భద్రతా కారణాలతో కశ్మీర్ లో 48 పర్యాటక ప్రాంతాలను మూసివేసిన ప్రభుత్వం-nearly 50 tourist spots in kashmir shut amid security concerns ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భద్రతా కారణాలతో కశ్మీర్ లో 48 పర్యాటక ప్రాంతాలను మూసివేసిన ప్రభుత్వం

భద్రతా కారణాలతో కశ్మీర్ లో 48 పర్యాటక ప్రాంతాలను మూసివేసిన ప్రభుత్వం

Sudarshan V HT Telugu

పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్ లోని 87 పర్యాటక ప్రదేశాల్లో సున్నితమైన ప్రాంతాల్లో ఉన్న 48 పర్యాటక ప్రదేశాలను మూసివేశారు.

శ్రీనగర్ లో మూతపడిన బాదామ్ వరీ గార్డెన్

పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా జమ్మూకశ్మీర్ లోని 48 పబ్లిక్ పార్కులు, పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. కశ్మీర్ లోని 87 పబ్లిక్ పార్కులు, ఉద్యానవనాల వంటి పర్యాటక కేంద్రాల్లో 48 పర్యాటక కేంద్రాలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు.

వీటిని మూసేశారు

మూసివేసిన ప్రదేశాలలో దూష్పత్రి, కోకెర్నాగ్, డుక్సమ్, సింథాన్ టాప్, అచ్ఛబాల్, బంగస్ వ్యాలీ, మార్గన్ టాప్, తోసమైదాన్ వంటి ప్రసిద్ధ, అభివృద్ధి చెందుతున్న పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అధికారిక ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ప్రకటించనప్పటికీ, ఈ పర్యాటక ప్రదేశాల మూసివేతను క్షేత్రస్థాయిలో అమలు చేశారు. గేట్లకు తాళం వేసి, వాటిలోకి ప్రవేశాలను నిలిపివేశారు.

ఆర్థికంగా దెబ్బ

దక్షిణ కాశ్మీర్ లోని అనేక మొఘల్ గార్డెన్స్ లలో కూడా పర్యాటకుల ప్రవేశాలను నిలిపివేశారు. పహల్గామ్ రిసార్టులోని బైసరన్ పచ్చిక బయళ్లలో ఉగ్రవాదులు 26 మందిని కాల్చి చంపిన వారం తర్వాత పర్యాటక ప్రాంతాలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కశ్మీర్ లో పర్యాటకం కీలక ఆర్థిక స్తంభంగా ఉన్నందున, షట్ డౌన్ రాష్ట్రాన్ని, స్థానికులను గణనీయమైన దెబ్బ తీస్తుంది. అయితే స్థానికులు, సందర్శకుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

భారత్- పాక్ ల మధ్య ఉద్రిక్తతలు

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఏప్రిల్ 28-29 రాత్రి నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం తన కాల్పులను కొనసాగించింది, కుప్వారా, బారాముల్లా జిల్లాలకు ఎదురుగా ఉన్న ప్రాంతాలను, అలాగే అఖ్నూర్ సెక్టార్ ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. అయితే పాక్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు దీటుగా బదులిచ్చామని భారత సైన్యం తెలిపింది. కశ్మీర్ ఉగ్ర దాడి తర్వాత భారత్ పాక్ పై సింధు జలాల ఒప్పందం రద్దు వంటి పలు కఠిన దౌత్య పరమైన చర్యలు తీసుకుంది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.