‘రీల్స్​’ విషయంలో గొడవ- 12ఏళ్ల బాలికను కొట్టి చంపిన 17ఏళ్ల బాలుడు!-navi mumbai crime news fight over shooting reels leads 17 year old to kill 12 year old girl ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘రీల్స్​’ విషయంలో గొడవ- 12ఏళ్ల బాలికను కొట్టి చంపిన 17ఏళ్ల బాలుడు!

‘రీల్స్​’ విషయంలో గొడవ- 12ఏళ్ల బాలికను కొట్టి చంపిన 17ఏళ్ల బాలుడు!

Sharath Chitturi HT Telugu

నవీ ముంబైలో దారుణం! ఓ 12ఏళ్ల బాలిక హత్యకు గురైంది. చంపింది ఓ 17ఏళ్ల బాలుడు. ఎందుకో తెలుసా? రీల్స్​ చేస్తుండగా గొడవ జరగడంతో బాలికను అతను చంపేశాడు!

నవీ ముంబైలో దారుణం!

నవీ ముంబైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రీల్స్​ చేసేటప్పుడు గొడవ జరగడంతో ఒక 12ఏళ్ల బాలికను ఓ 17ఏళ్ల బాలుడు చంపేశాడు! రాయితో తల మీద కొట్టి కొట్టి హత్య చేశాడు.

ఇదీ జరిగింది..

నవీ ముంబైలోని శిరావనే ఎంఐడీసీ అనే ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. 12ఏళ్ల బాలికకు 17ఏళ్ల బాలుడితో ముందే పరిచయం ఉంది. అతను, ఆ బాలిక ఇంటికి సమీపంలోనే నివాసముంటున్నాడు. వీరిద్దరు ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్​ చేసేవారు.

గురువారం, ఎప్పటిలానే వీరిద్దరు కలిసి రీల్స్​ చేయడం మొదలుపెట్టారు. శిరావనే ఎంఐడీసీలోని అటవీ ప్రాంతంలో రీల్స్​ చేస్తుండగా గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్తా తీవ్రమైంది. కోపంతో ఊగిపోయిన ఆ బాలుడు.. బాలికపై దాడి చేశాడు. పక్కనే ఉన్న రాయి తీసుకుని ఆమె తల మీద పలుమార్లు బలంగా కొట్టాడు. ఆ బాలిక కిందపడిపోయింది. ఆమె ఫోన్​ తీసుకుని, అతను అక్కడి నుంచి పారిపోయాడు.

బాలిక ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఎంఐడీసీ స్టేషన్​లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో గాలింపు చర్యలు మొదలయ్యాయి. అటవీ ప్రాంతంలో తీవ్ర రక్తస్రావంతో కిందపడిపోయిన బాలికను గుర్తించారు. ఆమెను డీవీ పాటిల్​ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు.

ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలేం జరిగింది? అని తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతలో ఆ 17ఏళ్ల బాలుడు.. తన దగ్గర ఉన్న బాలిక ఫోన్​ని ఆమె కుటుంబసభ్యులకు తిరిగిచ్చాడు. ఇక్కడే అనుమానాలు మొదలయ్యాయి.

బాలిక ఫోన్​ అతని దగ్గర ఎలా ఉంది? అని అందరు అనుమానించారు. అతడిని పోలీసులు విచారించారు. అతడి ఫోన్​ని పోలీసులు ట్రాక్​ చేశారు. ఘటన జరిగిన సమయంలో బాలుడి ఫోన్​ లోకేషన్​కి, అతను చెబుతున్న వివరాలు పొంతలేదని అర్థమైంది. ఇదే విషయం చెప్పగా, చివరికి బాలుడు చేసిన నేరాన్ని అంగీకరించాడు. రీల్స్​ విషయంలో గొడవ జరిగిందని, కోపంతో రాయితో బాలిక తలపై కొట్టినట్టు ఒప్పుకున్నాడు.

బాలుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతనిపై మర్డర్​ కేసు వేశారు. జువనైల్​ జస్టిస్​ బోర్డు ముందు హాజరుపరిచారు.

మరోవైపు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రీల్స్​ విషయంలో చిన్న గొడవ.. ఒక బాలిక మరణానికి కారణమైందని తెలిసి అందరు షాక్​కు గురవుతున్నారు. క్షణికావేశంలో జరుగుతున్న ఘోరాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.