ఎంత వీలైతే అంత మంది పిల్లల్ని కని, ప్రపంచ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా పెట్టుకున్న ఎలాన్ మస్క్.. దాన్ని సరికొత్త పంథాలో అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది! పిల్లల్ని కనేందుకు కావాల్సిన మహిళలను ఎక్స్ వేదికగా ఆయన 'రిక్రూట్' చేసుకుంటున్నట్టు వాల్స్ట్రీట్ జర్నల్ ఒక నివేదికను తాజాగా బయటపెట్టింది. అసలు ఏం జరిగిందంటే..
ప్రజలు పిల్లల్ని కనాలని ప్రోత్సహించే వారిలో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ముందు వరుసలో ఉంటారు. 'ప్రపంచానికి జననాల రేటు పతనానికి మించిన దారుణం ఏం ఉండదు. ప్రజలు పిల్లల్ని కనకపోతే ఇక అంతే!' అని మస్క్ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
అయితే పిల్లల్ని కనేందుకు మస్క్ ఎంత దూరం వెళతారు అనేది వాల్స్ట్రీట్ జర్నల్ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. నివేదిక ప్రకారం ప్రపంచ జనాభా కుప్పకూలడాన్ని అడ్డుకునేందుకు మస్క్ తన సొంత 'ఎక్స్'ని వాడుకుంటున్నారు. ఎక్స్ ద్వారా మస్క్ ఇప్పటికే అనేక మంది మహిళలను ప్రైవేట్గా సంప్రదించారు. తొలుత ఫ్లర్ట్ చేస్తారు. ఆ తర్వాత సంభాషనలను పెంచుతారు. చివరికి.. "నా పిల్లలకు తల్లి అవుతావా?" అని మహిళలను డైరక్ట్గా అడుగుతారు.
నివేదిక ప్రకారం ఇన్ఫ్లుయెంజర్ ఆష్లే సెంట్ క్లెయిర్ని మస్క్ ఈ విధంగానే సంప్రదించారు. తొలుత ఆమె పోస్టులను లైక్ చేశారు. ప్రైవేట్గా కామెంట్లు చేశారు. వారిద్దరి మధ్య కనెక్షన్ పెరిగింది. ఆమె ఎక్స్ ఆఫీస్కి కూడా వెళ్లింది. మస్క్తో రిలేషన్లో కూడా ఉంది. 2023లో మస్క్తో రోములస్ అనే బిడ్డకు జన్మనిచ్చింది.
ఇలా మహిళలను ఫ్లర్ట్ చేసి, వారితో పిల్లలు కనడంపై ఎలాన్ మస్క్ చాలా సీరియస్గా ఉన్నారు. మహిళలను డీల్ చేసేందుకు, పిల్లలు పుట్టాక వారికి సాయం చేసేందుకు ఏకంగా ఒక లీగల్ టీమ్నే మస్క్ నడుపుతున్నారని నివేదిక పేర్కొంది. పిల్లలు పుట్టిన తర్వాత ఈ టీమ్ సదరు మహిళను సంప్రదిస్తుంది. నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ భాగంగా వెంటనే 15 మిలియన్లను ఆఫర్ చేస్తుంది. ఈ పూర్తి వ్యవహారంపై మౌనంగా ఉండేందుకు, బిడ్డ 21ఏళ్లు వచ్చేంత వరకు నెలకు 1,00,000 డాలర్లు మహిళలకు ఇస్తారు.
అయితే ఆష్లే ఈ ఒప్పందానికి ఒప్పుకోలేదు. "నా బిడ్డను రహస్యంగా పెంచడం నాకు ఇష్టం లేదు," అని ఆమె చెప్పారు.
పబ్లిక్ తెలిసిన దాని ప్రకారం మస్క్కి 14మంది పిల్లలు. కానీ అంతకన్నా ఎక్కువ మందే ఉంటారని నివేదిక చెబుతోంది. సరైన నెంబర్పై మాత్రం క్లారిటీ లేదు. కానీ స్పష్టంగా ఉన్న విషయం ఏంటంటే.. ఈ పూర్తి వ్యవహారం చాలా సీక్రెట్గా జరుగుతుండం!
మస్క్ లీగల్ టీమ్లో ప్రధాన సభ్యుడి పేరు బిర్చల్. ఆయన మస్క్కి సన్నిహితుడు. మస్క్ ఫ్యామిలీ ఆఫీస్ని మేనేజ్ చేస్తుంటాడు. ఆయన న్యూరోలింక్ సీఈఓ, ఎక్స్ఏఐలో మస్క్తో పార్ట్నర్. అయితే వీటన్నింటి కన్నా.. మస్క్ పిల్లల్ని కనే విషయంపై ఆయన ఎక్కువ సాయం చేస్తారని నివేదిక చెబుతోంది. మస్క్ సంప్రదించిన మహిళలతో మాట్లాడటం, వారితో అగ్రిమెంట్ సెటిల్ చేయడం ఆయన పనట.
"మస్క్కి వ్యతిరేకంగా వెళితే కచ్చితంగా మంచి ఫలితాలు రావు," అని బిర్చర్ చెబుతుంటారట.
నివేదిక ప్రకారం అష్లే ఒక్కరే కాదు, ఇలా మస్క్ చాలా మందిని సంప్రదించారు. వారిలో ఒకరు టిఫనీ ఫాంగ్. ఆమె ఒక క్రిప్టో ఇన్ఫ్లుయెంజర్. ఎక్స్లో ఆమెను కలిసిన మస్క్ లైక్స్, ప్రైవేట్ మెసేజ్ల ద్వారా దగ్గరయ్యారు. ఆమెను ఒక్కసారి కూడా డైరక్ట్గా కలవకుండానే తన పిల్లలకు తల్లి అవ్వాలని మస్క్ కోరారు. కానీ కుటుంబ కారణాలతో ఆమె ఒప్పుకోలేదు. కానీ ఆమె ఇతరులకు ఆ చాట్స్ని చూపించింది. ఈ విషయం తెలిసి మస్క్ ఆమెకు దూరం జరిగారు. ఆ తర్వాత ఎక్స్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్ నుంచి ఆమెను తప్పించారు. ఫలితంగా ఆమె ఆదాయం దారుణంగా పతనమైంది.
ఇదే విధంగా కలిసిన న్యూరోలింక్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్తో మస్క్ నలుగురు పిల్లల్ని కన్నారు. తన టర్మ్స్ అండ్ కండీషన్లకు ఒప్పుకునే మహిళలను ఆయన బాగా చూసుకుంటారు. ఒప్పుకోకపోతే మాత్రం మహిళలు కోర్టుల చుట్టూ తిరుగుతారు.
"ఈ మొత్తం చాలా రహస్యంగా సాగుతుంది. రహస్యంగా ఉండేందుకు వెనక చాలా ప్రయత్నాలు జరుగుతాయి. ఇది ప్రైవసీ కోసం కాదు- కంట్రోల్ కోసం జరుగుతోంది," అని సంబంధిత వర్గాలు చెప్పాయని వాల్స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది.
సంబంధిత కథనం