పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా జమ్మూకశ్మీర్ లోని 48 పబ్లిక్ పార్కులు, పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. కశ్మీర్ లోని 87 పబ్లిక్ పార్కులు, ఉద్యానవనాల వంటి పర్యాటక కేంద్రాల్లో 48 పర్యాటక కేంద్రాలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
మూసివేసిన ప్రదేశాలలో దూష్పత్రి, కోకెర్నాగ్, డుక్సమ్, సింథాన్ టాప్, అచ్ఛబాల్, బంగస్ వ్యాలీ, మార్గన్ టాప్, తోసమైదాన్ వంటి ప్రసిద్ధ, అభివృద్ధి చెందుతున్న పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అధికారిక ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ప్రకటించనప్పటికీ, ఈ పర్యాటక ప్రదేశాల మూసివేతను క్షేత్రస్థాయిలో అమలు చేశారు. గేట్లకు తాళం వేసి, వాటిలోకి ప్రవేశాలను నిలిపివేశారు.
దక్షిణ కాశ్మీర్ లోని అనేక మొఘల్ గార్డెన్స్ లలో కూడా పర్యాటకుల ప్రవేశాలను నిలిపివేశారు. పహల్గామ్ రిసార్టులోని బైసరన్ పచ్చిక బయళ్లలో ఉగ్రవాదులు 26 మందిని కాల్చి చంపిన వారం తర్వాత పర్యాటక ప్రాంతాలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కశ్మీర్ లో పర్యాటకం కీలక ఆర్థిక స్తంభంగా ఉన్నందున, షట్ డౌన్ రాష్ట్రాన్ని, స్థానికులను గణనీయమైన దెబ్బ తీస్తుంది. అయితే స్థానికులు, సందర్శకుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఏప్రిల్ 28-29 రాత్రి నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం తన కాల్పులను కొనసాగించింది, కుప్వారా, బారాముల్లా జిల్లాలకు ఎదురుగా ఉన్న ప్రాంతాలను, అలాగే అఖ్నూర్ సెక్టార్ ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. అయితే పాక్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు దీటుగా బదులిచ్చామని భారత సైన్యం తెలిపింది. కశ్మీర్ ఉగ్ర దాడి తర్వాత భారత్ పాక్ పై సింధు జలాల ఒప్పందం రద్దు వంటి పలు కఠిన దౌత్య పరమైన చర్యలు తీసుకుంది.