RSS speaks | ముస్లిం సమాజం కూడా స్పందించాలి - ఆరెస్సెస్
RSS speaks : ఇటీవల రాజస్తాన్లోని ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్యలాల్ దారుణ హత్యపై రాష్ట్రీయ స్వయం సేవక్ స్పందించింది. హేట్ క్రైమ్స్పై ముస్లిం సమాజం కూడా స్పందించాలని సూచించింది.
ఆరెస్సెస్ మూడు రోజుల ప్రాంత్ ప్రచారక్ల సదస్సు రాజస్తాన్లోని ఝున్ఝునులో శనివారం ముగిసింది. ఈ సందర్భంగా సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ ప్రచారక్లను ఉద్దేశించి ప్రసంగించారు.
ట్రెండింగ్ వార్తలు
RSS speaks : ప్రజాస్వామ్యబద్ధంగా..
ఆరెస్సెస్ మూడు రోజుల ప్రాంత్ ప్రచారక్ల సదస్సు రాజస్తాన్లోని ఝున్ఝునులో శనివారం ముగిసింది. చివరి రోజు సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ ప్రచారక్లను ఉద్దేశించి ప్రసంగించారు. నచ్చిన విషయాలు చాలా ఉంటాయని, వాటిపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపాలని ఈ సందర్భంగా ఆరెస్సెస్ నేత ముస్లిం సమాజానికి సూచించారు. హిందు సమాజం అలాగే ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలుపుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఉదయ్పూర్లో జరిగిన టైలర్ కన్హయ్యలాల్ హత్యను ముస్లిం సమాజం కూడా తీవ్రంగా ఖండించాలని కోరారు. ప్రజల సెంటిమెంట్లను, భావ ప్రకటన స్వేచ్ఛను గుర్తించాలని వ్యాఖ్యానించారు.
RSS speaks : కన్హయ్య హత్యకు ఖండన
ఉదయ్పూర్లో జూన్ నెలలో టైలర్ కన్హయ్యలాల్ను రియాజ్ అక్తర్, గౌస్ మొహమ్మద్ అనే ఇద్దరు దారుణంగా చంపేశారు. కత్తితో తల నరికి, ఆ దృశ్యాన్ని వీడియో తీసి భయోత్పాతం సృష్టించారు. మొహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను సపోర్ట్ చేసినందుకే ఈ హత్య చేస్తున్నామని, ప్రధాని మోదీకి కూడా ఇదే గతి పడుతుందని ఆ వీడియోలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో.. ఈ అంశం ఆరెస్సెస్ సభలో ప్రస్తావనకు వచ్చింది. అలాగే, ఈ ఘటనను ఆరెస్సెస్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంఘ్ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు.
RSS speaks : నాగరిక సమాజం మనది
భారత్ నాగరిక సమాజమని, ఇక్కడ నిరసనలను ప్రజాస్వామ్యబద్ధంగా తెలపాలని సంఘ్ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ వ్యాఖ్యానించారు. `ముస్లిం సమాజం కూడా ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తే బావుండేది. కొందరు మేధావులు స్పందించారు. కానీ ఈ ఘటనపై ముస్లిం సమాజంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపించలేదు. ఇలాంటి ఘటనలు దేశ ప్రయోజనాలకు మంచిది కాదు. దేశంలోని ప్రతీ ఒక్కరు ఇలాంటి ఘటనలను ఖండించాలి` అన్నారు.