Narendra Modi podcast: ‘మూడు రోజుల ఎమ్మెల్యేను’.. తొలి పాడ్ కాస్ట్ లో ‘గోద్రా ఘటన’ ను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ-narendra modi podcast pm touches upon godhra train incident says i felt everything ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Narendra Modi Podcast: ‘మూడు రోజుల ఎమ్మెల్యేను’.. తొలి పాడ్ కాస్ట్ లో ‘గోద్రా ఘటన’ ను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ

Narendra Modi podcast: ‘మూడు రోజుల ఎమ్మెల్యేను’.. తొలి పాడ్ కాస్ట్ లో ‘గోద్రా ఘటన’ ను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ

Sudarshan V HT Telugu
Jan 10, 2025 06:19 PM IST

Narendra Modi podcast: ప్రధాని నరేంద్ర మోదీ తొలి పాడ్ కాస్ట్ సంచలనంగా మారింది. తన బాల్యం, రాజకీయాలు, విదేశీ సంబంధాలు తదితర అంశాలను మోదీ తన తొలి పాడ్ కాస్ట్ లో ప్రస్తావించారు. అలాగే, వివాదాస్పద గోద్రా ఘటనను కూడా గుర్తు చేసుకున్నారు.

ప్రధాని మోదీ తొలి పాడ్ కాస్ట్
ప్రధాని మోదీ తొలి పాడ్ కాస్ట్ (PTI)

Narendra Modi first podcast: తన తొలి పాడ్ కాస్ట్ లో ప్రధాని మోదీ 2002 నాటి గోద్రా ఘటనను గురించి వివరించారు. అలాగే, 2005లో అమెరికా తనకు వీసాను తిరస్కరించిన విషయంతో పాటు పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావించారు. స్టాక్ ట్రేడింగ్ యాప్ జెరోధా కో- ఫౌండర్ నిఖిల్ కామత్ తో కలిసి ప్రధాని మోదీ ఈ పాడ్ కాస్ట్ నిర్వహించారు.

yearly horoscope entry point

గోధ్రా ఘటన గురించి..

గోధ్రా రైలు దహనం వార్త తనకు తాను అసెంబ్లీలో ఉండగా తెలిసిందని ప్రధాని మోదీ వెల్లడించారు. వెంటనే తాను గోధ్రాకు వెళ్లానని, అక్కడ ఆ బాధాకరమైన సన్నివేశాన్ని చూసి అన్ని రకాల ఎమోషన్స్ అనుభవించానని తెలిపారు. అయితే, తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నందున, ఎంతో కష్టం మీద భావోద్వేగాలను నియంత్రించుకున్నానని ప్రధాని మోదీ వివరించారు.

మూడు రోజుల ఎమ్మెల్యేను..

‘‘2002 ఫిబ్రవరి 24న తొలిసారి ఎమ్మెల్యే అయ్యాను. ఫిబ్రవరి 27న అసెంబ్లీకి వెళ్లాను. గోద్రా రైలు దహనం ఘటన జరిగినప్పుడు నేను మూడు రోజుల ఎమ్మెల్యేగా ఉన్నాను. మొదట రైలులో మంటలు చెలరేగినట్లు మాకు సమాచారం అందింది, తరువాత క్రమంగా మాకు ప్రాణనష్టం గురించి నివేదికలు వచ్చాయి. నేను సభలో ఉన్నాను. నేను చాలా ఆందోళన చెందాను. బయటకు రాగానే గోద్రాను సందర్శించాలని చెప్పాను. అయితే, అప్పుడు ఒక్క హెలికాఫ్టర్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ఓఎన్జీసీ సంస్థది. అయితే ఇది సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ కాబట్టి వీఐపీని అందులో ప్రయాణించడానికి అనుమతించలేమని వారు చెప్పారు. ఏం జరిగినా నేనే బాధ్యత వహిస్తానని వారికి చెప్పి అందులో గోద్రా వెళ్లాను' అని ప్రధాని మోదీ అన్నారు.

హృదయ విదారక దృశ్యాలు..

