నవీ ముంబైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రీల్స్ చేసేటప్పుడు గొడవ జరగడంతో ఒక 12ఏళ్ల బాలికను ఓ 17ఏళ్ల బాలుడు చంపేశాడు! రాయితో తల మీద కొట్టి కొట్టి హత్య చేశాడు.
నవీ ముంబైలోని శిరావనే ఎంఐడీసీ అనే ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. 12ఏళ్ల బాలికకు 17ఏళ్ల బాలుడితో ముందే పరిచయం ఉంది. అతను, ఆ బాలిక ఇంటికి సమీపంలోనే నివాసముంటున్నాడు. వీరిద్దరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేవారు.
గురువారం, ఎప్పటిలానే వీరిద్దరు కలిసి రీల్స్ చేయడం మొదలుపెట్టారు. శిరావనే ఎంఐడీసీలోని అటవీ ప్రాంతంలో రీల్స్ చేస్తుండగా గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్తా తీవ్రమైంది. కోపంతో ఊగిపోయిన ఆ బాలుడు.. బాలికపై దాడి చేశాడు. పక్కనే ఉన్న రాయి తీసుకుని ఆమె తల మీద పలుమార్లు బలంగా కొట్టాడు. ఆ బాలిక కిందపడిపోయింది. ఆమె ఫోన్ తీసుకుని, అతను అక్కడి నుంచి పారిపోయాడు.
బాలిక ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఎంఐడీసీ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో గాలింపు చర్యలు మొదలయ్యాయి. అటవీ ప్రాంతంలో తీవ్ర రక్తస్రావంతో కిందపడిపోయిన బాలికను గుర్తించారు. ఆమెను డీవీ పాటిల్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు.
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలేం జరిగింది? అని తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతలో ఆ 17ఏళ్ల బాలుడు.. తన దగ్గర ఉన్న బాలిక ఫోన్ని ఆమె కుటుంబసభ్యులకు తిరిగిచ్చాడు. ఇక్కడే అనుమానాలు మొదలయ్యాయి.
బాలిక ఫోన్ అతని దగ్గర ఎలా ఉంది? అని అందరు అనుమానించారు. అతడిని పోలీసులు విచారించారు. అతడి ఫోన్ని పోలీసులు ట్రాక్ చేశారు. ఘటన జరిగిన సమయంలో బాలుడి ఫోన్ లోకేషన్కి, అతను చెబుతున్న వివరాలు పొంతలేదని అర్థమైంది. ఇదే విషయం చెప్పగా, చివరికి బాలుడు చేసిన నేరాన్ని అంగీకరించాడు. రీల్స్ విషయంలో గొడవ జరిగిందని, కోపంతో రాయితో బాలిక తలపై కొట్టినట్టు ఒప్పుకున్నాడు.
బాలుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతనిపై మర్డర్ కేసు వేశారు. జువనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు.
మరోవైపు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రీల్స్ విషయంలో చిన్న గొడవ.. ఒక బాలిక మరణానికి కారణమైందని తెలిసి అందరు షాక్కు గురవుతున్నారు. క్షణికావేశంలో జరుగుతున్న ఘోరాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత కథనం