tejashwi comments | బిహార్లో మహా కూటమి ఏర్పాటుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం బీజేపీకి చెంపపెట్టు లాంటిదని బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. లాలు ప్రసాద్ యాదవ్ దేశాన్ని మతం పేరుతో విభజించే శక్తుల ముందు ఎన్నడూ తల వంచలేదన్నారు.
Tejashwi comments | బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. బిహార్లో జేడీయూ నేత నితీశ్ కుమార్ నేతృత్వంలో మహాకూటమి ఏర్పాటైన తరువాత కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని కలిసేందుకు తేజస్వీ యాదవ్ ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన సోనియాతో సమావేశమయ్యారు.
ట్రెండింగ్ వార్తలు
Tejashwi comments | దేశవ్యాప్తంగా ఇదే స్పందన
బిహార్లో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన విపక్ష పార్టీల మహా కూటమి దేశంలోని ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా ఉంటుందని బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. 2024 లోక్సభ ఎన్నికల లోపు దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక కూటములు ఏర్పడుతాయన్నారు. బిహార్లో మహా కూటమి ఏర్పాటు బీజేపీకి చెంపదెబ్బలా పరిణమించిందన్నారు. ఢిల్లీలో వామపక్ష నేతలు సీతారాం యేచూరి(సీపీఎం), డీ రాజా(సీపీఐ)లను కూడా తేజస్వీ కలిశారు.
Tejashwi comments | ప్రాంతీయ పార్టీలపై విషం
బీజేపీ ప్రాంతీయ పార్టీలపై విషం చిమ్ముతోందని తేజస్వీ ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలను నాశనం చేయాలన్నదే బీజేపీ లక్ష్యమని, ఈ విషయాన్ని ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా కూడా నిర్ధారించారని తేజస్వీ విమర్శించారు. `ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడమంటే.. విపక్షాన్ని నాశనం చేయడమే.. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే. అలా జరిగితే చివరకు దేశం నియంతృత్వ పాలనలోకి వెళ్తుంది` అని వ్యాఖ్యానించారు.
Tejashwi comments | తండ్రిపై ప్రశంసలు
ఎన్ని బెదిరింపులు, ఎన్ని సమస్యలు వచ్చినా తన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ మత విభజన శక్తుల ముందు తల వంచలేదని తేజస్వీ గుర్తు చేశారు. తన తండ్రే కాదు బిహార్ ప్రజలంతా కూడా ఎవరి ముందు తలవంచే వారు కాదని వ్యాఖ్యానించారు. ``బిహార్ ప్రజలు అమ్ముడుపోయే రకం కాదు.. బిహార్ ప్రజలు విశ్వసనీయమైన వారు`` అని తేజస్వీ యాదవ్ ప్రశంసించారు.
Tejashwi comments | ఇది పేదల ప్రభుత్వం
ప్రస్తుతం బిహార్లో నెలకొన్నది పేదల కోసం పనిచేసే ప్రభుత్వమని తేజస్వీ స్పష్టం చేశారు. ఇది పూర్తికాలం కొనసాగడమే కాదు.. రానున్న ఎన్నికల్లో కూడా ఒక్కటిగా పోటీచేసి విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.