Netaji daughter anita bose: నేతాజీ అవశేషాలు ఇండియాకు తేవాలి: నేతాజీ కుమార్తె
Netaji daughter anita bose: నేతాజీ అవశేషాలను భారత్కు తీసుకొచ్చి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ఆయన కుమార్తె అనితా బోస్ కోరారు.
Netaji Subhas Chandra Bose’s daughter Anita Bose: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవశేషాలు (అస్తికలు, దంతాలు) భారత దేశానికి తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ ప్ఫాఫ్ కోరారు. టోక్యోలోని రెంకోజీ మందిరంలో భద్రపరిచిన అస్తికలు తన తండ్రివేనని నమ్ముతున్నట్టు తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు
79 ఏళ్ల అనితా బోస్ ప్ఫాఫ్ జర్మనీలో నివసిస్తున్నారు. జపాన్ రాజధానిలో గల మందిరంలో భద్రపరిచిన అస్తికల నుంచి నమూనా తీసుకుని డీఎన్ఏ పరీక్షలు చేయించాలని విన్నవించారు.
‘ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అధునాతన డీఎన్ఏ పరీక్షలకు వీలు కల్పిస్తుంది. ఆ అస్తికల నుంచి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించవచ్చు. నేతాజీ 1945 ఆగస్టు 18న చనిపోయారన్న అంశంలో ఇంకా అనుమానాలు ఉన్న వారికి.. రెంకోజీ మందిరంలో ఉన్న అస్తికలు ఆయనవేనన్న శాస్త్రీయ రుజువు దీని ద్వారా లభిస్తుంది..’ అని ఆమె చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో ఫార్మోసాలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని సుదీర్థకాలంగా నమ్ముతున్న విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘రెంకోజీ మందిరంలో ఉన్న పూజారి, జపాన్ ప్రభుత్వం ఈ టెస్ట్కు అంగీకరించాయి. నేతాజీ మరణంపై జస్టిస్ ముఖర్జీ కమిషన్ విచారణకు సంబంధించిన పత్రాల్లో కూడా ఈ విషయం ఉంది..’ అని ఆమె పేర్కొన్నారు.
‘ఆయన (నేతాజీ)ను ఇంటికి తీసుకొచ్చేందుకు సిద్ధమవుదాం. ఈ దేశ స్వతంత్రాని కంటే ఆయన జీవితంలో ఏదీ ముఖ్యం కాదు. పరాయి పాలన లేని భారత దేశంలో జీవించడం కంటే ఆయన కోరుకున్నది మరొకటి లేదు. ఆయన స్వాతంత్య్రపు స్వేచ్ఛను అనుభవించేందుకు జీవించి లేనందున కనీసం ఆయన అవశేషాలను భారత గడ్డపైకి తీసుకురావడం ఇది సమయం..’ అని ఆమె అన్నారు.
బ్రిటీష్ పాలనపై పోరాడడానికి ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించిన నేతాజీ మరణం భారత చరిత్రలో ఒక గొప్ప రహస్యంగా మిగిలిపోయింది. తన తండ్రి చనిపోయారని, అవశేషాలు రెంకోజీ మందిరంలో ఉన్నాయని నేతాజీ ఏకైక కుమార్తె అనితా బోస్ పాఫ్ వాదిస్తూ వస్తున్నారు.
ఫార్మోసా (తైవాన్లో ఉంది)లో జపాన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కూలిన ఘటనలో ఆయన బతికి బయటపడ్డారని, ఆయన తైవాన్ నుంచి ఎక్కడికి ప్రయాణం చేశారో పరిశోధన చేయాలని భారత దేశంలో ఉన్న నేతాజీ బంధువులు వాదించారు.
ఆస్ట్రియాలో పుట్టిన ఆర్థికవేత్త అనితా బోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఎమిలీ షెంక్ల్ల సంతానం. ఆమెకు నాలుగు నెలల వయస్సు ఉన్నప్పుడు నేతాజీ బ్రిటీష్ పాలనపై పోరాడేందుకు జర్మనీ వెళ్లిపోయారు.
భారతదేశం వలస పాలన సంకెళ్లను పారద్రోలగలిగిన 75 ఏళ్ల తర్వాత కూడా స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖులలో ఒకరైన సుభాష్ చంద్రబోస్ "ఇంకా తన మాతృభూమికి తిరిగి రాలేదు" అని బోస్ ప్ఫాఫ్ అన్నారు.
దేశంలో నేతాజీ కోసం అనేక భౌతిక, ఆధ్యాత్మిక స్మారక చిహ్నాలను నిర్మించారు. ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచారు. ‘మరొక గంభీరమైన స్మారక చిహ్నం నిర్మించారు. భారతదేశ 75 వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా న్యూఢిల్లీలోని చాలా ప్రముఖ ప్రదేశంలో ఆవిష్కంచారు..’ అని ఆమె పేర్కొన్నారు.
‘భారతీయులు అపార అభిమానం, ప్రేమతో నేతాజీని గుర్తుంచుకోవడమే కాదు.. 1945 ఆగస్ట్ 18న విమాన ప్రమాదం కారణంగా నేతాజీ మరణించలేదని, చివరికి ఆయన తన స్వతంత్ర మాతృభూమికి తిరిగి రాగలడని వారు ఆశిస్తూనే ఉన్నారు..’ అని అనితా బోస్ పాఫ్ చెప్పారు.
‘కానీ ఈ రోజు మనకు 1945, 1946 నాటి క్లాసిఫైడ్ విచారణలు అందుబాటులో ఉన్నాయి. నేతాజీ ఆ రోజున ఒక విదేశీ గడ్డపై మరణించినట్లు అవి చూపిస్తున్నాయి. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో అతని అవశేషాలకు 'తాత్కాలిక' ఇంటిని జపాన్ అందించింది. మూడు తరాల పూజారులు నేతాజీ పట్ట భక్తి శ్రద్ధలు చూపారు. నేతాజీ జపాన్ ప్రజల గౌరవాన్ని పొందారు..’ అని ఆమె పేర్కొన్నారు.
‘స్వేచ్ఛగా తన దేశానికి తిరిగి రావాలన్నదే అతని ప్రియమైన కోరిక.. తన కోరిక నెరవేర్చాలన్నదే నా అభిమతం. చివరికి ఈ రూపంలో నెరవేరుతుంది..’ అని అన్నారు.
‘ఇప్పుడు స్వేచ్ఛగా జీవిస్తున్న భారతీయులు, పాకిస్తానీలు, బంగ్లాదేశీయులందరూ నేతాజీ కుటుంబ సభ్యులే. నా సోదరులు, సోదరీమణులుగా నేను మీ అందరికీ నమస్కరిస్తున్నాను. నేతాజీని ఇంటికి తీసుకురావడానికి నా ప్రయత్నాలకు మద్దతు ఇవ్వమని కోరుతున్నాను..’ అని పేర్కొన్నారు.
టాపిక్