తాను గోద్రాకు చేరుకున్న తరువాత అక్కడ అత్యంత బాధాకరమైన దృశ్యాలను చూశానని మోదీ చెప్పారు. "నేను గోద్రా చేరుకున్నాను, ఆ బాధాకరమైన దృశ్యాన్ని, ఆ మృతదేహాలను చూశాను... ఎన్నో భావోద్వేగాలు నాలో చెలరేగాయి. అయితే, అప్పుడు నేను ముఖ్యమంత్రిని. నా భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సిన, నా సహజ ధోరణులకు దూరంగా ఉండవలసిన స్థితిలో ఉన్నానని నాకు తెలుసు. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి నేను చేయగలిగినదంతా చేశాను" అని మోదీ వివరించారు.

అమెరికా వీసా తిరస్కరణపై..

తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అమెరికా వీసా నిరాకరించిన ఘటనను కూడా ప్రధాని మోదీ గుర్తు చేశారు. ‘‘అమెరికా ప్రభుత్వం వీసా (visa) ఇవ్వడానికి నిరాకరించినప్పుడు నేను సీఎంగా ఉన్నాను. ఒక వ్యక్తిగా, అమెరికా వెళ్ళడం పెద్ద విషయం కాదు. నేను ఇంతకు ముందు కూడా సందర్శించాను. కానీ ఒక ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం ఉన్న దేశాన్ని అగౌరవ పరచడాన్ని నేను అనుభవించాను. ఆ సమయంలో నా మనస్సులో సందిగ్ధత ఉంది. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అమెరికా ప్రభుత్వం నా వీసాను తిరస్కరించిన విషయాన్ని చెప్పాను. భారతదేశ వీసాల కోసం ప్రపంచం క్యూలో నిలబడే రోజులను చూస్తానని కూడా చెప్పాను. ఇది 2005లో నేను చేసిన ప్రకటన, ఈ రోజు మనం 2025లో ఉన్నాం. ఇప్పుడు భారతదేశానికి చెందిన సమయం నడుస్తోంది" అని ఆయన అన్నారు.

భారత్ కు రెండు మాటలు ఉండవు..

ఇప్పుడు ప్రపంచ వ్యవహారాలలో భారతదేశం కీలక భూమిక పోషిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. అందుకు కారణం, భారత్ కు ద్వంద్వ వైఖరి లేకపోవడమేనన్నారు. అందుకే ప్రపంచం భారతదేశాన్ని విశ్వసిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ప్రపంచం మమ్మల్ని విశ్వసిస్తుంది, ఎందుకంటే మనలో ద్వంద్వ వైఖరి లేదు. మేము ఏమి చెప్పినా స్పష్టంగా చెబుతాము. చెప్పిందే చేస్తాము. నేను శాంతికి అనుకూలంగా ఉన్నాను, దాని కోసం ఏ ప్రయత్నాలు చేసినా నేను మద్దతు ఇస్తాను. ఈ విషయాన్ని రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలకు చెబుతున్నా. నాపై వారికి నమ్మకం ఉందని, నేను చెప్పింది కరెక్టేనని వారు అన్నారు’’ అని మోదీ వెల్లడించారు.

జిన్ పింగ్ గుజరాత్ పర్యటన

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ గుజరాత్ పర్యటన కథను కూడా ప్రధాని మోదీ (narendra modi) వివరించారు. '2014లో నేను ప్రధాని అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేతలు మర్యాదపూర్వకంగానే ఫోన్లు చేశారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా మర్యాదపూర్వకంగా ఫోన్ చేసి తాను భారత్ కు రావాలనుకుంటున్నట్లు చెప్పారు. 'మీకు స్వాగతం, తప్పక రావాలి' అన్నాను. 'నేను గుజరాత్, మీ గ్రామం వాద్ నగర్ ను కూడా సందర్శించాలనుకుంటున్నాను. ఎందుకో మీకు తెలుసా? మీకు, నాకు మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఉంది అని జిన్ పింగ్ అన్నారు. చైనీస్ తత్వవేత్త హ్యూయెన్ త్సాంగ్ మీ గ్రామం వాద్ నగర్ లో చాలా ఎక్కువ కాలం నివసించారు. అతను చైనాకు తిరిగి వచ్చిన తరువాత, అతను నా గ్రామంలో నివసించాడు' అని జిన్ పింగ్ చెప్పారు’’ అని మోదీ జిన్ పింగ్ వాద్ నగర్ పర్యటన విశేషాలను వివరించారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.