నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG 2024) పరీక్ష 2024 జూన్ 23 ఆదివారం జరగనుంది. దేశవ్యాప్తంగా 300 నగరాల్లో 1000కు పైగా పరీక్షా కేంద్రాల్లో ఈ నీట్ పీజీ 2024 పరీక్ష జరగనుంది. నీట్ పీజీ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహిస్తారు.
పరీక్ష నిర్వహణలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణల మధ్య నీట్ యూజీ 2024 రాసిన అభ్యర్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. చండీగఢ్ లో రెండు, మేఘాలయ, హరియాణా, ఛత్తీస్ గఢ్, గుజరాత్ లలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఆరు కేంద్రాల్లో పరీక్ష ప్రారంభంలో జాప్యం కారణంగా 'గ్రేస్ మార్కులు' పొందిన 1,563 మంది నీట్ యూజీ 2024 అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 23న రీ టెస్ట్ నిర్వహించనుంది.
నీట్ పీజీ 2024 (NEET PG 2024)పరీక్ష జూన్ 23, ఆదివారం రోజు ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య జరగనుంది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది మార్గదర్శకాలను కచ్చితంగా ఫాలో కావాల్సి ఉంటుంది.
నీట్ పీజీ 2024 మూడున్నర గంటల నిడివి గల పరీక్ష, ఇందులో 200 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQ) ఉంటాయి. మార్కింగ్ స్కీమ్ ప్రకారం ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు, ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. కాగా, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (neet ug 2024) పరీక్షలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో జూన్ 23న జరగాల్సిన నీట్-పీజీ పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.