ముంబైలోని 86 ఏళ్ల మహిళ సైబర్ మోసానికి, డిజిటల్ అరెస్ట్ మోసానికి బలి అయ్యింది. ఆధార్ కార్డు దుర్వినియోగం గురించి కాల్ వచ్చిన తర్వాత రూ. 20 కోట్లకు పైగా కోల్పోయింది.
ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం, మోసగాళ్లు పోలీసు అధికారులుగా చెప్పుకొని బాధితురాలికి ఫోన్ చేశారు. ఆమె ఆధార్ కార్డును అక్రమ కార్యకలాపాలకు దుర్వినియోగం చేస్తున్నారని ఆమెను ఒప్పించి, కేసును పరిష్కరించడానికి అనేక బ్యాంక్ ఖాతాలకు డబ్బులు బదిలీ చేయమని బలవంతం చేశారు.
గతేడాది డిసెంబర్ 26 నుండి మార్చి 3 వరకు, మోసగాళ్లు రూ. 20.25 కోట్లను బాధితురాలి నుండి దోచుకున్నారని నివేదిక పేర్కొంది.
పోలీసు అధికారిగా చెప్పుకున్న ఒక వ్యక్తి కాల్ చేసి బాధితురాలి ఆధార్ కార్డు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి కొత్త బ్యాంక్ ఖాతాను తెరిచారని, ఆ ఖాతాను అక్రమ కార్యకలాపాలకు సంబంధించి డబ్బు బదిలీలకు ఉపయోగిస్తున్నారని చెప్పారు.
ఆ తరువాత మోసగాళ్లు తమ ప్రణాళికలో భాగంగా తదుపరి దశను ప్రారంభించారు. కాల్ చేసిన వ్యక్తి ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఆ కేసులో ఆమె పేరు, ఆమె కుమార్తెతో సహా ఆమె కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయని చెప్పారు. ఆ ఇబ్బంది నుండి బయటపడటానికి, ఆమె అనేక బ్యాంక్ ఖాతాలకు డబ్బులు బదిలీ చేయాలని సూచించారు.
ఈ మొత్తం ప్రక్రియలో మోసగాళ్లు బాధితురాలిని ‘డిజిటల్ అరెస్ట్’ కింద ఉండాలని సూచించారు. ఆమె ఎవరితోనూ సమాచారాన్ని పంచుకోకుండా నిరోధించారు.
బాధితురాలు ఈ మోసం గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి, బదిలీలను ట్రాక్ చేసి మోసగాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలిసింది. దర్యాప్తు కొనసాగుతోంది.
సంబంధిత కథనం