Mumbai Mira Road murder: ముంబై హత్య కేసులో వెలుగుచూస్తున్న విస్తుపోయే వాస్తవాలు
దేశవ్యాప్తంగా ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన ముంబై హత్య ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మనోజ్ సహాని అనే 56 ఏళ్ల వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న సరస్వతి వైద్య అనే మహిళను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు, ముక్కలుగా నరికి, వాటిని ఉడకించిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన ముంబై మీరా రోడ్డు హత్య ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మనోజ్ సహాని అనే 56 ఏళ్ల వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న సరస్వతి వైద్య అనే మహిళను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు, ముక్కలుగా నరికి, వాటిని ఉడకబెట్టిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో ఈ కేసులో మరిన్ని ఆశ్చర్యకర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
వారిద్దరు భార్యాభర్తలు
మనోజ్ సహాని, సరస్వతి వైద్య సహజీవనం చేస్తున్నారన్న విషయం సరి కాదని, వారిద్దరికి వివాహమైందని తెలిసింది. అనాథాశ్రమంలో పెరిగిన సరస్వతికి మరో ముగ్గురు చెల్లెళ్లు కూడా ఉన్నారు. వారు శుక్రవారం పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ వాంగ్మూలం ఇచ్చారు. వారు తెలిపిన సమాచారం ప్రకారం.. మనోజ్, సరస్వతిలకు వివాహమైంది. ఒక గుడిలో వారు పెళ్లి చేసుకున్నారు. వారిద్దరు భార్యాభర్తలు. అయితే, వారిద్దరి మధ్య వయస్సు తేడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల తమకు పెళ్లైన విషయాన్ని వారు ఎవరికీ చెప్పుకోలేదు.
మనోజ్ కు ఎయిడ్స్..
తనకు 2008 లోనే ఎయిడ్స్ సోకిందని, సరస్వతి వైద్యతో తనకు శారీరక సంబంధం లేదని మనోజ్ సహానీ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే, ఈ హత్య చేసినట్లు ఆయన ఇప్పటివరకు అంగీకరించలేదు. సరస్వతి వైద్య తనకు కూతురు వంటిదని, తమ మధ్య శారీరక సంబంధం లేదని మనోజ్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. సరస్వతి వైద్య 10వ తరగతి పరీక్షలకు హాజరు కావాలనుకుందని, ఆమెకు తాను గణితం కూడా బోధించానని మనోజ్ పోలీసులకు తెలిపాడు.
హత్య కు కారణమేంటి?
అయితే, హత్య చేసినట్లుగా మనోజ్ అంగీకరించకపోవడంతో సరస్వతి వైద్య మరణానికి కారణమేంటనే విషయం పోలీసులకు సవాలుగా మారింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని, పోలీసులకు తెలిస్తే, తననే అనుమానించి అరెస్ట్ చేస్తారనే భయంతో మృతదేహాన్ని ముక్కలు, ముక్కలుగా చేసి, రహస్యంగా బయట పడేయాలనుకున్నానని మనోజ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
కిచెన్ లో శరీర భాగాలను ఉడకపెడుతూ..
మనోజ్, సరస్వతి ఉంటున్న ఫ్లాట్ లో నుంచి భరించలేని దుర్వాసన వస్తోందని స్థానికుల నుంచి సమాచారం రావడంతో ఆ ఫ్లాట్ లోకి వెళ్లిన పోలీసులకు అక్కడ కిచెన్ లో మనోజ్ కనిపించాడు. ఒక గిన్నెలో సరస్వతి శరీర భాగాలను వేసి స్టవ్ పై ఉడికించే ప్రయత్నం చేస్తున్న సమయంలో అక్కడికి పోలీసులు వెళ్లారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొన్ని శరీర భాగాలను స్టవ్ పై ఉడికించి, వాటిని గ్రైండ్ చేసి, వీధి కుక్కలకు వేసినట్లు పోలీసుల ముందు నిందితుడు అంగీకరించారని పోలీసు వర్గాలు తెలిపాయి.